దేవరాపల్లి: దేవరాపల్లిలో గురువారం సాయంత్రం జనావాసాల్లోకి అడవి గొర్రె ప్రవేశించింది. స్థానికుల సమాచారంతో అటవీశాఖ అధికారులు దానిని పట్టుకొని సమీప అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు. అటవీ ప్రాంతంలో సంచరించే అడవి గొర్రె జనావాసాల్లోకి రావడంతో వీధి కుక్కలు తరుముతుండగా స్థానిక వైఎన్ కాంప్లెక్స్లో ప్రజలు చూసి దానిని రక్షించి వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే జీనబాడు ఫారెస్ట్ రేంజ్ అధికారి ఆర్.రాజుబాబు నేతృత్వంలో జీనబాడు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పి. శివకుమార్, బీట్ ఆఫీసర్ పి. సాయి ప్రణీత్తోపాటు బేస్ క్యాంప్ ప్రొటెక్షన్ వాచర్లు జె. సత్యనారాయణ, పి.దుర్గారావు దేవరాపల్లి చేరుకొని అటవీ గొర్రెను స్వాధీనం చేసుకున్నారు. ఆటోలో సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి దానిని విడిచి పెట్టారు.


