నర్సీపట్నం: పట్టణంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. సాయంత్రం 4 గంటల సమయంలో ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై వాతావరణం చల్లబడింది. అనంతరం వర్షం ప్రారంభమైంది. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో మెయిన్ రోడ్డుపై నీరు భారీగా ప్రవహించింది. అబిద్సెంటర్, ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి, బ్యాంక్ కాలనీకి వెళ్లే మెయిన్ రోడ్డు, శారదానగర్ మంగ్లీలాల్ స్వీట్స్టాల్, సత్యసాయి బాబా వీధి, శారదా నగర్ రెండవ లైన్ మెయిన్ రోడ్డు జలమయమయ్యాయి. మోకాళ్లలోతు నీటిలో ప్రజలు రాకపోకలు సాగించారు.
శారదానగర్లో అంధకారం
చిన్నపాటి వర్షం పడితే పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. శారదనగర్లో నాలుగు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారం అలుముకుంది. ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. విద్యుత్ సిబ్బందికి వినియోగదారులు ఫోన్లు చేసినా స్పందించని పరిస్థితి నెలకొంది.


