● జిల్లా వ్యవసాయశాఖాధికారి నందు
ముంచంగిపుట్టు: వర్షాభావ పరిస్థితులను బట్టి ప్రత్యామ్నాయ పంటలను రైతులు సాగు చేసుకోవాలని జిల్లా వ్యవసాయశాఖాధికారి ఎస్బీఎస్ఎన్ నందు సూచించారు. మండలంలోని ఏనుగురాయి పంచాయ తీ కేంద్రంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ‘రైతు కోసం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా వ్యవసాయశాఖాధికారి నందు మాట్లాడుతూ.. గిరిజన రైతులు అధిక లాభాలు వచ్చే పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యంగా వర్షాకాలంలో వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన పంటలను ఎంపిక చేసుకోవాలని, తక్కువ కాలపరిమితి కలిగిన రకాలను సాగు చేయా లని తెలిపారు. వరి పంటకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఎకరాకు రూ.640 ప్రీమియం చెల్లించి బీమా చేసుకుంటే పంట నష్టం సంభవించినప్పుడు రూ.42 వేల వరకు పరిహారం పొందవచ్చని వివరించారు. రైతులు ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. రాగులు, కందులు, సామలు, జొన్నలు, గంతెలు వంటి పంటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేయాలని సూచించారు. డీపీఎం భాస్కర్, ఏవో మురళీకృష్ణ, ఎంపీటీసీ సుబ్బ లక్ష్మి, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.


