ఆదిలాబాద్: శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని జిల్లావ్యాప్తంగా మహిళలు వరలక్ష్మీ వ్రతాలను భక్తిశ్రద్ధలతో ఆచరించారు. తమ ఇళ్లలో అమ్మవారిని ప్రత్యేక మండపాల్లో అలంకరించి పూజలు చేశారు. సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని వేడుకున్నారు. ముత్తైదువులకు వాయినాలు అందజేశారు. జిల్లా కేంద్రంలోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వరలక్ష్మీ వ్రత కార్యక్రమానికి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎస్పీ అఖిల్ మహాజన్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. డీఆర్వో స్రవంతి, డీఎంహెచ్వో సాధన, కాంగ్రెస్ నాయకులు గండ్రత్ సుజాత, సమితి జిల్లా అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రి తదితరులు పాల్గొన్నారు. అలాగే జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశుమందిర్లోనూ సామూహిక వరలక్ష్మీ వ్రత కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.


