డబుల్‌ డిజిట్‌ సీట్లు సాధిస్తాం | BJP will get double digit MP seats in Telangana: Kishan Reddy | Sakshi
Sakshi News home page

డబుల్‌ డిజిట్‌ సీట్లు సాధిస్తాం

May 14 2024 6:35 AM | Updated on May 14 2024 6:36 AM

BJP will get double digit MP seats in Telangana: Kishan Reddy

గ్రామాలు, పట్ణణాలు తేడాలేకుండా యువత, మహిళలు ఆదరించారు

సీఎం రేవంత్‌రెడ్డి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు

ఓటర్ల జాబితాల్లో సంస్కరణలు తేవాలి మీడియాతో జి.కిషన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: తమ పార్టీ అధినాయ కత్వం ఊహిస్తున్నట్లే తెలంగాణలో డబుల్‌ డిజిట్‌ సీట్లు సాధిస్తామని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీకి సానుకూల వాతావరణం కనిపించిందని, ఎన్నికలు ఫలితాలు వెలువడ్డాక రాష్ట్రంలో బీజేపీ కొత్త రాజకీయ శక్తిగా అవతరిస్తుందన్నారు. పార్టీలకు అతీతంగా గ్రామాల్లో బీజేపీకి ఓటు వేశారని, మహిళలు, యువత ఆదరించారని, పట్టణప్రాంతంలోనూ తమ పార్టీకే ఓట్లు పడ్డాయని చెప్పారు. ఓటింగ్‌ శాతంతో సంబంధం లేకుండా సికింద్రాబా ద్‌లో బీజేపీ గెలుపులో ఎలాంటి అనుమానం లేదన్నారు.

పట్టణప్రాంతాల్లో పోలింగ్‌ కాస్త తగ్గినా.. పోలైన ఓట్లు బీజేపీకి అనుకూలంగా ఉన్నట్లు సమాచారం ఉందన్నారు. సోమవారం పోలింగ్‌ సమయం ముగిశాక పార్టీ కార్యాలయం లోకిషన్‌రెడ్డి మీడియాతో మాట్లా డారు. రాహుల్‌ గాంధీ, రేవంత్‌రెడ్డి రెచ్చ గొట్టినా ప్రజలు, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించారని, లేకపోతే అగ్గిరగిలేదన్నారు.

సికింద్రాబాద్, ఆదిలాబాద్‌ తదితరచోట్ల కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ కలిసి గోబెల్స్‌ ప్రచారం చేసినా బీజేపీని ప్రజ లు ఆదరించారన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీలకు వేసిన వారంతా.. ఈసారి బీజేపీకి మద్దతుగా నిలిచారని చెప్పారు. రాష్ట్రంలో పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసిందని, ఓటేసిన ప్రజలు, అధికారులు, అన్ని పార్టీల కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. 

జూన్‌ 4 తర్వాత కాంగ్రెస్‌ హామీలపై కార్యాచరణ
ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్‌ గ్యారంటీలు, హామీల అమలుకు బీజేపీ కార్యాచరణ సిద్ధం చేసుకుని పోరాడుతుందని కిషన్‌రెడ్డి చెప్పారు. ‘ఎన్నికలను ప్రజాస్వామ్య పండుగలా జరుపుకోవాలని ప్రధాని మోదీ చెప్పారని నేను చెబితే దానిపైనా ఫిర్యాదుచేశారు. మోదీ పేరు ఎత్తకుండా నిషేధం ఉందా? సీఎం రేవంత్‌ రెడ్డి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు.

ప్రతిదానికీ మోదీని చాలెంజ్‌ చేశారు. మోదీపై విమర్శలు గుప్పించడం ద్వారా పెద్దనాయకుడు కాలేరని ఆయన గ్రహించాలి. ప్రధాని అయ్యాక పెళ్లి చేసుకుందామని రాహుల్‌ అనుకున్నట్టున్నారు. ఆయన ప్రధాని అయ్యే పరిస్థితి లేదు. ఎవరు ఏమిటనేది జూన్‌ 4న ఫలితాలతో తేలిపోతుంది’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

ఓటర్ల జాబితాల్లో సంస్కరణలు తేవాలి
‘ఎన్నికల కమిషన్‌ ఓటర్ల జాబితాలకు సంబంధించి సంస్కరణలు తీసుకురావాలి. ఓటరు లిస్టును ప్రభుత్వం వెరిఫికేషన్‌ చేయాలి. పట్టణ ప్రాంతాల్లో ఓటర్‌ లిస్టులను తనిఖీ చేసి, చనిపోయినవారి ఓట్లను తొలగించాలి. జూబ్లీహిల్స్‌లో ఒక వర్గం వారివి వేల ఓట్లు తొలగించారు. వేల ఓట్లను డిలీట్‌ అని పేర్కొన్న జాబితాను ఆదివారం రాత్రే మాకు ఇచ్చారు. కుట్రపూరితంగా ఈ తొలగింపు జరిగింది. కొన్నిచోట్ల ఓటరు స్లిప్పులు ఇచ్చినా ఓట్లు లేవని తిప్పిపంపించారు.

మా అబ్బాయి ఓటు ఎక్కడో, నా ఓటు ఎక్కడో ఉంటుంది. దీనిపై కేంద్రమంత్రిగా లేఖ రాసినా చర్యలు తీసుకోలేదు. ఓటర్ల వివరాలతో ఆధార్‌ కార్డును అనుసంధానం చేస్తే బాగుండేది. రానున్న రోజుల్లో దీనిపై ఆలోచించి మార్పులు చేయాల్సిన అవసరం ఉంది’ అని చెప్పారు. 

విమోచన అధికారికం
‘ప్రతిఏటా సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహించేందుకు కేంద్రప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. పసుపుబోర్డు, టెక్స్‌టైల్‌ బోర్డు వంటి వాటిని మోదీ తెలంగాణకు ఇచ్చారు. మోదీ మళ్లీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక త్వరలోనే ఆయన చేతుల మీదుగా వీటిని ప్రారంభిస్తాం’ అని కిషన్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement