warangal by-election
-
గర్వం పనికిరాదు: కేసీఆర్
గర్వం, అహం పనికి రాదని టీఆర్ ఎస్ నేతలకు కేసీఆర్ సూచించారు. వరంగల్ ఉప ఎన్నికలో విజయం పార్టీ నాయకుల్లో అహాన్ని పెంచకూడదని అన్నారు. వరంగల్ లో విజయం సాధించిన పసునూరి దయాకర్ తో పాటు.. జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు బుధవారం క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ గెలుపు గర్వాన్ని తలకెక్కించుకోవద్దని పార్టీనేతలకు సూచించారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు రక్షణ కవచంలా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజలతో అత్యంత వినయంగా ఉండాలని, శాంతంగా ప్రవర్తించాలని, చాలా సంయమనం పాటించాలని, వీలైనంత తగ్గి ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. పార్టీకి, ఉద్యమానికి ఎప్పుడు సంక్షోభం వచ్చినా వరంగల్ జిల్లా ప్రజలు అండగా నిలిచారని, ఈసారి ప్రభుత్వాన్ని దీవించి ఆత్మ విశ్వాసం పెంచారన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా వరంగల్కు తగిన ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. జిల్లాలో అతి పెద్ద టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేయబోతున్నామని, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తామని చెప్పారు. ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని, కార్యకర్తలు వాటిని ప్రజలకు చేరేలా చూడాలని అన్నారు. త్వరలోనే కార్యకర్తలకు, ప్రజా ప్రతినిధులకు శిక్షణ ఇస్తామన్నారు. వరంగల్లో అత్యధిక మెజారిటీ వచ్చేందుకు కృషి చేసిన వారందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. -
లండన్లో టీఆర్ఎస్ నాయకుల సంబరాలు
వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ రికార్డుస్థాయి మెజార్టీతో గెలుపొందడంపై లండన్ ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ ఆధ్వర్యంలో బుధవారం సంబరాలు నిర్వహించారు. మిఠాయిలు పంచిపెట్టి, టపాసులు కాల్చారు. ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులే దయాకర్ను గెలిపించాయన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నవీన్రెడ్డి, వెంకట్రెడ్డి, విక్రమ్రెడ్డి, రత్నాకర్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఓడింది కాంగ్రెస్ కాదు...సర్వే సత్యనారాయణ
హైదరాబాద్ : వరంగల్ లోక్సభ ఉప ఎన్నికల్లో ఓడింది కాంగ్రెస్ పార్టీ కాదని, అభ్యర్థి సర్వే సత్యనారాయణ అని మాజీ మంత్రి, సీనియర్ నేత శంకర్రావు వ్యాఖ్యానించారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ సర్వే స్థానికుడు కాకపోవడం వల్లే అతడిని ప్రజలు ఓడించారన్నారు. గత ఏడాది మల్కాజ్గిరి నుంచి పోటీ చేసిన సర్వే సత్యనారాయణకు డిపాజిట్ కూడా దక్కలేదని శంకర్రావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాగా కాంగ్రెస్కు 1,56,311 ఓట్లు వచ్చిన విషయం తెలిసిందే. 2014 సాధారణ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్కు లక్షకుపైగా ఓట్లు తగ్గాయి. దీనిపై టీపీసీసీ నేతలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి దారుణమైన ఫలితాలను ఊహించలేకపోయామని, ఇది తమను షాక్కు గురి చేసిందని టీపీసీసీ, సీఎల్పీ ముఖ్యులు వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్కు గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లలో సుమారు 2.7% టీఆర్ఎస్ వైపు మళ్లినట్టు ఎన్నికల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. -
కేసీఆర్ను కలిసిన పసునూరి దయాకర్
హైదరాబాద్ : వరంగల్ లోక్సభ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ బుధవారం ఉదయం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కలిశారు. రికార్డు స్థాయిలో మెజార్టీ సాధించిన పసునూరికి ఈ సందర్భంగా కేసీఆర్ అభినందనలు తెలిపారు. పసునూరితో పాటు పలువురు మంత్రులు కేసీఆర్ ను కలిశారు. కాగా పసునూరి దయాకర్ 4,59,092 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందిన విషయం తెలిసిందే. తెలంగాణలో అత్యధిక మెజారిటీతో ఎన్నికైన లోక్సభ సభ్యుడిగా ఆయన రికార్డు నమోదు చేశారు. -
'పదవి ఇస్తామంటే.. ఫలితం మరోలా ఉండేది'
-
వరంగల్లో ఓటర్ల అనాసక్తి
2014 ఎన్నికలతో పోల్చితే 7 శాతం తగ్గిన పోలింగ్ వరంగల్ : వరంగల్ లోక్సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో 69.01 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 8 గంటలకు మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం వరకు పెరిగింది. అయితే సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసిన తర్వాత 69 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2014 సాధారణ ఎన్నికలతో పోల్చితే ఈసారి పోలింగ్ తగ్గడం గమనార్హం. ఈ లోక్సభ పరిధిలోని పర్కాల అసెంబ్లీ సెగ్మెంట్లో అత్యధికంగా ఓట్లు పోలవగా, అత్యల్పంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పోలయ్యాయి. అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా చూస్తే స్టేషన్ ఘన్పూర్ (74.55 శాతం), పర్కాల (76.69 శాతం), పాలకుర్తి (76.51 శాతం), వర్ధన్నపేట (74.03 శాతం), భూపాల్పల్లి (70.1 శాతం), వరంగల్ తూర్పు (62.21 శాతం), వరంగల్ పశ్చిమ (48.03 శాతం) ఓట్లు పోలయ్యాయి. 2014 సాధారణ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 75.52 శాతం పోలింగ్ నమోదైంది. ఆ ఎన్నికల్లో నియోజకవర్గంలో మొత్తం 15.37 లక్షల మంది ఓటర్లు ఉండగా ఈసారి ఆ సంఖ్య కూడా స్వల్పంగా (15.09 లక్షలు) తగ్గింది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికను సవాలుగా తీసుకుంది. గత ఎన్నికల్లో ఉన్న ఓటర్ల సంఖ్యకు ప్రస్తుత సంఖ్యకు స్వల్ప వ్యత్యాసం ఉన్నప్పటికీ దాదాపు 7 శాతం మేరకు పోలింగ్ తగ్గడం ఓటర్లు ఈ ఎన్నిక పట్ల పెద్దగా ఆసక్తి కనబరచలేదని తెలుస్తోంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి 3.92 లక్షల భారీ మెజారిటీతో ఇక్కడి నుంచి విజయం సాధించారు. ప్రస్తుతం పోలింగ్ సరళిని పరిశీలిస్తే విజయం సాధించే అభ్యర్థి మెజారిటీ కూడా భారీ స్థాయిలో ఉండదని చెబుతున్నారు. కేసీఆర్ అధికారం చేపట్టిన ఏడాదిన్నర తర్వాత వచ్చిన ఈ ఉపఎన్నిక టీఆర్ఎస్ పరిపాలనకు రెఫరెండంగా ప్రతిపక్షాలు సవాలు చేశాయి. ఈ నేపథ్యంలో పోలింగ్ శాతం తగ్గడం ఫలితంపై తీవ్ర ప్రభావం ఉంటుందని ఆయా పార్టీల నేతలు విశ్లేషణల్లో పడ్డారు. గత ఎన్నికల ఫలితాల్లో రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య అనూహ్యంగా చివరి నిమిషంలో రంగం నుంచి తప్పుకోవలసిన పరిస్థితి, ఆఖరు రోజున సర్వే సత్యనారాయణ ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలవడం తెలిసిందే. గత ఎన్నికల్లో మాదిరిగానే మిత్రపక్షమైన టీడీపీ మద్దతుతో ఈసారి కూడా బీజేపీ తన అభ్యర్థిని నిలపగా, వైఎస్సార్ కాంగ్రెస్ పక్షాన నల్లా సూర్యప్రకాశ్ రంగంలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో పలువురు స్వతంత్రులు పోటీలో ఉన్నప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. -
ఓటర్లకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు
వరంగల్ : వరంగల్ ఉప ఎన్నిక ఓటింగ్లో పాల్గొన్న ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొన్నారని ఆయన శనివారమిక్కడ అన్నారు. కాగా వరంగల్ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ఈ ఉప ఎన్నికలో 67 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 8 గంటలకు మందకొడిగా ప్రారంభమైన పోలింగ్... మధ్యాహ్నానికి ఊపందుకుంది. సాయంత్రం 5 గంటల తర్వాత కూడా పలు కేంద్రాల్లో భారీగా ఓటర్లు క్యూ లైన్లలో ఉన్నారు. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఆలస్యం కావడం మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 2014 సాధారణ ఎన్నికలతో పోల్చితే ఈసారి పోలింగ్ తగ్గడం గమనార్హం. 2014 ఎన్నికల్లో వరంగల్ లోక్సభ నియోజకవర్గంలో 75.47 శాతం పోలింగ్ నమోదైంది. ఆ ఎన్నికల్లో నియోజకవర్గంలో మొత్తం 15లక్షల 37 వేల మంది ఓటర్లు ఉండగా.... ఈసారి ఓటర్ల సంఖ్య 15లక్షల 9వేలకు తగ్గింది. ఈ నెల 24న ఎనుమాముల మార్కెట్ యార్డులో కౌంటింగ్ జరగనుంది. కాగా పరకాలలో అత్యధికంగా 76.69 శాతం పోలింగ్ నమోదు అయింది. -
టీఆర్ఎస్ ఎమ్మెల్సీని అడ్డుకున్న పోలీసులు
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించేలా ఓ పోలింగ్ కేంద్రంలోకి అనుచరులతో వెళ్లేందుకు ప్రయత్నించిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. మండల కేంద్రంలోని బాలుర హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్దకు రాజేశ్వర్రెడ్డి ఉదయమే వచ్చారు. ఆయన వెంట సుమారు 60 మంది స్థానిక నాయకులు కూడా ఉన్నారు. అందరూ కలసి గుంపుగా లోపలికి వెళుతుండగా స్థానిక ఎస్ఐ రాఘవేందర్ సిబ్బందితో కలసి అడ్డుకున్నారు. నిబంధనల ప్రకారం అలా వెళ్లకూడాదని స్పష్టం చేశారు. ఈ పోలింగ్ కేంద్రం పరిధిలో ఓటరు కూడా కానందున.. కావాలంటే 100 మీటర్ల దూరంలో ఉండి పోలింగ్ను పర్యవేక్షించుకోవచ్చని సూచించారు. దీంతో రాజేశ్వర్రెడ్డి వెనక్కి తగ్గారు. -
వాళ్లకు ఓటడిగే హక్కు లేదు..
* కేసీఆర్ పాలనను బంగాళాఖాతంలో కలపండి * వరంగల్ ఉపఎన్నిక ప్రచార సభలో వైఎస్ జగన్ పిలుపు * ఎన్నికల హామీలన్నీ అటకెక్కించారు.. చేతగాని పాలన సాగిస్తున్నారు * విడతలుగానే రుణమాఫీ అని ఎన్నికల ముందు చెప్పారా? * అపరాధ వడ్డీలు కట్టడానికే సరిపోతున్న మాఫీ సొమ్ములు * అన్నదాతల ఆత్మహత్యలకు కారణం మీరు కాదా..? * కొత్తగా ఒక్క 108 అంబులెన్సు కొన్నారా? * గతేడాది ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలకే దిక్కులేదు * 79 రోజులుగా ఆశవర్కర్లు నిరాహారదీక్ష చేస్తున్నా పట్టదా? * ఏడాదిన్నరలో 396 ఇళ్లు కట్టడమే కేసీఆర్ ఘనత * ఏడాదికి 10 లక్షల ఇళ్లు కట్టి దేశానికే ఆదర్శంగా నిలిచిన వైఎస్ఆర్ * ఈ పాలనలో నింగినంటిన నిత్యావసరాల ధరలు.. * విలువలు, విశ్వసనీయత ఉన్న ఏకైక పార్టీ మాదే * ఓటడిగే హక్కు వైఎస్సార్ కాంగ్రెస్కే ఉంది.. * వరంగల్ ఉప ఎన్నిక ప్రచారానికి తెర వరంగల్ నుంచి సాక్షిప్రతినిధి: ‘రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉన్న ఏకైక పార్టీ మాదే. ఈ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే ఉంది. కేసీఆర్ అధికారంలోకి వచ్చి 18 నెలలకు పైగా అవుతోంది. ఎన్నికలకు ముందు కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చారు. వాగ్దానాలు చేశారు. 18 నెలల పాలన ఎలా సాగింది? ఆప్పుడిచ్చిన హామీలు ఏమైనా నెరవేరాయా? ఒక్కసారి పరిశీలించిన తరువాత మనం ఈ ఉప ఎన్నికలో ఓటు వేద్దాం. మనం వేస్తున్న ఈ ప్రశ్నలకు కేసీఆర్ నుంచి సరైన సమాధానం వస్తే ఆయనకే మద్దతు తెలుపుదాం. ఒకవేళ ఆయన నుంచి సరైన సమాధానం రాకపోతే ఆయన్ను బంగాళాఖాతంలో కలిపేందుకు ముందడుగు వేయాలి’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ విజయాన్ని కాంక్షిస్తూ తెలంగాణ రాష్ట్ర వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలసి నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారం గురువారం వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో ముగించారు. స్టేషన్ ఘన్పూర్ బస్టాండ్ చౌరస్తాకు భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే... ఒక్క అంబులెన్సు కూడా కొనలేదు.. ‘పేదవాడు అప్పులపాలు కావడానికి రెండు ప్రధానమైన కారణాలు ఉంటాయని వైఎస్ఆర్ భావించేవారు. హఠాత్తుగా ఏదైనా పెద్ద జబ్బు చేసినపుడు ఆ పేదవానికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతుంది. దాన్నుంచి బైటపడడానికి గాను ఎంత వడ్డీ అయినా పరవాలేదని చెప్పి లక్షలు అప్పుచేసి వైద్యం చేయించినపుడు ఆ పేదవాడు అప్పులపాలైపోతాడు. వారికి ఆ పరిస్థితి రాకూడదని భావించిన వైఎస్ఆర్ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేశారు. 108కి ఫోన్చేస్తే 20నిమిషాల్లోనే పేదవాని ఇంటికి అంబులెన్సు వచ్చి రోగిని తీసుకెళ్లి పెద్దాసుపత్రిలో ఖరీదైన వైద్యం చేయించే పథకం అది. వైఎస్ఆర్ మనకు దూరమైపోయి ఆరేళ్లవుతోంది. ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టి ఎనిమిదేళ్లవుతోంది. ఇన్నేళ్లయి నా ఇవాళ్టికి కూడా ఒక్క కొత్త అంబులెన్సును ఎందుకు కొనలేకపోయారు? ఇప్పటికీ అవే పాతబడ్డ అంబులెన్సులు. వాటి కి కనీసం టైర్లు కూడా మార్చలేని పరిస్థితి. ఆరోగ్యశ్రీ పథకంలో పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు పెరగడం లేదు. దాంతో వాళ్లు సమ్మె చేస్తున్న పరిస్థితి. వారిని పట్టించుకునే నాథుడే లేడు. వీటన్నిటికీ సమాధానాలు చెప్పాలని కేసీఆర్ను అడగండి. మీ పరిపాలన ఇంత దారుణంగా ఉందని ఆయనకు చెప్పండి. ఫీజు రీయింబర్స్మెంట్ గతేడాది బకాయిలకే దిక్కులేదు.. పేదవాని బిడ్డ డాక్టర్, ఇంజనీర్, కలెక్టర్ వంటి పెద్ద చదువులు చదివినప్పుడే పేదరికం పోతుందని వైఎస్ఆర్ ఆలోచించారు. పెద్ద చదువుల కోసం పేదవాడు అప్పులపాలు కారాదన్న ఆలోచనతో ఆయన ఫీజు రీయిం బర్స్మెంట్ పథకాన్ని అమలుచేశారు. ఈ పథకం కింద గతఏడాది (2014-15)కి రూ.2,452 కోట్లు అవసరం ఉంటే వాటిలో కేవలం 922 కోట్లు మాత్రమే చెల్లించారు. ఇంకా 1,530 కోట్లు బకాయిలున్నాయి. ఈ ఏడాది కాలేజీలు మొదలై ఇప్పటికే ఐదునెలలు గడచిపోయాయి. కాలేజీల్లో ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం పూర్తయి సర్టిఫికెట్లు అడిగితే విద్యార్థులకు కాలేజీ యాజమాన్యాలు ఇవ్వడం లేదు. ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని చెబుతున్నారు. ఇదేం పరిపాలన కేసీఆర్గారూ అని గట్టిగా నిలదీయండి. వాళ్లకు ఓటడిగే హక్కు లేదు.. టీఆర్ఎస్ పాలించడం చేతకాని పార్టీ కనుక దానికి ఓటేయవద్దు. కాంగ్రెస్ అత్యంత నీచమైన పార్టీ. అవసరమైతే దండలేస్తారు. అవసరం తీరాక బండలేస్తారు. బతికినంత కాలం కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వైఎస్ఆర్పై ఎలాంటి అభాండాలు వేశారో, ఆయన కుటుంబాన్ని ఎలా జైలుపాలు చేశారో మీ అం దరికీ తెలుసు. నాయకుడినే ఇబ్బందిపెట్టిన పార్టీకి ప్రజలు ఓ లెక్కా? ఎవరో సచిన్ పైలట్ అట. ఆయన వచ్చి మన దగ్గర మీటింగులు పెడుతున్నారు. ఆయనకు తెలుగువస్తుం దా? ఇలాంటి తెలుగు మాట్లాడలేని, తెలుగు అర్ధం చేసుకోలేని వాళ్లు మన దగ్గరకు వచ్చి మీటింగులు పెడితే వారిని చూసి మనం ఓటె య్యాలంట. బీజేపీకి ఓటేయమని చంద్రబాబు అడిగితే.. ఆంధ్రలో దారుణమైన అబద్ధాల పాలన సాగిస్తున్న విషయం గుర్తుచేయండి. వెన్నుపోటు, అబద్ధాలు, మోసం పునాదుల పైనే ఆయన పాలన సాగిస్తున్న విషయం చెప్పండి. విభజన హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చని బీజేపీకి ఎందుకు ఓటేయాలని అడగండి. ఈ నాయకులకు బుద్ధి రావాలంటే, వారు నేలమీద నడవాలంటే మీ ఓటు ద్వారానే సాధ్యమౌతుంది. ఇప్పటికీ వైఎస్ఆర్ను గుం డెల్లో పెట్టుకున్న మీ అందరినీ ఓటడిగే హక్కు మాకే ఉంది. విలువలు, విశ్వసనీయత ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి పార్టీ అభ్యర్థికి అఖండ విజ యం చేకూర్చండి.’ అని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ శాసనసభా పక్ష నాయకుడు పాయం వెంకటేశ్వర్లు, ప్రోగ్రాం సమన్వయకర్త తలశిల రఘురాం, వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు జెన్నారె డ్డి మహేందర్, రాష్ట్ర నాయకులు గట్టు శ్రీకాంత్రెడ్డి, గాదె నిరంజన్రెడ్డి, శివకుమార్, కొండా రాఘవరెడ్డి, ఇరుగు సునీల్కుమార్, డాక్టర్ పి. ప్రపుల్లారెడ్డి, గౌరెడ్డి శ్రీధర్రెడ్డి, బీ. రఘురాంరెడ్డి, జి. రాంభూపాల్రెడ్డి, బిమయ్యగౌడ్, సంపత్, సలీం సంతోశ్రెడ్డి, సుమిత్గుప్తా, బీష్వ రవీందర్, అమర్నాథ్రెడ్డి, సంజీవరావు, బొడ్డు సాయినాథ్రెడ్డి, సింగిరెడ్డి భాస్కర్రెడ్డి, బీ శ్రీనివాసరావు, అజయ్వర్మ, నర్రా భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. ఆశ వర్కర్ల గోడు పట్టదా? ఆశవర్కర్లు 79 రోజు లుగా సమ్మె చేస్తున్నారు. నెలకు రూ.500 నుంచి రూ.1000 సంపాదించే ఆశావర్కర్లు కిలో కందిపప్పు రూ.230, కిలో టమోటా రూ.50 లకు కొని ఎలా బతగ్గలరు అన్న ఆలోచన చేయలేని అధ్వాన్న పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. పత్తిని సీసీఐ కొనుగోలు చేయడంలేదు. కనీస మద్దతు ధర క్వింటాల్కు రూ.3,500 కూడా దక్కడం లేదు. వైఎస్ హయాంలో పత్తి క్వింటాల్కు రూ.6,700 పలికిన విషయాన్ని కేసీఆర్కు గుర్తుచేయం డి. ప్రతి దళితునికి మూడెకరాలు ఇస్తానన్న కేసీఆర్ 18 నెలల్లో 1,600 ఎకరాలు పంచారు. వైఎస్ఆర్ ఐదేళ్లలో 20.60 లక్షల ఎకరాలు పంపిణీ చేసిన విషయం తెలియజేయండి. ఎన్నికలకు ముందే ఎందుకు చెప్పలేదు? ఎన్నికలకు ముందు బ్యాంకు రుణాలు కట్టొద్దన్నారు. పంటరుణాలన్నీ మాఫీ అన్నారు. అధికారంలోకి వచ్చాక నాలుగు విడతల్లో రుణమాఫీ అం టున్నారు. మాట ఇచ్చి వెనక్కు తగ్గినందునే ఇవాళ రైతుల మీద 14 శాతం అపరాధ వడ్డీ పడుతోంది. రుణాలు రెన్యువల్ కాకపోవడంతో పంటల బీమా కూడా అందక రైతన్న పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అందువల్లే ఒక్క వరంగల్ జిల్లాలోనే 150 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నాలుగువిడతలుగా రుణమాఫీ చేస్తానని ఎన్నికలకు ముందే ఎందుకు చెప్పలేదని కేసీఆర్ను నిలదీయండి. వైఎస్ దేశంతో పోటీ పడ్డారు, మరి మీరు? అధికారంలోకి వస్తే రెండు పడకగదుల ఇళ్లు కట్టించి ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. 18 నెలల కాలంలో ఆయన కట్టించిన ఇళ్లు కేవలం 396. అదే వైఎస్ఆర్ హయాంలో ఏడాదికి 10 లక్షల చొప్పున ఐదేళ్లలో 48 లక్షల ఇళ్లు కట్టించి ఇచ్చారు. దేశం మొత్తం మీద 48 లక్షల ఇళ్లు కట్టిస్తే వైఎస్ఆర్ ఒక్కరే మన రాష్ర్టంలో 48 లక్షల ఇళ్లు కట్టించి దేశంతో పోటీ పడ్డారు. 18 నెలల్లో 396 ఇళ్లు కట్టించి అదేదో గొప్పగా చేసినట్లు పేపర్లలో రాయించుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావని కేసీఆర్ను గట్టిగా అడగండి. బుట్ట పట్టుకొని మార్కెట్కు ఎపుడన్నా వెళ్లారా? ఎపుడన్నా మార్కెట్కు వెళ్లారా.. సరుకులు కొన్నారా అని కేసీఆర్ను అడగండి. కిలో కందిపప్పు రూ.230 ఉంది. గత ఏడాది రూ.90కే వచ్చేది. కిలో మినప్పప్పు రూ. 170 నుంచి 200 ఉంది. గతేడాది రూ.85 ఉం డేది. ఉల్లిపాయలు రూ.40 పలుకుతున్నాయి. గతేడాది రూ.22కే దొరి కేవి. టమోటా కేజీ రూ. 45 నుంచి 50 ఉన్నాయి. గతేడాది రూ.14 మాత్రమే. ఇలా ధరలన్నీ ఆకాశాన్ని అంటుతుంటే ఎలా కొనాలి? ఎలా బతకాలి కేసీఆర్గారూ.. ఇదేనా మీరు ప్రభుత్వం నడిపేతీరు అని నిలదీయండి. ఒకవైపేమో రైతుకు కనీస మద్దతు ధర దొరకడం లేదు. -
కేసీఆర్ పాలనను బంగాళాఖాతంలో కలపండి...
-
కేసీఆర్ పాలనను బంగాళాఖాతంలో కలపండి...
వరంగల్ : ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయని ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను బంగాళాఖాతంలో కలిపేందుకు ముందడుగు వేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. స్టేషన్ ఘన్పూర్ ఎన్నికల ప్రచార సభలో గురువారం ఆయన మాట్లాడుతూ....వరంగల్ ఉప ఎన్నిక ఎందుకు తీసుకు వచ్చారో కేసీఆర్ను ప్రజలు నిలదీయాలన్నారు. ఒక్క వరంగల్ జిల్లాలోనే 150 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రైతుల ఆత్మహత్యలకు కారణమెవరో నిలదీయాలన్నారు. లక్ష లోపు రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారని, అయితే ఇంతవరకూ ఎన్ని రుణాలను మాఫీ చేశారని వైఎస్ జగన్ ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీశారు. తాము అధికారంలోకి వచ్చాక నాలుగు దఫాలుగా రుణ మాఫీ చేస్తామంటున్నారని, ఇవాళ రైతుల మీద 14 శాతం అపరాధ వడ్డీ పడుతోంది. విడతల వారీగా కేసీఆర్ ఇచ్చే మొత్తంలో మూడొంతులు వడ్డీకే పోతోంది. ఇంకో వైపు రుణాలు రెన్యూవల్ కాకపోవడంతో క్రాప్ ఇన్సూరెన్స్ కూడా అందక రైతన్న పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆయన అన్నారు. ఇక నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయని, సామాన్య ప్రజలు ఏం కొనేటట్లు లేదని వైఎస్ జగన్ అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.... *వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలో పత్తి క్వింటాల్కు రు.6,700 పలికింది. *ఇప్పుడు రూ.3 వేలు కూడా పలకడం లేదు. * రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చి, ఇప్పుడు 4 విడతల్లో మాఫీ చేస్తామంటున్నారు. * ఏడాది క్రితం కందిపప్పు రూ.90 ఉంటే... ఇప్పుడు రూ.230 అయింది. * పెసరపప్పు రూ.85 నుంచి రు.200 అయింది. *టమాటాలు కేజీ రూ.14 నుంచి రూ.45 అయింది. * 18 నెలల్లో ఎన్ని ఇళ్లు కట్టించారో కేసీఆర్ను అడగండి. * వైఎస్ఆర్ ఐదేళ్లలో 48 లక్షల ఇళ్లు కట్టించి ఇచ్చారు. * కేసీఆర్ ఇప్పటివరకూ 394 ఇళ్లు మాత్రమే కట్టించారు. * ప్రతి దళితుడికి 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు. * ఇప్పటివరకూ ఎంతమందికి ఇచ్చారో కేసీఆర్ను అడగండి. * కేసీఆర్ కేవలం 1600 ఎకరాలు ఇచ్చి చేతలు దులపుకున్నారు. *వైఎస్ఆర్ పేదలకు 20 లక్షల 66 ఎకరాల భూమి పంపిణీ చేశారు. * పేదలు పెద్ద చదువులు చదవాలని వైఎస్ఆర్ ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేశారు? *కానీ కేసీఆర్ సర్కార్ గతేడాది బకాయిలే రూ.1530 కోట్లు చెల్లించలేదు. *పేదవారి వైద్య సేవల కోసం 108 వైఎస్ఆర్ ప్రవేశపెట్టారు. *వైఎస్ఆర్ కొన్న అంబులెన్స్లు తప్ప... ఈ ప్రభుత్వం ఒక్క కొత్త అంబులెన్స్ కొనలేదు. *ఈ పాలకులకు బుద్ధి రావాలంటే రాజన్న రాజ్యం రావాలి. * కాంగ్రెస్ అంత అన్యాయమైన పార్టీ ఎక్కడా ఉండదు * ప్రాణాలు లెక్కచేయక వైఎస్ఆర్ ...కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తే జగన్ పార్టీ విడిచిపెట్టాక వైఎస్ఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ జైలుకు పంపింది. * కాంగ్రెస్ పార్టీకి విలువలు, విశ్వసనీయత లేదు. * చంద్రబాబు పాలన అంతా అబద్ధాలు, మోసం, వెన్నుపోటు. * అధికారంలోకి వచ్చి 18 నెలులు అయినా, కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఒక్క హామీ నెరవేర్చలేదు. *వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఓట్లు అడిగే హక్కు ఉంది. *వైఎస్ఆర్ ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి మేలు చేశారు. *వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్కు ఓటు వేసి గెలిపించండి. *ఓటు అడిగే హక్కు ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది. -
కేసీఆర్కు దిమ్మతిరిగేలా తీర్పు ఇవ్వండి
-
కేసీఆర్కు దిమ్మతిరిగేలా తీర్పు ఇవ్వండి: వైఎస్ జగన్
వరంగల్ : 'ఇవాళ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. ఈ ఎన్నికలు ఎందుకు జరుగుతున్నాయని ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. హఠాత్తుగా ఎవరైనా చనిపోయి ఉంటే... ఎన్నికలు జరుగుతున్నాయనుకుంటే ఎవరికీ ఆక్షేపణ ఉండదు. నిజంగా కూడా గర్వపడేవారం. ఎన్నికలు ఎందుకు జరుగుతున్నాయంటే... కేసీఆర్ మోజు తీర్చుకునేందుకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉన్న ఎంపీని ఆ పదవికి రాజీనామా చేయించి, ఆయనను మంత్రిని చేశారు. ఇవాళ ప్రజల నెత్తిన ఇంత భారం వేస్తున్నారు. ఎన్నికలు ఎలాగూ వచ్చాయి కాబట్టి... ఓటు వేసేటప్పుడు ఆలోచన చేయాల్సి ఉంది. 18 నెలల పరిపాలన చూశాక, కేసీఆర్ కు ఓటు వేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. పొరపాటు కేసీఆర్ కు ఓటు వేస్తే... నా పాలన బాగుంది అందుకే ఓటు వేశారనుకుంటారు. ఇప్పుడే పట్టించుకోవటం లేదు. ఇక ఉప ఎన్నికలో గెలిస్తే... ఇక అస్సలు పట్టించుకోరని' వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వరంగల్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం సాయంత్రం హన్మకొండలోని హయగ్రీవాచారి స్టేడియంలో బహిరంగ సభలో ప్రసంగించారు. వరంగల్ లోక్సభ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించి.... సీఎం కేసీఆర్కు దిమ్మతిరిగేలా తీర్పు ఇవ్వాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. అనుకున్న సమయం కన్నా ఆలస్యంగా సభ ప్రారంభమైనా ఎంతో ఓపిగ్గా వేచి ఉన్నందుకు అందరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పారు. అంతకు ముందు వైఎస్ జగన్కు ఓరుగల్లు ప్రజలు నీరాజనం పలికారు. పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్ తరపున వైఎస్ జగన్ చేస్తున్న ఎన్నికల ప్రచారానికి ప్రతిచోట విశేష స్పందన లభిస్తోంది. అంతకుముందు గీసుకొండలో ప్రసంగించిన వైఎస్ జగన్... సీఎం కేసీఆర్ 18నెలల పాలనపై నిప్పులు చెరిగారు. ఇంకా వైఎస్ జగన్ ఏమన్నారంటే! మీ అందరి ఆప్యాయతలకు, ప్రేమానురాగాలకు శిరస్సు వంచి పేరుపేరును కృతజ్ఞతలు తెలుపుకొంటున్నా. ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు ఎందుకు జరుగుతున్నాయని ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి హఠాత్తుగా ఎవరైనా చనిపోయి ఉండి ఈ ఎన్నికలు జరిగి ఉంటే ఎవరికీ ఆక్షేపణ ఉండకపోయింది లేక కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకు నిరసనగా ఈ ఎన్నికలు జరిపి ఉంటే గర్వపడేవాళ్లం కానీ కేసీఆర్ మోజు తీర్చుకునేందుకే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి మీ పార్టీలో మన జిల్లా నుంచి గెలిచిన దళిత ఎమ్మెల్యేలు ఎవరూ లేరా? అని కేసీఆర్ ను అడగండి వరంగల్ జిల్లాలోనే ఇద్దరు దళిత ఎమ్మెల్యేలున్నా, మోజుపడి ఎంపీతో రాజీనామా చేయించి.. మంత్రిని చేశారు. డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తిని పదవి నుంచి ఊడబెరికారు తన మోజు తీర్చుకోవడానికి ప్రజల నెత్తిన ఈ ఎన్నికల భారాన్ని కేసీఆర్ మోపుతున్నారు కేసీఆర్ 18 నెలల పాలన చూసి ఈ ఎన్నికల్లో ఓటు వేయాలి. పొరపాటున మనం కేసీఆర్కు ఓటు వేస్తే.. నా పరిపాలన బాగుందన్న భావనతో ఆయన ప్రజల్ని అసలే పట్టించుకోరు 18 నెలల పాలనలో 150 మంది రైతులు మన జిల్లాలోనే ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? కేసీఆర్ ఒక్కసారైనా పత్తిరైతుల పొలాల్లోకి వెళ్లారా? వాళ్ల కష్టాలను స్వయంగా చూశారా? పత్తి క్వింటాలు మద్దతు ధర 4,500 చెప్పి.. ఆ కోత, ఈ కోత పేరిట రైతులకు రూ. 3,500 ధర కూడా చెల్లంచడం లేదు. రైతు రుణమాఫీ అమలు విషయంలో మోసం చేశారు. నాలుగు దఫాలుగా రుణాలను రద్దు చేస్తామని ఎన్నికల అప్పడే ఎందుకు చెప్పలేదు? రుణాలు చెల్లించకపోవడంతో రైతుల నుంచి బ్యాంకులు 14శాతం అపరాధ వడ్డీని వసూలుచేస్తున్నాయి. దీంతో వచ్చే మాఫీ సొమ్ములో ముప్పావు వంతు అపరాధ వడ్డీకే వెళుతున్నది దివంగత నేత వైఎస్ఆర్ పరిపాలన గుర్తుతెచ్చుకోండి అని కేసీఆర్కు చెప్పండి సీఎం అంటే వైఎస్ఆర్ మాదిరిగా ఉండాలి రెండు బెడ్రూంల కట్టిస్తామని ఎన్నికల సమయంలో కేసీఆర్ చెప్పారు కానీ ఈ 18 నెలల పాలనలో ఎన్ని ఇళ్లు కట్టించారు? అని కేసీఆర్ను ప్రశ్నించండి రాష్ట్రం మొత్తంగా కేసీఆర్ 398 ఇళ్లు మాత్రమే ఇప్పటివరకు కట్టించారు వైఎస్ఆర్ ఐదేళ్లలో ఒక్క మన రాష్ట్రంలోనే 48 లక్షల ఇళ్లు కట్టారు ఏ రోజు అయినా మీరు మార్కెట్కు వెళ్లారా? కూరగాయలు కొనాలంటే రేట్లు షాకు కొడుతున్నాయని కేసీఆర్ను గట్టిగా నిలదీయండి ఏడాది కిందట కేజీ కందిపప్పు రూ. 90 ఉంటే ప్రస్తుతం రూ. 230. రూ.85 ఉన్న మినపపప్పు ప్రస్తుతం 200 కేజీ టమాటా ధర రూ. 14 నుంచి 50 అయింది. పేదరికం పోవాలంటే ప్రతి ఇంటి నుంచి ఒక్కరన్నా డాక్టర్ కావాలి, ఒక్కరన్నా ఇంజినీర్ కావాలి అనే ఉద్దేశంతో దివంగత నేత వైఎస్ఆర్ ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని తెచ్చారు ఇవాళ ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం అమలు సరిగ్గా జరుగలేదు. కాలేజీలు మొదలై కూడా ఐదు నెలలు అవుతున్నా.. ఇప్పటికీ గత ఏడాది ఫీజు బకాయిలే ప్రభుత్వం విడుదల చేయలేదు. ప్రతి దళితుడికి కూడా మూడు ఎకరాల భూమి ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇప్పటివరకు ఎన్ని ఎకరాల భూమి పంచారో కేసీఆర్ను అడగండి వైఎస్ఆర్ పేదలకు 20 లక్షల 66వేల ఎకరాల భూమిని పంచితే.. కేసీఆర్ 1600 ఎకరాలు మాత్రమే పంచారు. విశ్వసనీయత రావాలంటే రాజన్న రాజ్యం రావాలి. అందుకు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్కు ఓట్లు వేసి.. అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరుతున్నా. -
కేసీఆర్ గారూ పొలాలకు వెళ్లారా?
వరంగల్ : వరంగల్ ఉప ఎన్నిక సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కొనసాగుతోంది. బుధవారం ఆయన గీసుకొండలో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ...కేసీఆర్ సర్కార్పై నిప్పులు చెరిగారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 20 లక్షల 60వేల ఎకరాల భూములు పంచారని... అధికారంలోకి వచ్చాక ఎంత భూమిని పంపిణి చేశారనే విషయాన్ని కేసీఆర్ ను గట్టిగా నిలదీయాలని సూచించారు. కేసీఆర్ అధికారం చేపట్టి 18 నెలలు అవుతోందని, ఈ కాలంలో ఆయన ప్రజలకు పంచింది కేవలం 16వందల ఎకరాలు మాత్రమేనని వైఎస్ జగన్ అన్నారు. ఇక నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయారన్నారు. ఇక పత్తికి కనీస మద్దతు ధర ఇచ్చే పరిస్థితి లేదన్నారు. రైతన్న ఆరుగాలం శ్రమించి పత్తి పండిస్తే... ఇవాళ మార్కెట్లో కొనే నాధుడే లేరన్నారు. అది బాగోలేదు...ఇది బాగోలేదంటూ రైతుల వద్ద నుంచి పత్తిని కొనడం లేదని, ఈ విషయం కేసీఆర్కు తెలుసా అని ఆయన ప్రశ్నించారు. పత్తి పండించేందుకు రైతులు పడుతున్న కష్టాలు చూడాలని..., ఒకసారి పత్తి పొలాలకు వస్తే పరిస్థితి అర్థం అవుతుందన్నారు. ప్రస్తుతం పత్తి క్వింటాల్ కి 4,100 వస్తుందని, అదే రాజశేఖరరెడ్డి హయాంలో రూ.6,700 వరకూ వచ్చిన విషయాన్ని గుర్తించాలని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ కు ఓటు వేసి, ఆయన్ని గెలిపించాలని వైఎస్ జగన్ కోరారు. -
కేసీఆర్ మోజు వల్లే వరంగల్ ఉప ఎన్నిక
-
కేసీఆర్ మోజు వల్లే వరంగల్ ఉప ఎన్నిక: వైఎస్ జగన్
వరంగల్ : వరంగల్ లోక్సభ ఉప ఎన్నిక సందర్భంగా జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. తొర్రూర్లో ఆయన ఇవాళ సాయంత్రం బహిరంగ సభలో ప్రసంగించారు. వరంగల్ ఉప ఎన్నికకు టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆరే కారణమని వైఎస్ జగన్ అన్నారు. కేసీఆర్ మోజు పడ్డారని, అందువల్లే ఉప ఎన్నికలు వచ్చాయని వైఎస్ జగన్ విమర్శించారు. దళిత ఎమ్మెల్యేలు ఇద్దరు ఉన్నా... ఎంపీతో రాజీనామా చేయించారని అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కన్నా మంచి పాలన ఇచ్చిన నేత ఎవరైనా ఉన్నారా అని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. ప్రతి పేదవాడి గుండెల్లో వైఎస్ఆర్ ఉన్నారన్నారు. ఓ వైపు వర్షం పడుతున్నా...వైఎస్ జగన్ బహిరంగ సభకు భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ఓ వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడం కోసమే ఈ ఉప ఎన్నికలు వచ్చాయి. ఉప ఎన్నికలు రావడానికి ఇదా కారణమని టీఆర్ఎస్ నేతలను గట్టిగా అడుగండి కేంద్రం తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చి అమలుచేయలేదు. అందుకు నిరసనగా రాజీనామా చేయించి ఉప ఎన్నికలు తీసుకొచ్చి ఉంటే ప్రజలు గర్వించేవారు దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డిని ప్రజలు హృదయాల్లో ఉంచుకున్నారు. దివంగత నేత వైఎస్ఆర్ పరిపాలనకు ముందు, తర్వాత చాలామంది ముఖ్యమంత్రులను చూశాం అయినా ఎవరూ దివంగత నేత రాజశేఖర్రెడ్డి కన్నా మంచి పరిపాలన అందించలేదు. దివంగత నేత వైఎస్ఆర్ మనమధ్య లేకున్నా.. ఆయన మన గుండెల్లో బతికే ఉన్నారు ఏ ముఖ్యమంత్రి చేయనివిధంగా ఆయన ప్రతి పేదవాడికీ మేలు చేశారు దివంగత నేత స్వర్ణయుగాన్ని ఒక్కసారి ప్రజలు గుర్తు చేసుకోవాలి ప్రతి పేద విద్యార్థి ఉన్నత చదువులు చదువుకొనేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని వైఎస్ఆర్ ప్రవేశపెట్టారు కాలేజీలు ప్రారంభమై ఆరు నెలలు గడిచినా.. ప్రస్తుత ప్రభుత్వం గత ఏడాది ఫీజులు ఇంకా విడుదల చేయలేదు 108 ఫోన్ చేస్తే చాలు అంబులెన్స్ ఇంటివద్దకు వచ్చేవిధంగా వైఎస్ఆర్ ఏర్పాటు చేశారు జబ్బు చేసిన పేదవాడికి పెద్ద ఆస్పత్రుల్లో చికిత్స అందించేవిధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చారు ప్రతి అక్క, ప్రతి చెల్లి లక్షాధికారి కావాలనే ఉద్దేశంతో పావులా వడ్డీకి రుణాలు ప్రవేశపెట్టారు దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామన్న కేసీఆర్ హామీ ఏమైంది? ఇప్పటివరకు కేవలం 1600 ఎకరాలు మాత్రమే పంపిణీ చేశారంటే.. రాష్ట్ర పరిపాలన ఎంత అధ్వాన్న పరిస్థితిలో ఉందో తెలుస్తోంది. మేం అధికారంలోకి వస్తే డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామన్నారు. కేసీఆర్ 18 నెలల పాలనలో 896 ఇళ్లు మాత్రమే కట్టించారు. ఒక్క వరంగల్ జిల్లాలోనే 150మందిపైకి రైతులు చనిపోయారు. వరంగల్ ఉప ఎన్నికలో ఓటు అడిగే హక్కు మా పార్టీకే మాత్రమే ఉంది ఫ్యాన్ గుర్తుకు ఓటువేసి.. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ను అఖండ మెజారిటీతో గెలిపించండి కాగా అంతకు ముందు రోడ్ షోలు ద్వారా వైఎస్ జగన్... ప్రజలను కలుస్తున్నారు. ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి సమస్యలు తెలుసుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి జనగాం మీదుగా పాలకుర్తి చేరుకున్న వైఎస్ జగన్.. దద్దేపల్లి, కొండాపురం, ఒగులాపూర్, జఫర్ గడ్, దమ్మన్నపేట, వర్ధన్నపేట, నందనంల్లో రోడ్ షోలు నిర్వహించారు. వర్ధన్నపేట సమీపంలోని పొలాల్లోకి వెళ్లి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా వుండాలని, మంచి రోజులు వస్తాయని జగన్ రైతులకు భరోసా ఇచ్చారు. -
ఎమ్మెస్సార్ను ఎందుకు ప్రశ్నించడం లేదు: రేవంత్
హైదరాబాద్ : వరంగల్ ఉప ఎన్నిక సందర్భంగా అభ్యర్థి ప్రకటన, ఖర్చుపై టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్పై తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి శనివారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కేసీఆర్ పరిపాలనా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. టీఆర్ఎస్పై కాంగ్రెస్ వైఖరేంటో చెప్పాలని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనను పొడిగిన కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెస్సార్ను ఆ పార్టీ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి ఎందుకు ప్రశ్నించడం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పాలనపై ఎమ్మెస్సార్... కాంగ్రెస్ మనసులో మాటను బయటపెట్టారన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేస్తే మురిగిపోయినట్లేనని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి అత్యధిక నిధులు తీసుకురావాలంటే ఎన్డీయే అభ్యర్థిని గెలిపించాలన్నారు. -
ఫామ్హౌజ్లో చేస్తేనే వ్యవసాయమా?
హైదరాబాద్ : వరంగల్ ఉప ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్కు గుణపాఠం చెపుతారని బీజేఎల్పీ నేత డాక్టర్ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ ప్రశ్నించే తత్వాన్ని అణిచివేస్తున్న టీఆర్ఎస్ను ప్రజలు అణచివేస్తారని అన్నారు. పేదోళ్లపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, ఫామ్హౌజ్లో చేస్తేనే వ్యవసాయమా అని లక్ష్మణ్ సూటిగా ప్రశించారు. చిన్న, సన్నకారు రైతులు చేసేది వ్యవసాయం కాదా అంటూ ఆయన ప్రశ్నలు సంధించారు. జీహెచ్ఎంసీ డి లిమిటేషన్ ప్రక్రియ దారుసలాంలో జరిగితే టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తోందని లక్ష్మణ్ విమర్శించారు. -
ఆయన చరిత్ర అందరికీ తెలుసు...
హైదరాబాద్ : వరంగల్ ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. కేంద్ర మంత్రులుగా ఉంటూ గతంలో తెలంగాణ పేరు చెప్పడానికి ఇష్టపడని జైపాల్ రెడ్డి, సర్వే సత్యనారాయణనలు తమను విమర్శించే హక్కు లేదని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. వరంగల్లో తమకు పోటీ ఎవరూ లేరని, ఉత్తమ్ కుమార్ రెడ్డి తాను చేసిన అవినీతిని అందరూ చేస్తారని అనుకుంటున్నారని కర్నె మండిపడ్డారు. ఆయన చరిత్ర అందరికీ తెలుసంటూ ధ్వజమెత్తారు. కాగా డిప్యూటీ సీఎం పదవి నుంచి రాజయ్యను తొలగించి.. దళితులను కేసీఆర్ అవమానించారంటూ జైపాల్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీకి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం అయినట్లే... తెలంగాణ సీఎం కేసీఆర్కి కూడా వరంగల్ ఉప ఎన్నికలో పరాభవం తప్పదని ఆయన జోస్యం చెప్పారు. వరంగల్ ఉప ఎన్నిక సమీపిస్తున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు తమతమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఆ క్రమంలో జైపాల్ రెడ్డి గురువారం వరంగల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు -
'వరంగల్లో వార్ వన్ సైడ్'
రానున్న రోజుల్లో ప్రాంతీయ పార్టీలే దేశ రాజకీయాల్లో కీలకంగా మారనున్నాయని టీఆర్ఎస్ ఎంపీ కవిత జోస్యం చెప్పారు. మంగళవారం ఆమె హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాల సమస్యలను కేంద్రానికి ఎన్నిసార్లు వివరించినా.. ఫలితం లేకుండా పోతోందని విమర్శించారు. సమస్యలపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందనా లేదన్నారు. 16నెలలుగా హైకోర్టు విభజన కోసం ఉద్యమాలు చేస్తున్నా.. కేంద్రం పట్టించుకోవడం లేదని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ ఉప ఎన్నికపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ... 'వరంగల్ లో వార్ వన్ సైడ్' అంటూ స్పందించారు. -
అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు: నల్లా
హైదరాబాద్ : వరంగల్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చిందుకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కార్యాలయంలో పొంగులేటి...నల్లా సూర్యప్రకాశ్కు బీ ఫాం అందచేశారు. ఈ సందర్భంగా నల్లా సూర్యప్రకాశ్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామని ఆయన అన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలే తమ ప్రచారాస్త్రాలుగా ప్రజల్లోకి వెళతామని నల్లా తెలిపారు. రైతులు పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతుల బలవన్మరణాలను కనీసం నమోదు కూడా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళామన్నారు. -
'అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు'
-
వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా నల్లా సూర్యప్రకాశ్
-
వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా నల్లా సూర్యప్రకాశ్
హైదరాబాద్ : వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేరు ఖరారు అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నల్లా సూర్యప్రకాశ్ను బరిలోకి దించుతున్నట్లు తెలంగాణ వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఆయన మంగళవారం పార్టీ కార్యాలయంలో ప్రెస్మీట్లో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతోనే ప్రచారం చేపడతామని తెలిపారు. నల్లా సూర్యప్రకాశ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పొంగులేటి ఈ సందర్భంగా వరంగల్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కొంతమంది వైఎస్ఆర్ సీపీని విమర్శలు చేస్తున్నారని, వారి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని పొంగులేటి మండిపడ్డారు. -
మధ్యాహ్నం వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి ప్రకటన
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. వరంగల్ లోక్ సభ ఉప ఎన్నిక అభ్యర్థిని మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రకటించనుంది. తెలంగాణ వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ...అభ్యర్థి పేరును వెల్లడించనున్నారు. వరంగల్ పార్లమెంట్ స్థానానికి అభ్యర్థిగా అందరికీ ఇష్టమైన వ్యక్తిని అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటిస్తారని, ఆ అభ్యర్థి 4వ తేదీన నామినేషన్ వేస్తాడని పొంగులేటి శ్రీనివాస్రెడ్డి గతంలో తెలిపిన విషయం తెలిసిందే. -
'రెండు రోజుల్లో అభ్యర్ధి ప్రకటన'
-
అందుకే పోటీ చేయలేకపోయా: వివేక్
హైదరాబాద్ : తనకు పెద్దపల్లి నియోజకవర్గంతో ఉన్న అనుబంధం కారణంగానే వరంగల్ ఉప ఎన్నిక బరిలో దిగలేకపోయానని కాంగ్రెస్ మాజీ ఎంపీ వివేక్ అన్నారు. వరంగల్ నుంచి తనను పోటీ చేయాలన్న కాంగ్రెస్ శ్రేణులకు, ప్రజలకు ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. పార్టీ టికెట్ లభించిన రాజయ్యకు తన మద్దతు పూర్తిగా ఉంటుందని వివేక్ తెలిపారు. కాగా వివేక్ ను బరిలోకి దించేందుకు అధిష్టానం ప్రయత్నించినా, ఆయన మాత్రం మొదటి నుంచి పోటీ చేసేందుకు సుముఖంగా లేరు. దీంతో రాజయ్యకు లైన్ క్లియర్ అయింది. -
రెండు రోజుల్లో అభ్యర్ధి ప్రకటన: పొంగులేటి
హైదరాబాద్ : వరంగల్ ఉప ఎన్నిక పోరుకి సిద్ధమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ....అభ్యర్ధి ఎంపిక కోసం కసరత్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. అభ్యర్ధి ఎంపికపై నేతలందరితో సమాలోచనలు జరిపి, అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ....పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో ఒకటి, రెండు రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు. ప్రచారానికి వైఎస్ జగన్తో పాటు ఆయన సోదరి షర్మిల వస్తారని తెలిపారు. కేసీఆర్ అప్రజాస్వామిక విధానాలే ఆయుధంగా ....ఎన్నికల బరిలో దిగుతామన్నారు. -
విధేయత వల్లే నాకు టికెట్ : రాజయ్య
హైదరాబాద్ : పార్టీ పట్ల చూపిన విధేయత వల్లే తనకు హైకమాండ్ తనకు టికెట్ ఇచ్చిందని మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య అన్నారు. వరంగల్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థిగా స్థానిక నాయకుల అభిప్రాయాలు, స్థానికత ఆధారంగా వరంగల్ లోక్సభ ఉపఎన్నికకు మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య పేరును చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ టీఆర్ఎస్పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే కాంగ్రెస్కు లాభిస్తుందన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని, ఈ అంశం ఎన్నికల్లో కలిసి వస్తుందన్నారు. గతంలో వరంగల్లో చేసిన అభివృద్ధే తన ప్రచారాస్త్రమన్నారు. సిరిసిల్ల రాజయ్య 2009 ఎన్నికల్లో వరంగల్ నుంచి ఎంపీగా గెలిచారు. 2014లో జరిగిన ఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి చేతిలో దాదాపు 4 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. గ్రూప్ వన్ ఆఫీసర్ అయిన సిరిసిల్ల రాజయ్య 2009 ఎన్నికలకు ముందు స్వచ్ఛంద పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చారు. వరంగల్ జడ్పీ సీఈవోగా రాజయ్య చాలా ఏళ్లు పనిచేశారు. అభ్యర్థి ఎంపికపై టీపీసీసీ వరంగల్ జిల్లా నాయకుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఇందులో మొదటి స్థానంలో వివేక్ నిలిచారు. అయితే పోటీ చేసేందుకు వివేక్ నిరాకరించడంతో రెండో స్థానంలో నిలిచిన సిరిసిల్ల రాజయ్యను అభ్యర్థిగా కాంగ్రెస్ ఎంపిక చేసింది. మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ పేరు కూడా వినిపించినా స్థానికుడు కాకపోవడంతో ఇబ్బందిగా మారుతుందనే భావనతో పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. -
దయాకర్ ఎన్నికల ఖర్చు పార్టీదే: కేసీఆర్
హైదరాబాద్ : వరంగల్ లోక్సభ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధి పసునూరి దయాకర్కు ఆ పార్టీ అధినేత కేసీఆర్ శనివారం బీ ఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ దయాకర్ డబ్బులేని వ్యక్తి అని, పార్టీయే అతని ఎన్నికల ఖర్చును భరిస్తుందని తెలిపారు. తాను అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ అమలు చేశామన్నారు. ఇకపై తెలంగాణలో కరెంట్ కోతలుండవని, వచ్చే ఏడాది నుంచి కాలేజ్ హాస్టళ్లలో కూడా సన్నబియ్యంతో భోజనం ఉంటుదన్నారు. వచ్చే ఏడాది నుంచి బీపీఎల్ ఫ్యామిలీలందరికీ కళ్యాణలక్ష్మి పథకం అమలు చేస్తామని కేసీఆర్ వెల్లడించారు. 60 వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. -
డీఎస్ బాటలో రాపోలు?
- కాంగ్రెస్ను వీడి కారెక్కే యోచన - మాట్లాడుకుందామంటూ ఉత్తమ్ ఫోన్ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్లో పెద్దన్నగా ఉంటూ, ‘అవమానం భరించలేకపోతున్నా’నంటూ పార్టీని వీడిన ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) బాటలోనే రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ కూడా నడిచే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇందుకు డీఎస్ ఆశీస్సులున్నాయని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్కున్న అతి కొద్దిమంది ఎంపీల్లో ఒకడినైన తనకు ఏడాదిన్నరగా తగిన విలువ ఇవ్వడం లేదని, పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామిని చేయడం లేదని రాపోలు ఆవేదన చెందుతున్నారు. పార్టీ తెలంగాణ ఇన్చార్జి దిగ్విజయ్సింగ్, పీసీసీ చీఫ్ ఉత్తమ్లవి రాచరిక పోకడలంటూ ఆక్షేపిస్తున్నారు. కనీసం కార్యకర్తల్లో కూడా విశ్వాసం నెలకొల్పలేని ఇలాంటి నాయకత్వంతో 2019 ఎన్నికల్లోనూ కాంగ్రెస్కు భవిష్యత్తు లేదని, ఈ పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం వల్ల ఒరిగేదేమీ ఉండదని ఆయన భావిస్తున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. ‘డీఎస్ పార్టీని వీడితే వీళ్లంతా పండగ చేసుకున్నారు. బీసీలను అణగదొక్కడమే పనిగా పెట్టుకున్నారు’ అంటూ వాపోయారని వారంటున్నారు. కాంగ్రెస్ను వీడాలన్న రాపోలు యోచన వెనక స్వీయ రాజకీయ అవసరాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన సొంతూరు వరంగల్ జిల్లా కొడకండ్ల పాలకుర్తి అసెంబ్లీ స్థానం పరిధిలోకి వస్తుంది. అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించాలని యోచన చేస్తున్నారు. తనకు కాంగ్రెస్ నుంచి రాజ్యసభ సభ్యత్వం తిరిగి దక్కదని,అలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నెగ్గే పరిస్థితీ లేదన్నది ఆయన భావన. పైగా పాలకుర్తిలో రెడ్డి సామాజిక వర్గ నేతను పీసీసీ నాయకత్వం ప్రోత్సహిస్తున్నందున అధికార టీఆర్ఎస్లోకి వెళ్తే భవిష్యత్తు ఉంటుందని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఎంపీగా రాపోలు పదవీకాలం 2018 దాకా ఉన్నా పాలకుర్తి స్థానంపై పట్టు కోసం ఇప్పటి నుంచి రంగంలోకి దిగాలని భావిస్తున్నారంటున్నారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న డీఎస్ ఆశీస్సులతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఉత్తమ్తో సంవాదం పీసీసీ నాయకత్వంపై రాపోలు వ్యాఖ్యల అనంతరం శుక్రవారం సాయంత్రం ఉత్తమ్ ఆయనకు ఫోన్ చేసినట్టు సమాచారం. ‘ప్రతి సమాచారాన్నీ డీసీసీ అధ్యక్షుడు మీకు ఫోన్లో తెలిపారు. ఇంకెలా తెలియపరచాలి?’ అని అడగ్గా రాపోలు తన ఆవేదనంతా వెళ్లగక్కినట్టు తెలిసింది. ‘ఎంపీనైన నాకు కనీసం ఫోనైనా చేసి చెప్పరా? ఎందుకిలా పక్కన పెట్టారు? బలహీన వర్గాలంటే చిన్నచూపెందుకు?’ అంటూ నిలదీశారంటున్నారు. గాంధీభవన్కు వస్తే మాట్లాడుకుందామని పిలిచినా, ‘ఆ సంగతి తరవాత చూద్దాం. ఎప్పట్లాగే నన్ను పక్కన పెట్టేయండి’ అంటూ రాపోలు స్పందించినట్టు తెలుస్తోంది. బీసీల అణచివేతకు కుట్ర తెలంగాణ కాంగ్రెస్లో బడుగు, బలహీన, అట్టడుగు వర్గాల నేతలను చిత్తు చేసేందుకు ఒక ఎత్తుగడ ప్రకారం కుట్రలు జరుగుతున్నాయని రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ ధ్వజమెత్తారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డిపై ఆయన నిప్పులు చెరిగారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్సింగ్ వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ‘కాంగ్రెస్ తరఫున తెలంగాణ సాధనలో భాగంగా పార్లమెంటులో అగ్ర నాయకత్వంతో పాటు నా భూమిక, పాత్ర భరించలేని వారందరూ కలగలిపి జరుపుతున్న కుట్రగా నేను భావిస్తున్నా. దాన్ని వివిధ దశల్లో విభిన్న రీతుల్లో చెబుతూ వచ్చాను. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్కు రాహుల్గాంధీ వచ్చారు. ముందు రోజే అక్కడికి చేరుకుని బాధిత కుటుంబాలన్నింటితో మాట్లాడాను. నావంతు ఆర్థిక సాయం కూడా చేశా. తెల్లవారితే మా నాయకుడు రాబోతున్నాడని చెప్పివచ్చా. తెల్లవారి చూస్తే ఆహ్వానించే బృందంలో కూడా నా పేరు లేకుండా చేశారు. ఇలాగే రకరకాల కార్యక్రమాల్లో పలు సందర్భాల్లో ఉద్దేశపూర్వకంగా వ్యథకు గురిచేస్తూ, అవమానిస్తూ వచ్చారు. వరంగల్ జిల్లాలో నర్సంపేటలో రైతు భరోసా యాత్ర చేశారు. అసలు ఆ పేరే కరెక్టు కాదు. ఆ యాత్రకు రూపకల్పన చేసినప్పుడు నన్ను అసలు సంప్రదించనే లేదు. మనకు మనమే విశ్వాసం కల్పించుకునే పరిస్థితి లేదు. ఇంకొకరికి ఏం కల్పిస్తాం? రైతుల కోసం మనం నిరసన వ్యక్తం చేయగలుగుతాం. పోరాటం చేయగలుగుతాం. భరోసా ఇవ్వడానికి మనకు అధికారముందా? వరంగల్లు జిల్లాలో ఫలానా కార్యక్రమం చేస్తున్నామని చెప్పొద్దా? నేను అట్టడుగు వర్గానికి చెందినవాడినే కావొచ్చు. నేనేం నేరుగా పార్లమెంటులోకి ఊడిపడలేదు. గడియ గడియకు ప్రజల్లో మమేకమవుతున్నవాడిని. కానీ కనీసం నాకు సమాచారం లేదు. జిల్లా కమిటీ నుంచి సమాచారం వస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో నేను సంస్థాగత కార్యక్రమాలను దశాబ్దకాలంగా నిర్వహించిన వాడిని. శిక్షణ ఇచ్చినవాడిని. కనీసం కార్యక్రమం రూపొందించినప్పుడు సంప్రదించలేరా?’ అంటూ ఉత్తమ్పై నిప్పులు చెరిగారు. దిగ్విజయ్ వ్యవహార శైలిపై ‘నిన్నగాక మొన్న ఏఐసీసీ ఇంఛార్జి వెళ్లారు. ఇంకెవరో వెళతారు. కనీసం ఫోన్ చేసి చెప్పేందుకు ఒక అటెండర్ లేరా? ఓ యాభై మంది ఎంపీలు లేరు కదా? మీరు చాలా పెద్దోళ్లు కావొచ్చు. జాతీయ, అంతర్జాతీయ నాయకత్వం కావొచ్చు మీది. కనీసం మీ ఆఫీస్ నుంచి ఒక అటెండర్ ద్వారానైనా సమాచారం ఇవ్వొచ్చు కదా? పీసీసీ అధ్యక్షుడు అంతకంటే బిజీగా ఉన్నాడా? ఒక్కసారి సంప్రదించలేడా? వీటన్నింటినీ భరించాను. నేను ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీని. ఆ రాష్ట్రం నుంచి ఉన్న ప్రతినిధిని. మరి ఇంఛార్జి వస్తున్నారని ఆదేశించలేరా?’ అని పేర్కొన్నారు. ఎందుకు ఇలా జరుగుతోందని అనుకుంటున్నారని ప్రశ్నించగా ‘అట్టడుగు వర్గాల ఆత్మగౌరవం దెబ్బతీసేందుకు పన్నుతున్న ఒక వ్యూహం, ఒక కుట్రగా అనుకుంటున్నాం..’ అన్నారు. ఎవరు చేస్తున్నారని ప్రశ్నించగా ‘ఎత్తుగడలు కొనసాగుతున్నాయి. నేనెప్పుడూ ఫిర్యాదు చేయలేదు. నేను వీళ్ల దగ్గర క్యూ కట్టలేదు. అందరూ కలసి కుట్ర చేస్తున్నట్టుగానే భావిస్తున్నా..’ అని పేర్కొన్నారు. పార్టీని వీడే యోచన ఉందా అని ప్రశ్నించగా ‘నేను నిజాయతీగల కార్యకర్తను. పార్టీని ఎన్నడూ ఎదిరించలేదు. నేతల వ్యవహారం శ్రుతి మించడంతోనే ఇలా మాట్లాడాల్సి వచ్చింది..’ అని పేర్కొన్నారు. -
వరంగల్ టీఆర్ఎస్ అభ్యర్థిగా దయాకర్
-
వరంగల్ టీఆర్ఎస్ అభ్యర్థిగా దయాకర్
హైదరాబాద్ : వరంగల్ లోక్సభ ఉప ఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్థి పేరు ఖరారైంది. టీఆర్ఎస్ అభ్యర్థిగా పసునూరి దయాకర్ పేరును పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రకటించారు. నిన్నటివరకూ రేసులో ముందు ఉన్న రవికుమార్ను ...కుల వివాదం కారణంగా పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో చివరి నిమిషంలో దయాకర్ పేరును కేసీఆర్ ఖరారు చేశారు. టీఆర్ఎస్ ఆవిర్భావం 2001 నుంచి క్రియాశీలకంగా పార్టీలోనూ, రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమంలో పాల్గొన్న దయాకర్ ... గతంలో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించి భంగపడ్డారు. పసునూరి దయాకర్ గతంలో టీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. వర్ధన్నపేట నియోజకవర్గ ఇంచార్జీగా బాధ్యతలు నిర్వర్తించారు. అరూరి రమేశ్ టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత పార్టీ అధిష్టానం దయూకర్ను నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించింది. ఆ తర్వాత ఆయన పెద్దగా బయటికి రానప్పటికీ పార్టీ పట్ల విధేయతతో ఉంటున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మొదట తయారు చేయించిన నేతగా పసునూరి దయాకర్కు టీఆర్ఎస్ అధిష్టానం వద్ద గుర్తింపు ఉంది. -
మౌనం ఎందుకు..?
దేశంలో పెచ్చుమీరుతున్న హిందూ మతోన్మాద శక్తుల అరాచకాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నోరు మెదపడం లేదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి విమర్శించారు. దేశంలో రచయితలు, మైనారిటీలు, దళితులపై దాడులు జరుగుతున్నా, ప్రధాని కనీసం వాటిని ఖండించడం లేదని అన్నారు. గురువారం ఆయన ముగ్ధూంభవన్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. దాద్రీ హింసాకాండపై ప్రధాని ఇప్పటి వరకు నోరు విప్పకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. రచయితలు సాహిత్య పురస్కారాలను ప్రభుత్వానికి తిప్పి పంపి నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రధాని ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ఈ తరహా నిర్లక్ష్యం భారత సెక్యులర్ భావాలకు నష్టం కలిగిస్తుందన్నారు. ఐక్యరాజ్యసమితిలో భారత్తో పాటు జపాన్, జర్మనీలకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని ప్రధాని కోరడాన్ని సురవరం తప్పుపట్టారు. దీనివల్ల అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ట దెబ్బతింటుందన్నారు. సరిహద్దు దేశాలతో కూడా భారత్ సఖ్యత పాటించడం లేదని విమర్శించారు. ఆయన స్థాయికి తగదు.. బీహార్ ఎన్నికల్లో మోదీ చేస్తున్న ప్రసంగాలు ఆయన స్థాయిని దిగజారుస్తున్నాయని, ప్రతిపక్ష నాయకులను 'త్రీ ఇడియట్స్'గా అభివర్ణించడాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొనానరు. బీహార్లో వామపక్షాలు అన్ని స్థానాల్లో ఉమ్మడిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికల్లో వామపక్షపార్టీల ఉమ్మడి అభ్యర్థిని బరిలో దింపడం శుభసూచనమని అన్నారు. కేసీఆర్ పై భ్రమలు లేవు రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజలకు ఎలాంటి భ్రమలు లేవన్నారు. అవసరానికి ఇతర పార్టీలను వాడుకొని తరువాత వదిలేయడం కేసీఆర్కు అలవాటేనని, మహా చండీయాగం పేరుతో కేసీఆర్ ప్రజాధనాన్ని ఖర్చు చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. కార్మికశాఖ మంత్రిగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు, కేటాయింపులపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధానిని కలవనున్నట్లు చెప్పారు. వార్షికోత్సవానికి అంతర్జాతీయ ప్రతినిధులు సీపీఐ 90వ వార్షికోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నవంబర్ 28,29 తేదీల్లో ఆసియా ఖండం స్థాయిలో ఢిల్లీలో సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో చైనా, వియత్నాం, నేపాల్, పాకిస్తాన్ దేశాల ప్రతినిధులతో పాటు ఆరు వామపక్ష పార్టీల నేతలు కూడా పాల్గొంటారని చెప్పారు. ఈ సమావేశంలో సీపీఐ పాల్గొన్నారు. -
కారు రేసులో గుడిమళ్ల రవికుమార్
హైదరాబాద్ : వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై టీఆర్ఎస్ కసరత్తు క్లైమాక్స్కు చేరుకుంది. అభ్యర్థి ఎంపికపై చర్చించేందుకు టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం తెలంగాణ భవన్లో పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. పార్టీ నేతలు అభ్యర్థి ఎంపిక బాధ్యతను కేసీఆర్కే అప్పగించారు. కాగా రేసులో జేఏసీ నేత గుడిమళ్ల రవికుమార్ ముందున్నారు. ఆయన పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అలాగే ఆశావాహులందరితో కేసీఆర్ స్వయంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలు వచ్చి...బాగా చదువుకున్న వ్యక్తిని అభ్యర్థిగా నిలబెట్టాలనుకుంటున్నామని కేసీఆర్ తెలిపారు. అయితే అభ్యర్థి పేరును కేసీఆర్ శుక్రవారం అధికారంగా ప్రకటించనున్నారు. ఇక వరంగల్ ఉప ఎన్నిక కోసమే నామినేటెడ్ పోస్టులు వాయిదా వేసినట్లు కేసీఆర్ తెలిపారు. నామినేటెడ్ పోస్టుల్లో అందరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సమావేశం అనంతరం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ ఎవరెన్ని కుట్రలు చేసినా వరంగల్ ఉప ఎన్నికలో తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. -
'నేను పోటీ చేయను, సర్వేకి ఇవ్వండి'
హైదరాబాద్ : వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ గురువారం గాంధీభవన్లో భేటీ అయ్యారు. వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నిక సందర్భంగా అభ్యర్థి ఎంపికపై నేతల అభిప్రాయాలను దిగ్విజయ్ సేకరిస్తున్నారు. మాజీ ఎంపీ వివేక్ ...ఈసారి పోటీ చేసేందుకు సముఖంగా లేనట్లు లేదు. ఆయనను పోటీకి ఒప్పించడానికే కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నించినా వివేక్ వైఖరిలో మార్పు లేదు. తాను పోటీ చేయనని, సర్వే సత్యనారాయణకు టికెట్ ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. మరోవైపు ఓరుగల్లు నుంచి పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సర్వే సత్యనారాయణ ...దిగ్విజయ్కు తన అభిప్రాయం తెలిపారు. కాగా పీసీసీ నుంచి జాబితా అందుకున్నా అభ్యర్థిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పార్టీ నేతలతో చర్చించి వారి అభిప్రాయాలను అధిష్టానానికి నివేదించనున్నారు. ఈ సందర్భంగా దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ రెండు, మూడు రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపారు. -
రేసులో వివేక్, సర్వే, రాజయ్య..
న్యూఢిల్లీ : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. వరంగల్ అభ్యర్థి ఎంపికపై బుధవారం హైకమాండ్తో ఆయన చర్చించనున్నారు. వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నిక అభ్యర్థి రేసులో వివేక్, సర్వే సత్యనారాయణ, సిరిసిల్ల రాజయ్య ఉన్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అనంతరం వరంగల్ అభ్యర్థిపై ప్రకటన చేస్తారు. -
చంద్రబాబుతో రేవంత్ రెడ్డి భేటీ
విజయవాడ : టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సోమవారం సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటల పాటు ఈ భేటీ కొనసాగింది. వరంగల్ ఎంపీ అభ్యర్థి అంశంపై వీరిరువురు మంతనాలు జరిపారు. ఇక ఎర్రబెల్లి దయాకరరావుతో విభేదాలపై రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా చంద్రబాబుకు వివరణ ఇచ్చినట్లు సమాచారం. (గతంలో ఎర్రబెల్లి దయాకరరావుఉద్యోగం నుంచి తొలగించిన వ్యక్తిని రేవంత్రెడ్డి.. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఉద్యోగంలో పెట్టుకోవడంపై మొదలైన గొడవ చినికిచినికి గాలివానగా మారింది. ఇరువురు నేతలు నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే స్థాయిలో దూషించుకోవడంతో ఆ పంచాయితీ కాస్తా బాబు దగ్గరకు చేరింది) కాగా వరంగల్ ఉప ఎన్నికపై తెలంగాణ టీడీపీ నేతలు మంగళవారం చంద్రబాబు నాయుడును కలవనున్నారు.