ఆదిలాబాద్రూరల్: చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మహాత్మాజ్యోతి బాపూలే జయంతి వేడుకలను జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయ ఆవరణలోని సావిత్రిబాయి, జ్యోతి బాపూలే విగ్రహాలకు, అలాగే బీసీ స్టడీ సర్కిల్ సెంటర్ ఆవరణలోని పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళలర్పించారు. అనంతరం జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సమాజంలోని అసమానతలు గుర్తించి, వాటి నిర్మూలనకు కృషి చేసిన గొప్ప సంస్కర్త జ్యోతిబా పూలే అని కొనియాడారు. ఎంపీ గోడం నగేశ్ మాట్లాడుతూ, విద్యతోనే సమాజ వికాసం జరుగుతుందని నమ్మిన గొప్ప ఆదర్శమూర్తి పూలే అని అన్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ మహనీయుల జీవిత చరిత్రను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు, యువత ముందుకు సాగాలన్నారు. పూలే జీవిత చరిత్రపై మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ పెట్కులే రూపొందించిన ఆడియో సీడీని కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం వ్యాసరచన పోటీల విజేతలకు మెమెంటో, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఇందులో మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, బీసీ అభివృద్ధి శాఖ అధికారి సోనియా, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి సునీత కుమారి, ఈడి మనోహర్, కౌన్సిలర్లు శ్రీనివాస్, స్వాతి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చిక్కాల దత్తు, నాయకులు మల్లేశ్, గణేశ్, తదితరులు పాల్గొన్నారు.
మాదకద్రవ్యాల నియంత్రణ
అందరి బాధ్యత
ఆదిలాబాద్/ఆదిలాబాద్టౌన్: మాదక ద్రవ్యాల నియంత్రణ అందరి బాధ్యత అని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలో ఔషధ నియంత్రణ, హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ వినియోగంపై శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం రిమ్స్లో ఏర్పాటు చేసిన సదస్సులో కలెక్టర్ మాట్లాడారు. సమాజంలో డ్రగ్స్ నియంత్రణ అత్యంత కీలకమన్నారు. వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మత్తుకు బానిసైన వారికి డీఅడిక్షన్ సెంటర్ల ద్వారా కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచించారు. అనంతరం ఔషధ నియంత్రణపై ప్రతిజ్ఞ చేయించి, పోస్టర్ ఆవిష్కరించారు. ఇందులో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.


