నర్సీపట్నం: నా అవయవాలను దానం చేసి..ఎనిమిది మందికి పునర్జన్మనిస్తానని నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు వెల్లడించారు. జాతీయ అవయవదాన పక్షోత్సవాల్లో భాగంగా అఖిల భారత శరీర అవయవదాతల సంఘం ఆధ్వర్యంలో గురువారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవయవ దానంపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అవయవ దానం చేయాలనుకుంటున్నానని భార్య, కుమార్తెకు చెప్పడంతో అభ్యంతరం చెప్పలేదన్నారు. ప్రతి ఒక్కరూ అవయవదానం చేసేందుకు ముందుకు రావాలన్నారు. అవయ దానం చేయడం ద్వారా ఎనిమిది మందికి పునర్జన్మ ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థులు, యువత డ్రగ్స్ లాంటి మత్తుకు బానిసలు కాకుండా మంచి మార్గంలో నడవాలని కోరారు. రక్తదానం, నేత్రదానం, అవయవ దానం లాంటి సేవా కార్యక్రమాల పట్ల ఆకర్షితులు కావాలని పిలుపునిచ్చారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.రాజు, అవయవ దానం ట్రస్ట్ ప్రతినిధులు శివాజీ, బేరా బాబ్జి, బాబీ మాస్టర్ పాల్గొన్నారు.


