తహసీల్దార్ తీరుపై ప్రజాప్రతినిధుల ఆగ్రహం
వై.రామవరం: పోలవరం జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా స్థానిక రెవెన్యూ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమానికి విచ్చేసిన తమను తహసీల్దార్ వేణుగోపాల్ ఘోరంగా అవమానపరిచారని ఎంపీపీ కడబాల ఆనందరావు ఆధ్వర్యంలో స్థానిక ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్తో పాటు ఆర్ఐ గుడ్ల వెంకటేశ్వర్లను వారు నిలదీశారు. తమకు జరిగిన అవమానానికి సమాధానం చెప్పాలంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంపచోడవరంలో పోలవరం జిల్లా కార్యాలయ ప్రారంభం పురస్కరించుకుని ఇక్కడి తహసీల్దార్ కార్యాలయంలో కేక్ కటింగ్ ఏర్పాటుచేశారన్నారు. దీనికి ఉదయం 11 గంటలకు రావాలని ఆహ్వానించగా తాము 10గంటలకు వచ్చామన్నారు. ఈలోపే తహసీల్ధార్ ఈ కార్యక్రమాన్ని ముగించేసి తమను ఘోరంగా అవమానించారని ఆరోపించారు. ఆయనను ప్రశ్నించగా ఎటువంటి సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారన్నారు. ఇలా ఆయన తమను అవమానించడం రెండోసారి అని ధ్వజమెత్తారు. దీనిపై తగు చర్యలు తీసుకోవాలని రంపచోడవరం సబ్కలెక్టర్ను కోరామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కర్ర వెంకటలక్ష్మి, వైస్ ఎంపీపీ ముర్ల జోగిరెడ్డి, ఎంపీటీసీ వీరమళ్ల సుబ్బలక్ష్మి, వైఎస్సార్సీపీ నేతలు వెదుళ్ల తిరుపతిరెడ్డి, వి.వీరబాబు, ఎం.నారాయణరావు, పి.తమ్మిరెడ్డి, కె.అబ్బాయి, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రారంభ కార్యక్రమానికి
ఆహ్వానించి అవమానించారని
ఆవేదన
రెవెన్యూ కార్యాలయం ఎదుట
బైఠాయించి నిరసన
చర్యలు తీసుకోవాలని డిమాండ్


