కై లాస్నగర్: జిల్లావాసులు ఏళ్లుగా ఆశగా ఎదురుచూస్తున్న ఆదిలాబాద్ ఎయిర్పోర్టు ఏర్పాటులో మ రో ముందడుగు పడింది. కీలకమైన భూ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం లైన్ క్లియర్ చేసింది. ఇందుకోసం రూ.2,278.14 కోట్ల నిధులు మంజూరు చేస్తూ జీవో 36 జారీ చేసింది. ఎయిర్పోర్టు అథార్టీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), ఇండియన్ ఎయిర్ఫోర్స్ (ఐఏ ఎఫ్) జాయింట్ యూజర్ సర్వీస్లకు అనుగుణంగా భూ సేకరణ త్వరితగతిన చేపట్టాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. ఈ ఏడాది డిసెంబర్ 31లోపు ప్రక్రియ పూర్తి చేయాలని గడువు విధించింది.
ఐఏఎఫ్ సర్వేకు అనుగుణంగా ...
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్రమోదీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. వైమానిక శిక్షణ కేంద్రంతో కూడిన అంతర్జాతీయస్థాయి విమానశ్రాయ ఏర్పాటుకు నిర్ణయించాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రక్షణశాఖ స్థలం 369.45 ఎకరాలకు అదనంగా 700 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. అయితే భారీ విమానాలు సైతం రాకపోకలు సాగించేలా ఉండాలని భావించింది. దీనిపై సర్వే చేపట్టిన అనంతరం 9వేల ఫీట్లతో కూడిన రన్ వే నిర్మించాల్సి ఉండటంతో మరో 1500 ఎకరాల భూమి అవసరమవుతుందని, దాన్ని ఐఏఎఫ్కు అప్పగించాలని పేర్కొంటూ కేంద్ర రక్షణ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించగా అందుకు అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణ, విమానాయాన శాఖల ఆదేశాల మేరకు ఐఏఎఫ్ అధికారుల బృందం ఈ ఏడాది జూన్ 17న ఎరోడ్రమ్ మైదానాన్ని పరిశీలించింది. ప్రత్యేక సర్వే నిర్వహించి 2009.23 ఎకరాల భూమి అవసరమని ప్రభుత్వానికి నివేదిక అందజేసింది.
రూ.2,278 కోట్లు మంజూరు ..
కేంద్ర విమానయాన, రక్షణశాఖల నివేదికలకు అ నుగుణంగా భూ సేకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 1609.23 ఎకరాలు ఇండియ న్ ఎయిర్ఫోర్స్కు, 400 ఎకరాలు సివిల్ ఏవియేష న్కు కేటాయించేలా ప్రక్రియ చేపట్టాలని భావిస్తోంది. ఇందుకోసం రూ.2,278.14 కోట్లను మంజూరు చేస్తూ రాష్ట్ర ఆర్అండ్బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్ జీవో జారీ చేశారు. ఇందులో అత్యధికంగా రూ.1555.11 కోట్లు భూసేకరణ కోసమే కేటా యించింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి అనుకుంట వరకు వెళ్లే ఆర్అండ్బీ రోడ్డును మళ్లించేందుకు రూ.35కోట్లు, 765 కేవీఏ సామర్థ్యంతో కూడిన విద్యుత్ హైటెన్షన్ టవర్లు తొలగించేందుకు రూ.310 కోట్లను కేటాయించింది. ఇరిగేషన్శాఖకు సంబంధించిన వాగులకు సంబంధించి రూ.57.49 కోట్లు, మిషన్ భగీరథ, వాటర్ గ్రిడ్ నీటి వనరుల తరలింపునకు రూ.3.20 కోట్లు, విద్యుత్శాఖకు సంబంధించి అడ్డంగా ఉన్న స్తంభాలను తొలగించేందుకు రూ.18.76 కోట్లు, ఇతరాత్ర పనుల కోసం రూ. 31కోట్ల చొప్పున మంజూరు చేసింది. త్వరితగతిన భూ సేకరణ ప్రక్రియ ప్రారంభించేలా చూడాలని కలెక్టర్ను ఆదేశించిన ప్రభుత్వం ఈ ఏడాది డిసెంబర్ 31లోగా ప్రక్రియ పూర్తిచేయాలని స్పష్టం చేసింది. నిధుల మంజూరుతో త్వరలోనే ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశముంది. ఎక్కడి భూములను సేకరిస్తారనే దానిపై కలెక్టర్ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ద్వారా స్పష్టం కానుంది.
‘సాక్షి’ చొరవ
జిల్లాలో విమానాశ్రయ ఏర్పాటు ఆవశ్యకత, ఈ ప్రాంతవాసుల ఆకాంక్షను వివరిస్తూ ‘సాక్షి’ గతేడాది చర్చా వేదికతో పాటు పలు ప్రత్యేక కథనాలను ప్రచురించిన విషయం విధితమే. ఈ మేరకు పాలకులు స్పందించా రు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో జిల్లాలో ఎయిర్పోర్టు ఏర్పాటుకు అడుగుపడింది. తాజాగా భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ సామాజిక చొరవను జిల్లావాసులు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.
గతేడాది మార్చి 6న సాక్షిలో ప్రచురితమైన కథనం
శుభ పరిణామం
ఆదిలాబాద్ ఎయిర్పోర్టు ఏర్పాటుకు అవసరమైన భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం శుభపరిణామం. ఈ మేరకు జీవో జారీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు. కేంద్రం తరఫున అవసరమైన సహకారం అందించేందుకు నా వంతు కృషి చేస్తా. – గోడం నగేశ్, ఆదిలాబాద్ ఎంపీ
నిధుల మంజూరు హర్షనీయం
ఎయిర్పోర్ట్ భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ జీవో జారీ చేయడం హర్షనీయం. విమానాశ్రయ ఏర్పాటు ద్వారా జిల్లా అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తుంది. ఇచ్చిన మా టకు కట్టుబడి చర్యలు చేపడుతున్న సీఎం రేవంత్ రెడ్డికి జిల్లా ప్రజల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు.
– పాయల్ శంకర్, ఎమ్మెల్యే, ఆదిలాబాద్
రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు
ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధే లక్ష్యంగా విమానాశ్రయ నిర్మాణానికి అడుగు ముందుకు పడింది. ఇందులో భాగంగా భూసేకరణ కోసం నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్రెడ్డికి ప్రత్యేకంగా జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు.
– నరేశ్ జాదవ్, డీసీసీ అధ్యక్షుడు


