నాతవరం: దివంగత నేత వై.ఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేయడంతో నాతవరం ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. మండలంలో సరుగుడు పంచాయతీ శివారు రామన్నపాలెం గ్రామంలో గిరిజనులు వైఎస్సార్పై ఉన్న అభిమానంతో సొంత ఖర్చుతో 2013లో విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు. ఆనాటి నుంచి ఏటా వైఎస్సార్ జయంతి, వర్థంతి వేడుకలు గిరిజనులు జరుపుకొంటున్నారు. సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు వైఎస్సార్ విగ్రహంతో పాటు దిమ్మను ధ్వంసం చేశారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు ఎంపీపీ లక్ష్మణమూర్తి రామన్నపాలెంలో దుండగులు ధ్వంసం చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని మంగళవారం స్వయంగా పరిశీలించారు. జరిగిన విషయాన్ని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సూచనల మేరకు స్థానిక వైఎస్సార్సీపీ నేతలతో కలిసి ఎంపీపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కూటమి నేతల కనుసన్నల్లోనే విగ్రహ ధ్వంసం జరిగి ఉండొచ్చని ఎంపీపీ లక్ష్మణమూర్తి అనుమానం వ్యక్తం చేశారు. స్పీకర్ అయన్నపాత్రుడు ప్రాతినిద్యం వహించే నియోజకవర్గంలో తమ ప్రియతమ దివంగత నేత వైఎస్సార్ విగ్రహం ధ్వంసం జరగడం బాధాకరమని ఎంపీపీ లక్ష్మణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను పట్టుకుని చట్టపరమైన చర్యలు చేపట్టాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.
దుండగులు ధ్వంసం చేసిన విగ్రహం చేతివేళ్లు


