ముంచంగిపుట్టు: గంజాయి అక్రమ రవాణా కేసులో పరారీలో ఉన్న నిందితుడిని అరెస్టు చేసినట్లు జి.మాడుగుల సీఐ ఎస్. లక్ష్మణరావు తెలిపారు. వివరాల ప్రకారం.. ముంచంగిపుట్టు మండలం బంగారుమెట్ట పంచాయతీ కుజభంగి జంక్షన్ వద్ద ఎస్పీ నాని ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గత నెల ఒడిశా రాష్ట్రంలోని చిత్రకొండ బ్లాక్ నుంచి 1,373.72 కిలోల గంజాయిని అక్రమంగా రవాణా చేసిన కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఒడిశా రాష్ట్రం పొట్టంగి బ్లాక్ మలిసాహి గ్రామానికి చెందిన మాధబును గురువారం అరెస్టు చేశారు. అనంతరం నిందితుడిని స్థానిక పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి, కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించారు. ఈ సందర్భంగా సీఐ ఎస్. లక్ష్మణరావు మాట్లాడుతూ.. ఎస్పీ అమిత్ బర్థర్ ఆదేశాలతో గంజాయి అక్రమ రవాణా, సాగుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. గంజాయి కేసుల్లో పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు. గంజాయి రవాణా, సాగులో పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏఎస్ఐ లక్ష్మణరావు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.


