వేర్వేరు ప్రాంతాల్లో గల్లంతైన బాలుడు, యువకుడు మృతి
జలపాతం, వాగుల నుంచి మృతదేహాలను వెలికి తీసిన పోలీసులు
గుండెలవిసేలా విలపించిన తల్లిదండ్రులు
పెదబయలు/జి.మాడుగుల: పిల్లల సరదా రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. పుట్టిన రోజును సరదాగా స్నేహితులతో గడుపుదామని వెళ్లి, పిట్టలబొర్ర (తారాబు)జలపాతంలో ఈతకొడుతూ గల్లంతైన కిశోర్(22), గుర్రాయి గెడ్డలో ఈత కొడుతూ గల్లంతైన ఉల్లి మహి ప్రసాద్ వర్మ(14) అనే బాలుడు మరణించారు. తీవ్రంగా గాలించి వారి మృతదేహాలను పోలీసులు శుక్రవారం బయటకు తీశారు. తమ కలలు నెరవేరుస్తారనుకున్న పిల్లలు కళ్లెదుటే విగతజీవులుగా పడి ఉండడం చూసి భరించలేని తల్లిదండ్రులు, బంధువులు భోరున విలపించారు. వారి రోదనలు స్థానికులను కలచివేశాయి.
విశాఖ జిల్లా పెందుర్తిలో గల వెల్ఫేర్ ఎడ్యుకేషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఏలూరు జిల్లా భీమడోలు గ్రామానికి చెందిన గొన్నురు కిశోర్ తన స్నేహితులతో కలిసి ఈతకొట్టడానికి గురువారం తారాబు జలపాతంలో దిగి గల్లంతైన విషయం తెలిసిందే. శుక్రవారం ఐదుగంటల పాటు గాలించి, మృతదేహాన్ని వెలికి తీశారు. ముంచంగిపుట్టు ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, బంధువులకు అప్పగించినట్టు స్థానిక ఎస్ఐ కె.రమణ తెలిపారు. తమకు ఒక్కడే కుమారుడని, గారాబంగా పెంచి, చదివిస్తున్నామని పుట్టిన రోజు నాడు ఇలా విగతజీవిగా మారుతాడనుకోలేదని తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు. గాలింపు చర్యల్లో పెదబయలు ఆర్ఐ పూర్ణయ్య, జామిగుడ సర్పంచ్ తెరవాడ అన్నమ్మ, వైఎస్సార్ సీపీ నాయకులు తెరవాడ వెంకటరావు, వీఆర్ఏ కోటిబాబు తదితరులు పాల్గొన్నారు.
● జి.మాడుగుల మండలంలో సింగర్భ పంచాయతీ చెరువువీధి గ్రామానికి చెందిన ఉల్లి మహి ప్రసాద్ వర్మ(14) ఐదుగురు స్నేహితులతో కలసి గురువారం గుర్రాయి గ్రామ సమీపంలో గల గెడ్డలో ఈతకొట్టడానికి వెళ్లి, ప్రవాహంలో గల్లంతైన విషయం తెలిసిందే. గెడ్డ ఊబిలో కూరుకుపోయి మరణించిన ప్రసాద్ వర్మ మృతదేహాన్ని శుక్రవారం బయటకుతీశారు. సంఘటన స్థలం వద్ద మృతదేహాన్ని స్థానిక సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ షణ్ముఖరావు పరిశీలించి పోస్టుమార్టానికి పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడు తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.