ఉట్నూర్రూరల్: గిరిజన రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని పీఎంఆర్సీ సమావేశ మందిరంలో గిరిజన, ఆదివాసీ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజనుల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వ శాఖలపై ఉందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరిష్కార చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే బొజ్జు మాట్లాడుతూ, సేంద్రియ సాగు ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. ఈ మేరకు అవసరమైన సాంకేతిక సహకారం, శిక్షణ, అవగాహన కార్యక్రమాలను ఆయా శాఖలు అందించాలని కోరారు. ఐటీడీఏ పీవో మంద మకరందు మాట్లాడుతూ, గిరిజన రైతుల ఆర్థిక పురోభివృద్ధి, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా నిరంతర సమీక్షలు నిర్వహిస్తూ కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. ఫైవ్ లేయర్ వర్టికల్ ఫార్మింగ్, బయోరిసోర్స్ సెంటర్ ఆధారిత సాగు, ఇప్పపువ్వు (మహువా) ప్రాసెసింగ్ యూనిట్లు వంటి ఆదాయవృద్ధి నమూనాలను ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఐటీడీఏ పరిధిలో 2007–08, 2022–23 కాలానికి సంబంధించి సుమారు 60 వేల వరకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. భూభారతి పోర్టల్లో వివరాల నమోదు ప్రక్రియ వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు. సమావేశంలో కమిషన్ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్, సునీల్, రాంరెడ్డి గోపాల్, గంగాధర్, కెవీఎన్రెడ్డి, ఎం.భవానిరెడ్డి, వివిధ శాఖల అధికారులు, గిరిజన రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


