కై లాస్నగర్: ఎయిర్పోర్ట్, ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రీహ్యాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ కమిషనరేట్ ఆధ్వర్యంలో భూసేకరణ విభాగ ప్రత్యేక అధికారి మనోహర్తో కలిసి ఆయన ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ అత్యంత ప్రాధాన్యత కలిగిందని, 2026 డిసెంబర్ 31 నాటికి సంబంధిత ఏజెన్సీలకు భూమి అప్పగించేలా రెవెన్యూ అధికారులు కార్యాచరణను వేగవంతం చేయాలని సూచించారు. పనులు నిర్ణీత గడువులోపు ముగించేందుకు అవసరమైన అధికారుల బృందాలను పెంచనున్నట్లు వెల్లడించారు. భూసేకరణ ప్రక్రియలో న్యాయపరమైన లోపాలు తలెత్తకుండా ప్రతీ నియమాన్ని కచ్చితంగా పాటించాలని సూచించారు. రికార్డులు పక్కాగా ఉండాలని, క్షేత్రస్థాయి పరిశీలనలో సందేహాలుంటే వెంటనే నివృత్తి చేసుకోవాలని స్పష్టం చేశారు. వ్యవసాయేతర భూములు, నిర్మాణాల లెక్కింపు, రికార్డుల వ్యత్యాసాలపై సమగ్ర సర్వే నిర్వహించి ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ భూసేకరణ విభాగ ప్రత్యేక అధికారి మనోహర్ అధికారులకు భూసేకరణకు సంబంధించిన అంశాలపై పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆర్డీవో జగదీశ్వర్రావు, ఏవో వర్ణ, సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
అర్హులు సద్వినియోగం చేసుకోవాలి
ఆదిలాబాద్టౌన్: సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షిషా సూచించారు. జెడ్పీ సమావేశ మందిరంలో మత్స్య శాఖ ఆధ్వర్యంలో ధర్తిఆభ జన జాతీయ గ్రామ ఉత్కర్శ్ అభియాన్, ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద ద్విచక్ర, త్రిచక్ర వాహనాల లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అత్యంత పారదర్శకంగా లాటరీ పద్ధతి ద్వారా ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. జిల్లాకు మరిన్ని యూనిట్లు మంజూరయ్యేలా ప్రతిపాదనలు పంపించినట్లు పేర్కొన్నారు. జిల్లా మత్స్యశాఖ అధికారి సాంబశివరావు, జిల్లా వ్యవసాయాధికారి రవీందర్, ఎల్డీఎం ఉత్పల్ కుమార్, మత్స్య సంఘాల నాయకులు పాల్గొన్నారు.


