ఆదిలాబాద్టౌన్: జిల్లా కేంద్రంలోని ఎస్ పవార్ పారామెడికల్ కళాశాల యాజమాన్యం అమాయక విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతోంది. మావల మండలకేంద్రంతో పాటు జిల్లా కేంద్రంలోని బ స్టాండ్ సమీపంలో కళాశాలను తెరిచింది. కేవలం నాలుగు కోర్సులకు సంబంధించి మాత్రమే అనుమతి ఉండగా, వందల సంఖ్యలో కోర్సులు ఉన్నట్లుగా ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారు. విద్యార్థులను మభ్యపెట్టి అడ్మిషన్లు తీసుకుని తరగతులు మాత్రం నిర్వహించడం లేదు. దీంతో పలువురు విద్యార్థులు యాజమాన్యాన్ని ప్రశ్నించారు. రేపుమాపు అంటూ కాలం వెల్లదీయడంతో కలెక్టర్తో పాటు వైద్యారోగ్య శాఖాధికారులకు ఇటీవల ఫిర్యా దు చేశారు. స్పందించిన కలెక్టర్ వెంటనే రిమ్స్ డైరెక్టర్, వైద్యారోగ్య శాఖ అధికారులతో విచారణకు ఆదేశించారు. దీంతో సదరు కళాశాలకు బీఎస్సీ నర్సింగ్తో పాటు జీఎన్ఎం తదితర కోర్సులకు అనుమతి లేదని తేలింది. ఈమేరకు కళాశాలపై ఎలాంటి చర్యలు చేపడతారో వేచి చూడాల్సిందే.
నాలుగింటికే అనుమతి..
ఈ పారామెడికల్ కళాశాలలో డీఎంఎల్టీ, డిప్లొ మో అండ్ రేడియోగ్రఫీ అసిస్టెంట్, ఆప్తాలమిక్ అసిస్టెంట్ డిప్లొమో, డిప్లొమో ఇన్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఈ నాలుగు కోర్సులకు మాత్రమే అనుమతి ఉంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా కళాశాల యాజమాన్యం జీఎన్ఎం నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్, ఫిజియోథెరపీ, బీఫార్మసీ, డీఫార్మసీతో పాటు అనేక కోర్సుల పేరిట విద్యార్థుల నుంచి అడ్మిషన్లు తీసుకుంటున్నట్లు సమాచారం. నిబంధనల ప్రకారం పర్మిషన్ ఉన్న కోర్సుల్లో మాత్రమే అడ్మిషన్ తీసుకొని బోధించాల్సి ఉంటుంది. కానీ అక్కడ బోధన చేసేవారు సైతం లేకపోవడం గమనార్హం. అడ్మిషన్లు పొందిన విద్యార్థులు అక్కడికి వెళ్లి చూస్తే బోధన చేసేవారు లేకపోవడం, కళాశాలలో రెండే గదులు ఉండటం, ల్యాబ్, ఇతర వసతులు లేకపోవడంతో అవాక్కయ్యారు.
విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం..
జిల్లా కేంద్రంతో పాటు ఆయా ప్రాంతాల్లో కొన్ని పారామెడికల్ కళాశాలలు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి. కళాశాలలో కోర్సులు లేకపోయినప్పటికీ అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ఉన్న కోర్సుల్లోనూ సక్రమంగా తరగతులు నిర్వహించకపోవడం, బోధన చేసేవారు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. రిమ్స్లో కేవలం ప్రాక్టికల్ తరగతులు మాత్రమే కొనసాగుతున్నాయి. దీంతో విద్యార్థులు సబ్జెక్టుపై పట్టు సాధించలేక పోతున్నారు. భవిష్యత్తులో వీరు రోగులకు నిర్వహిస్తే రిపోర్టులు తారుమారయ్యే అవకాశాలు లేకపోలేదు.


