ఆదిలాబాద్టౌన్/కై లాస్నగర్: భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయులను విద్యార్థులు హత్య చేయడం దారుణమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. నల్లగొండ జిల్లాలో ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్యకు గురికావడంతో నిందితులను కఠినంగా శిక్షించాలని ట్రస్మా ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టారు. సెంట్ జోసెఫ్ కాన్వెంట్ స్కూల్ నుంచి ప్రారంభమైన ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొని నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పదో తరగతి విద్యార్థులు డ్రగ్స్, గంజాయి వంటి అలవాట్లకు పాల్పడుతుంటే మందలించినందుకు గాను ప్రిన్సిపాల్ను హత్య చేయడం దారుణమని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకురావాల్సి న అవసరముందన్నారు. అసెంబ్లీలో సైతం ఈ విషయాన్ని ప్రస్తావిస్తానని తెలిపారు. ఇదిలా ఉంటే హత్యకు నిరసనగా ప్రైవేట్ యాజమన్యాలు పాఠశాలలకు సెలవు ప్రకటించాయి. కార్యక్రమంలో ట్రస్మా ప్రధాన కార్యదర్శి ఆదినాథ్, ప్రైవేట్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు మారియ రోజ్, అతీక్ ఉర్ రహ్మన్, వేదావ్యాస్, మహ్మద్ అమేరొద్దీన్, దేవేందర్, పురుషోత్తం రెడ్డి, స్వామి, భద్రేశ్వర్ రావు, కరస్పాండెంట్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


