ఏపీపీసీబీ చైర్మన్ కృష్ణయ్య
మహారాణిపేట: విశాఖ నగర అభివృద్ధితో పాటు ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని ఎంపీ ఎం.శ్రీభరత్, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఛైర్మన్ పి. కృష్ణయ్య స్పష్టం చేశారు. కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో వారు మాట్లాడుతూ కాలుష్య నియంత్రణలో రాజీ ఉండదని, నిబంధనలు ఉల్లంఘించే పరిశ్రమలు, పోర్టులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరిశ్రమలు గాలి, నీటి కాలుష్య నియంత్రణ, వ్యర్థాల నిర్వహణకు కార్యాచరణ ప్రణాళికతో ముందుకు రావాలని సూచించారు. భూగర్భ, తీర ప్రాంత జలాల నాణ్యత, బయోమెడికల్, ప్లాస్టిక్, ఈ–వేస్ట్, నిర్మాణ వ్యర్థాల నిర్వహణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలన్నారు. విశాఖ, అదానీ పోర్టుల్లో ధూళి కాలుష్య నివారణకు మరింత సమర్థ చర్యలు అవసరమని పీసీబీ ఛైర్మన్ పేర్కొన్నారు. కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గణబాబు, విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొని శాశ్వత కాలుష్య నియంత్రణ చర్యలపై సూచనలు చేశారు. జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యులు, పోర్టుల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


