కొయ్యూరు: బూదరాళ్ల పంచాయతీ పరిధిలోని గొర్లెమెట్ట, చీడిపల్లి పాఠశాలల దుస్థితిని మండల వైఎస్సార్సీపీ అధ్యక్షులు, డౌనూరు ఎంపీటీసీ బిడిజాన అప్పారావు శుక్రవారం పాడేరులో అరకు ఎంపీ తనూజరాణి, పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు దృష్టికి తీసుకెళ్లారు. పాడేరులో ఎంపీ, ఎమ్మెల్యేలను విడివిడిగా కలిసిన వైఎస్సార్సీపీ నేతలు, పాఠశాలల సమస్యలను వారికి వివరించారు. ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ, గొర్లెమెట్ట పాఠశాల ప్రస్తుతం చర్చి భవనంలో కొనసాగుతోందని, చీడిపల్లి పాఠశాల గతేడాది ఈదురుగాలులకు రేకులు ఎగిరిపోయి శిథిలావస్థలో ఉందని పేర్కొన్నారు. వీటిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, కొత్త భవనాల నిర్మాణానికి కూడా చొరవ చూపడం లేదని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎంపీ తనూజరాణి మాట్లాడుతూ, సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని, నిధుల మంజూరు అంశాన్ని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. అలాగే, ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు కూడా సానుకూలంగా స్పందించి, విద్యార్థులకు మేలు చేసేలా త్వరలోనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు పార్టీ నేత అప్పారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు వంతల నారాయణ, గాంధీ, ప్రకాశ్, చిన్నారావు పాల్గొన్నారు.


