'ది కేరళ స్టోరీ-2'పై సీఎం పినరయి విజయన్ ఆగ్రహం
ది కేరళ స్టోరీ మూవీ విడుదల సమయంలో ఎలాంటి అభ్యంతరాలు వచ్చాయి. ఇప్పడు 'ది కేరళ స్టోరీ-2' చిత్రంపై కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళ రాష్ట్రంలో మతపరమైన విభజనతో పాటు ద్వేషాన్ని ప్రచారం చేసే ఉద్దేశంతోనే ఈ చిత్రం నిర్మించినట్లు అర్థమవుతుందన్నారు. ‘లవ్ జిహాదీ’ అంశాన్ని దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు, హోం మంత్రిత్వశాఖ కూడా తిరస్కరించినప్పటికీ.. ఇదే అంశాన్ని మళ్లీ తెరపైకి తీసుకువచ్చి మతపరమైన విభజన సృష్టించేందుకు కొన్ని శక్తులు కుట్ర చేస్తున్నాయని విజయన్ మండిపడ్డారు. కేరళ రాష్ట్రాన్ని ప్రపంచం ముందు అవమానించేందుకే మరోసారి ఈ మూవీని తెరపైకి తీసుకొచ్చారన్నారు. అక్షరాస్యతలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తమ రాష్ట్రాన్ని ఇలా అప్రతిష్టపాలు చేసేందుకు సినిమాల పేరుతో కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నాయని వాటిని ఐక్యంగా ప్రజలు తిరస్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. 'ది కేరళ స్టోరీ-2' సినిమా ‘విద్వేషపూరిత ప్రోపగాండా’ అంటూనే రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని ఆయన అన్నారు. శాంతియుత వాతావరణంతో అందరూ కలిసిమెలసి ఉన్న కేరళను ఉగ్రవాదానికి కేంద్రంగా చూపించేందుకు ఈ మూవీని వాడుకుంటున్నారని ఆయన అన్నారు. ఫిబ్రవరి 27న విడుదల కానున్న ఈ చిత్రంపై అధికార ఎల్.డి.ఎఫ్తో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది.