
ఆస్పత్రికి రానంటూ గర్భిణి ముప్పుతిప్పలు
కొయ్యూరు: ఆస్పత్రికి రానంటూ ఆరు నెలల గర్భిణి అటు పోలీసులను ఇటు వైద్య సిబ్బందిని మప్పుతిప్పలు పెట్టింది. ఎట్టకేలకు ఆమెకు వారు నచ్చచెప్పి శుక్రవారం సాయంత్రం రాజేంద్రపాలెం ఆస్పత్రికి తీసుకువచ్చారు. వివరాలిలా ఉన్నాయి. బూదరాళ్ల పంచాయతీ కునుకూరుకు చెందిన తాంబేలు చిన్ని ఆరు నెలల గర్భిణి. ఈమెకు బాలరేవుల సబ్సెంటర్ పరిధిలో కునుకూరులో రెండు రోజుల క్రితం రక్త పరీక్ష నిర్వహించారు. హెచ్బీ శాతం బాగా తక్కువగా ఉన్నట్టు ఎంఎల్హెచ్పీ జ్యోత్స్న నిర్థారించారు. వెంటనే ఆమె సూచన మేరకు ఈనెల 13 ఉదయం రాజేంద్రపాలెం పీహెచ్సీకి వైద్యసిబ్బంది తీసుకువచ్చారు. వెంటనే ఆమెను అక్కడి నుంచి అదేరోజు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి 108లో తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆమె గురువారం సాయంత్రం ఎవరికి చెప్పకుండా స్వగ్రామం కునుకూరు వచ్చేసింది. గర్భిణి చిన్ని ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు ఎంఎల్హెచ్పీ జ్యోత్స్న గురువారం సాయంత్రం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి వెళ్లారు. గర్భిణి చిన్ని లేకపోవడంతో అక్కడి వైద్య సిబ్బందిని అడిగారు. ఆమెను డిశ్చార్జి చేయలేదని, సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయిందని వారు ఎంఎల్హెచ్పీకి వివరించారు.దీంతో శుక్రవారం ఉదయం ఎంఎల్హెచ్పీ హెచ్వీతో కలిసి కునుకూరులో గర్భిణి వద్దకు వెళ్లారు. ఆస్పత్రికి వచ్చేందుకు ఆమె నిరాకరించడంతో మంప పోలీసులకు వైద్య సిబ్బంది పరిస్థితిని వివరించారు. పోలీసులు నేరుగా కునుకూరు వెళ్లి గర్భిణి బంధువులకు నచ్చ చెప్పి అక్కడి నుంచి గర్భిణిని తీసుకువచ్చి రాజేంద్రపాలెం పీహెచ్సీలో చేర్పించారు. ఆమెకు తక్షణం రక్తం ఎక్కించాల్సి ఉన్నందున శనివారం నర్సీపట్నం ఆస్పత్రికి తరలిస్తామని వైద్యసిబ్బంది తెలిపారు.
నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి నుంచి పరారీ
ఆమెను తీసుకువచ్చేందుకు
వైద్య సిబ్బంది నానా హైరానా
ఎట్టకేలకు పోలీసుల సాయంతో
రాజేంద్రపాలెం పీహెచ్సీకి తరలింపు