నర్సీపట్నం: ఆకుమడుల్లో అక్కడక్కడ పాయ తెగులు వ్యాపించిందని నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కొండెంపూడి ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ రాజుకుమార్ రైతులకు సూచించారు. కేవీకే కొండెంపూడి వ్యవసాయ కళాశాల విద్యార్థులు, డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్ సంయుక్తంగా రైతన్న మీకోసం కార్యక్రమాన్ని నర్సీపట్నం మండలం, ధర్మసాగరంలో శుక్రవారం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ఆకుమడులను పరిశీలించారు. పాయ తెగులు వ్యాపించినందున ప్రొపికోనాజోల్ పిచికారీ చేయాలన్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల వరి నాట్లు వేసే పరిస్థితి కనబడటం లేనందున ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాలైన జొన్నలు, సజ్జలు, రాగులు తదితర పంటలను వేసుకోవాలన్నారు. డీఆర్సీ ఏవో పి.విజేత మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావం వల్ల పంటలు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. రైతులు విధిగా క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలన్నారు. ఒక వేళ వరి వేసే పరిస్థితి ఉంటే తేలిక రకాలు వెదజల్లే పద్ధతిలో వేసుకోవాలన్నారు. ఉద్యానశాస్త్రవేత్త డాక్టర్ సత్తిబాబు మాట్లాడుతూ ఉద్యాన వన పంటలకు తగు మోతాదులో నీరు అందించడం అనివార్యమన్నారు. ఉద్యాన పంటలకు డ్రిప్ పద్ధతిలో నీటిని అందించడం, మొక్కలు వేరు భాగంలో మల్చింగ్ చేయడం మంచిదన్నారు. ఈకార్యక్రమంలో ఏవో విజయలక్ష్మి, జెడ్పీటీసీ సుకల రమణమ్మ, వ్యవసాయ యాంత్రీకరణ శాస్త్రవేత్త ఎస్.కె.బాబు, రైతు సేవాకేంద్రం అధికారి కె.భవాని, రైతు సేవా కేంద్రం అధికారి ఎల్.ఉష, రైతులు పాల్గొన్నారు.


