బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ది కేరళ స్టోరీ-2 చిత్రంపై మండిపడ్డారు. రెండేళ్ల క్రితం విడుదలైన ది కేరళ స్టోరీ మూవీకి సీక్వెల్గా ఈ చిత్రాన్ని దర్శకుడు కామాఖ్య నారాయణ్ తెరకెక్కించారు. సన్షైన్ పిక్చర్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత విపుల్ అమృత్లాల్ షా ‘ది కేరళ స్టోరీ 2 గోస్ బియాండ్’ను నిర్మించారు. తాజాగా విడుదలైన ట్రైలర్ వివాదస్పదంగా మారింది. ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీపై దర్వకుడు అనురాగ్ కశ్యప్ రియాక్ట్ అయ్యారు.
ఫిల్మ్ఫేర్ అవార్డుల సందర్భంగా కొచ్చిలో కనిపించిన అనురాగ్ కశ్యప్ను కేరళ స్టోరీ-2పై మాట్లాడమని మీడియా ప్రతినిధులు కోరడంతో ఆయన తనదైన శైలిలో స్పందించారు. ఈ మూవీ కేవలం డబ్బు సంపాదించుకోవడానికి చేస్తున్నారని ఆరోపించారు. కొన్ని శక్తులు ప్రజల మధ్య చిచ్చు పెట్టి విభజించేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆయన అన్నారు. ఇలాంటి సున్నితమైన అంశాలను కూడా కల్పితంగా తెరకెక్కించి కొందరు లాభపడాలని చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ట్రైలర్లోని కొన్ని సన్నివేశాలు మరీ దారుణంగా ఉన్నాయని చెప్పారు. అందులో చూపినట్లు ఎవరైనా బీఫ్ తినిపిస్తారా.. కనీసం కిచిడీని కూడా అలా తినిపించరు కదా అంటూ భగ్గున్నారు. ఈ సినిమా మేకర్స్ అత్యాశపరులుగా కనిపిస్తున్నారు. వాళ్లు కేవలం డబ్బు కోసం మాత్రమే ఇలాంటి కథలు తీస్తున్నారని ఫైర్ అయ్యారు. 'ది కేరళ స్టోరీ-2' సినిమా ‘విద్వేషపూరిత ప్రోపగాండా’ అంటూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.


