● మాతోట స్టాల్కు విశేష ఆదరణ
● గిరిజన ఉత్పత్తులకు ప్రశంసలు
చింతపల్లి: మాతోట ట్రైబుల్ ఫార్మింగ్ ప్రొడ్యూసర్ కంపెనీ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఆర్గానిక్, నేచురల్ ప్రొడక్ట్స్ ఎక్స్పోలో గిరిజన ఉత్పత్తుల స్టాల్కు విశేష ఆదరణ లభించిందని గిరిజన వికాస్ సొసైటీ కార్యదర్శి నెల్లూరి సత్యనారాయణ తెలిపారు. ఈ నెల 6 నుంచి 8 వరకు జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రదర్శనలో ప్రపంచవ్యాప్తంగా నేచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ వ్యవసాయ రంగాల్లో పనిచేస్తున్న కంపెనీలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు పాల్గొంటున్నాయని తెలిపారు. మాతోట స్టాల్ను భారత సుగంధ ద్రవ్యాల బోర్డు చైర్పర్సన్ సంగీతా విశ్వనాథన్, సీఈవో ఎం.ఎస్. మణివన్ సందర్శించారు. స్టాల్లో గిరిజనులు సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్న పసుపు, మిరియాలు, కాఫీ, రాజ్మా తదితర ఉత్పత్తులను ప్రదర్శించారు. విశాఖ మన్యంలో కాఫీ, పసుపును అధికంగా సేంద్రీయ పద్ధతిలో సాగు చేస్తున్నామని మాతోట సీఈఓ చిన్నారావు వివరించారు. గిరిజన ప్రాంత ఉత్పత్తులపై ఆసక్తి చూపిన అధికారులు మాతోట సంస్థకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చినట్లు సత్యనారాయణ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రా–ఒడిశా స్పైస్ బోర్డు ప్రతినిధి కళ్యాణి పాల్గొన్నారు.


