నేటి నుంచి అమల్లోకికొత్త రైల్వే చార్జీలు
తాటిచెట్లపాలెం(విశాఖ): భారతీయ రైల్వే ప్రకటించిన సవరించిన ప్రయాణ చార్జీలు శుక్రవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు వాల్తేర్ డివిజన్ అధికారులు కొత్త చార్జీల వివరాలను వెల్లడించారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులపై స్వల్ప భారం పడనుండగా, నిత్యం ప్రయాణించే ఉద్యోగులు, సామాన్యులకు మాత్రం రైల్వే శాఖ ఊరటనిచ్చింది.
● సబర్బన్/సీజన్ టికెట్లకు మినహాయింపు: సబర్బన్ రైళ్లలో ప్రయాణించే వారికి, మంత్లీ సీజన్ టికెట్ కలిగిన వారికి చార్జీలలో ఎటువంటి పెంపు లేదు.
● స్వల్ప దూర ప్రయాణికులకు ఊరట: ఆర్డినరీ క్లాస్లో 215 కిలోమీటర్ల లోపు ప్రయాణించే వారికి పాత చార్జీలే వర్తిస్తాయి. వీరిపై ఎటువంటి అదనపు భారం ఉండదు.
● ఆర్డినరీ క్లాస్: 215 కిలోమీటర్లు దాటిన ప్రయాణాలకు కిలోమీటరుకు ఒక పైసా చొప్పున పెంచారు.
● మెయిల్/ఎక్స్ప్రెస్: 215 కిలోమీటర్లు దాటిన ప్రయాణాలకు కిలోమీటరుకు 2 పైసలు చొప్పున పెంచినట్లు రైల్వే అధికారులు తెలిపారు.


