
విదేశీ చూపు
ఏయూ వైపు
గత ఆరేళ్లలో అడ్మిషన్లు ఇలా
2019–20 190
2020–21 262
2021–22 217
2022–23 333
2023–24 338
2024–25 465
ఆంధ్ర యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ప్రస్తుతం 59 దేశాలకు చెందిన 1,130 మంది విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యారంగానికి ఇచ్చిన ప్రాధాన్యతకు తోడు విశాఖ బ్రాండ్ ఇమేజ్ను పెంచేలా తీసుకున్న చర్యలతో ఆంధ్ర యూనివర్సిటీ వైపు విదేశీ విద్యార్థులు ఆకర్షితులయ్యారు. 2019–20 విద్యా సంవత్సరంలో 190 మంది విదేశీ విద్యార్థుల చేరగా.. 2024–25 నాటికి ఆ సంఖ్య 465కు చేరింది. ఒకే ఏడాదిలో ఎక్కువ సంఖ్యలో విదేశీ ప్రవేశాలు పొందిన యూనివర్సిటీగా ఏయూ రికార్డు సొంతం చేసుకుంది. అంతే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా నిర్వహించే యూనివర్సిటీల్లో విదేశీ విద్యార్థులు ఎక్కువ మంది చదువుకునేది ఏయూలోనే కావడం గమనార్హం.
ప్రత్యేక హాస్టళ్లు
ఆంధ్ర యనివర్సిటీలో చదువుకునేందుకు వచ్చే విదేశీ విద్యార్థులకు ఆహారం విషయంలో కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. వర్సిటీలో ప్రవేశాలు పొందే వారిలో 70 శాతం మంది విద్యార్థులు క్యాంపస్ హాస్టళ్లులో ఉండేందుకే మొగ్గు చూపుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వీరి కోసమని ప్రత్యేకంగా వర్సిటీలో ఏడు హాస్టళ్లు అందుబాటులో తీసుకొచ్చారు. వారికి నచ్చిన వంటకాలు తయారు చేసుకునేలా ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఎఫైర్స్ విభాగం డీన్ ఆచార్య ధనుంజయరావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వర్సిటీలో అంతర్జాతీయ వ్యవహారాల విభాగం విద్యార్థుల చదువులతో పాటు, వారి సదుపాయాలపై కూడా నిరంతరం పర్యవేక్షణ చేస్తుండటంతో.. వారి చదువులు సాఫీగా సాగిపోతున్నాయి.
సినిమాల్లోనూ అవకాశాలు
ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు సినిమాల్లోనూ అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇటీవల కాలంలో విశాఖ నగరంతో పాటు, పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్కు ఎక్కువగా జరుగుతుండటంతో వీటిలో విదేశీ విద్యార్థులకు అవకాశాలు దక్కుతున్నాయి. ఓ సినిమాలో కంబోడియాలో చిక్కుకుపోయిన 25 మంది యువతను వైజాగ్కు తీసుకొచ్చే సన్నివేశా న్ని ఇక్కడి విద్యార్థులతోనే చిత్రీకరించారు.. ఇక్కడి ఆఫ్రికన్ విద్యార్థుల బృందం.. హీరో సూర్య నటించిన చిత్రంలో మాదకద్రవ్యాల వ్యాపారం చేసే విలన్ సహచరుల పాత్రల్లో నటించింది. ఈ నెల 26 నుంచి ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు ప్రారంభమవుతుండగా.. వీటిలో విదేశీ విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.
ఇదే జోష్ ఉంటుందా?
కూటమి ప్రభుత్వం ఆంధ్ర యూనివర్సిటీపై శీతకన్ను వేస్తోంది. విశాఖలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీని బలోపేతం చేసేలా పరోక్షంగా సహకారమందిస్తోంది. విశాఖలోని ఆ ప్రైవేటు యూనివర్సిటీలో చేరితేనే మేలు అన్నట్లుగా ఏయూ పాలనాధికారులతో పాటు ఓ వర్గం వ్యవహరిస్తుందనే విమర్శలు సైతం ఉన్నాయి. ఈ ప్రభావం 2025–26 విద్యా సంవత్సరం అడ్మిషన్లపై పడుతోందని వర్సిటీ మేలు కోరే వారు అంటున్నారు. ఫలితంగా విదేశీ విద్యార్థుల జోష్ ఉంటుందా..? అనేది వేచి చూడాలి.
చదువుతో పాటు భద్రతకు ప్రాధాన్యం
ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకోవాలనే కోరికతో విశాఖకు వచ్చే విదేశీ విద్యార్థుల నమ్మకాన్ని నిలబెడుతూ విద్య అందిస్తున్నాం. ఇక్కడ వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశాం. ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే స్పందించి.. వారికి తోడుగా నిలిచేలా ఇంటర్నేషనల్ ఎఫైర్స్ విభాగం పని చేస్తోంది.
– ఆచార్య ధనుంజయరావు,
ఇంటర్నేషనల్ ఎఫైర్స్ డీన్,
ఆంధ్ర యూనివర్సిటీ
గ్లోబల్ విద్యార్థులతో వర్సిటీలో జోష్
59 దేశాలకు చెందిన 1,130 మంది
విద్యాభ్యాసం
ఏయూకు క్రేజ్ పెంచిన
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం
ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ ఖ్యాతి
ఆంధ్ర యూనివర్సిటీలో ఒకప్పుడు కొన్ని ప్రత్యేక కోర్సులకే పరిమితమైన విదేశీ విద్యార్థుల సంఖ్య ఇప్పుడు అనూహ్యంగా పెరిగింది. ఏకంగా 59 దేశాలకు చెందిన 1,130 మంది విద్యార్థులు ఇక్కడ విద్యాభ్యాసం చేస్తున్నారు. కేవలం ఐదేళ్లలో ఈ సంఖ్య రెండింతలు కావడం విశేషం. దేశంలోని మరే ఇతర విశ్వవిద్యాలయంలోనూ ఇంత మంది విదేశీ విద్యార్థులు లేకపోవడం ఆంధ్ర యూనివర్సిటీని అంతర్జాతీయ విద్యా కేంద్రంగా నిలబెడుతోంది. ప్రత్యేక హాస్టళ్లు, వారికి నచ్చిన ఆహారం, వంటి సౌకర్యాలు ఇక్కడకు మరింత మందిని ఆకర్షిస్తున్నాయి. నగరంలోని ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి అందాలు కూడా తోడవడంతో ఆంధ్ర యూనివర్సిటీ.. మినీ ప్రపంచాన్ని తలపిస్తోంది.
– విశాఖ విద్య
కోర్సుల వారీగా విదేశీ విద్యార్థులు
స్పెషలైజేషన్ యూజీ పీజీ పీహెచ్డీ మొత్తం
ఆర్ట్స్ 3 44 136 183
సైన్స్ అండ్ టెక్నాలజీ 6 52 38 96
ఇంజినీరింగ్ 373 55 44 472
ఫార్మాస్యూటికల్ 146 39 20 205
ఇంటర్నేషనల్ బిజినెస్ 143 24 – 167
లా 1 5 6
ఐఏఎస్ఈ 1 1
మొత్తం 671 216 243 1,130

విదేశీ చూపు

విదేశీ చూపు