Hyderabad Book Fair
-
హైదరాబాద్ : ముగిసిన బుక్ఫెయిర్.. ఆదివారం సందర్శకుల కిటకిట (ఫొటోలు)
-
పుస్తకానికి పట్టం
సాక్షి, హైదరాబాద్: పుస్తకప్రియుడు గెలిచాడు... పుస్తకానికి మరోసారి పట్టం కట్టాడు... ఫేస్బుక్, వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాలు, ఈ–బుక్ల హవా కొనసాగుతున్న కాలంలోనూ సగటు పాఠకుడు పుస్తకానికే జైకొట్టాడు. భాగ్యనగరం వేదికగా జరుగుతున్న 37వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనే అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. లక్షలాది మంది పాఠక మహాశయులు పుస్తక ప్రదర్శనను సందర్శించి నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు. ఈ నెల 19న ప్రారంభమైన పుస్తక ప్రదర్శన శనివారం 9వ రోజుకు చేరుకుంది. ఇప్పటివరకు సుమారు 10 లక్షల మందికిపైగా ప్రజలు పుస్తక ప్రదర్శనను సందర్శించినట్లు నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. 350 స్టాళ్లలో కనీసం రూ. 15 కోట్ల విలువైన పుస్తకాలు అమ్ముడైనట్లు హైదరాబాద్ బుక్ ఫెయిర్ కమిటీ ప్రతినిధులు తెలిపారు. పుస్తక ప్రదర్శనలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, సభలు, సమావేశాలు సైతం సందర్శకులను విశేషంగా ఆకటుకున్నాయి. బుక్ ఫెయిర్ వేదికగా పదుల సంఖ్యలో కొత్త పుస్తకాల ఆవిష్కరణ సాగింది. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సైతం శనివారం బుక్ ఫెయిర్ను సందర్శించి పలు స్టాళ్లను ఆసక్తిగా తిలకించారు. జైకొట్టిన యువత.. ఈసారి యువతరం పుస్తక ప్రదర్శనకు భారీగా తరలివచ్చింది. పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలతోపాటు నవలలు, కథల పుస్తకాలు, చరిత్ర గ్రంథాలను యువతీయువకులు విరివిగా కొనుగోలు చేశారు. హైదరాబాద్తోపాటు పలు జిల్లాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్ల నుంచి తరలివచ్చిన వేలాది మంది చిన్నారులతో పుస్తక ప్రదర్శన ప్రతిరోజూ కళకళలాడింది. దశాబ్దాలు, శతాబ్దాలు గడిచినా చెక్కుచెదరని పాఠకాదరణ కలిగిన గురజాడ కన్యాశుల్కం, గోపీచంద్ అసమర్థుని జీవయాత్ర, బుచ్చిబాబు చివరకుమిగిలేది, శ్రీదేవి కాలాతీత వ్యక్తులు, మహాకవి శ్రీశ్రీ మహాప్రస్థానం వంటి పుస్తకాలు పెద్ద ఎత్తున అమ్ముడయ్యాయి. రాజ్యాంగంపై ఆంగ్లం, తెలుగు భాషల్లో వెలువడిన పుస్తకాలను చాలా మంది కొనుగోలు చేశారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, కుతుబ్షాహీలు, అసఫ్జాహీల పాలన తదితర పుస్తకాలపట్ల కూడా పాఠకులు ఆసక్తి చూపారు. సామాజిక మాధ్యమ శైలిని అనుకరిస్తూ వెలువడుతున్న నవతరం రచయితల పుస్తకాలకు సైతం ఆదరణ లభించింది. ప్రముఖుల జీవిత చరిత్ర గ్రంథాలు, ఆధ్యాత్మిక పుస్తకాలు, రామాయణం, మహాభారతం వంటి గ్రంథాలను కూడా పాఠకులు అక్కునజేర్చుకున్నారు. నేటితో ముగింపు హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన నేటితో ముగియనుంది. సాయంత్రం 5:30 గంటలకు జరిగే ముగింపు వేడుకల్లో మంత్రి జూపల్లి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం తదితరులు హాజరుకానున్నారు. 1. పండుగలా ప్రదర్శన పుస్తక ప్రదర్శన పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. యువత పెద్ద ఎత్తున వస్తున్నారు. పుస్తకాలు కొంటున్నారు. ప్రచురణ సంస్థలు సైతం అమ్మకాలపట్ల సంతోషంగా ఉన్నాయి. జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పుస్తక ప్రియులు తరలి వస్తున్నారు. ప్రదర్శన విజయవంతంగా కొనసాగుతోంది. – వాసు, హైదరాబాద్ బుక్ఫెయిర్ కమిటీ కార్యదర్శి 2. పుస్తక పఠనం పెరిగింది ప్రదర్శనకు వచ్చిన సందర్శకులను చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తోంది. ఏటేటా లక్షలాది మంది పుస్తకప్రియులు వస్తూనే ఉన్నారు. ఇది ఆహా్వనించదగ్గ గొప్ప పరిణామం. పుస్తక పఠనం బాగా పెరిగిందనేందుకు పెరిగిన సందర్శకుల సంఖ్యే నిదర్శనం. తల్లిదండ్రులు పిల్లలతో కలిసి రావడం, కావల్సిన పుస్తకాలు కొనడం శుభపరిణామం. పుస్తకాలు చదవకపోవడం వల్ల పిల్లలు ఏం కోల్పోతున్నారో పెద్దలు గుర్తించినట్లుంది. – ఆనంద్, ప్రముఖ వ్యాఖ్యాత/ఆంజనేయరెడ్డి, రిటైర్డ్ అధికారి 3. భక్తి పుస్తకాలు కొన్నా పుస్తకప్రదర్శన చాలా బాగుంది. నాకు శ్రీకృష్ణుడు అంటే ఎంతో ఇష్టం, భక్తి. అందుకే భక్తి పుస్తకాలే ఎక్కువగా కొన్నా. నవలలు, కథల పుస్తకాలు కూడా బాగున్నాయి. – కృతిక, డిగ్రీ విద్యార్ధిని, హయత్నగర్ 4. యద్దనపూడి, యండమూరి నవలల కోసం వచ్చా గతంలో చదివినప్పటికీ మరోసారి యండమూరి వీరేంద్రనాథ్, యద్దనపూడి సులోచనారాణి నవలల కోసం వచ్చా. అన్ని స్టాళ్లలో సాహిత్యం పుస్తకాలు చాలా ఉన్నాయి. ప్రదర్శన బాగుంది. – రాధాకృష్ణ, హైటెక్సిటీ -
హైదరాబాద్ : పుస్తక ప్రదర్శనలో సందర్శకుల కిటకిట (ఫొటోలు)
-
హైదరాబాద్ : 37 వ జాతీయ బుక్ఫెయిర్ ప్రారంభం ..భారీ సంఖ్యలో సందర్శకులు (ఫొటోలు)
-
నేటి నుంచి పుస్తక ప్రదర్శన
కవాడిగూడ: హైదరాబాద్ బుక్ఫెయిర్ ఆధ్వర్యంలో 37వ జాతీయ పుస్తక ప్రదర్శన గురువారం సాయంత్రం ఎనీ్టఆర్ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఈ నెల 29 వరకు ఇది కొనసాగనుంది. బుధవారం హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు యాకూబ్, కార్యదర్శి ఆర్.శ్రీనివాస్ విలేకరులతో ఇక్కడ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 210 మందికి పైగా ప్రచురణకర్తలు, డిస్ట్రిబ్యూటర్లు పుస్తకాలను ప్రదర్శించనున్నారని తెలిపారు. ప్రతి ఇంటిలో పుస్తకం ఉండే లక్ష్యంతో బుక్ ఫెయిర్ను ముందుకు తీసుకువెళ్తామన్నారు. 36 ఏళ్ల క్రితం 30 స్టాళ్లతో ప్రారంభమై పుస్తక ప్రదర్శన ప్రస్తుతం 350 స్టాళ్లతో సాహితీ అభిమానులను, పుస్తక ప్రేమికులను ఆకట్టుకోనుందని తెలిపారు. బాల సాహిత్యానికి ప్రాధాన్యమిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. విద్యార్థులకు ప్రవేశం ఉచితం.. పుస్తక ప్రదర్శనలో పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు వారి ఐడీ కార్డులు చూపించి ఉచిత ప్రవేశం పొందవచ్చని తెలిపారు. ఉచిత ఆరోగ్య శిబిరం.. నోరూరించే వంటకం తెలంగాణ రుచులతో ప్రత్యేక ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బుక్ఫెయిర్ సందర్శకుల కోసం ఈ ఏడాది ఉచిత ఆరోగ్య శిబిరంతో పాటు రెండు వీల్ చైర్లను అందుబాటులో ఉంచుతామన్నారు. సాంస్కృతిక ప్రదర్శనలు.. ప్రతిరోజూ సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. సమావేశంలో తెలుగు భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, బుక్ఫెయిర్ ఉపాధ్యక్షులు శోభన్బాబు, బాల్రెడ్డి, ట్రెజరర్ నారాయణరెడ్డి, జాయింట్ సెక్రటరీ సూరిబాబు, కె.సురేష్ పాల్గొన్నారు. -
మంచినీళ్ల కుండ
‘చదువని వాడజ్ఞుండగు! చదివిన సదసద్వివేక చతురత గలుగున్ !’ అంటాడు పోతన తన ఆంధ్ర మహా భాగవతంలో. చదవకపోతే ఏమీ తెలీదు, చదువుకుంటేనే మంచీ చెడుల వివేకం కలుగుతుంది; అందుకే, ‘చదువంగ వలయు జనులకు! చదివించెద నార్యులొద్ద, చదువుము తండ్రీ!’ అని ప్రహ్లాదుడికి తండ్రి హిరణ్యకశ్యపుడితో చెప్పిస్తాడు. నిజంగానే ఆ గురువుల దగ్గరి చదువేదో పూర్తికాగానే, ‘చదివించిరి నను గురువులు! చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు! నే/ జదివినవి గలవు పెక్కులు! చదువులలో మర్మ మెల్ల జదివితి తండ్రీ!’ అని జవాబిస్తాడు ప్రహ్లాదుడు. కొడుకుకు కలిగిన వివేకం తండ్రి కోరుకున్నదేనా అన్నది పక్కనపెడితే, చదువనేది భిన్న ద్వారాలు తెరుస్తుందన్నది నిజం. ప్రహ్లాదుడు పుట్టు వివేకి కాబట్టి, తనకు కావాల్సిన సారాన్ని గ్రహించగలిగాడు. అందరికీ అలాంటి గుణం ఉంటుందా? అందుకే, ‘చదువులన్ని చదివి చాలవివేకియౌ/ కపటికెన్న నెట్లు కలుగు ముక్తి/ దాలిగుంటగుక్క తలచిన చందము’ అన్నాడు వేమన. ‘చదువులెల్ల చదివి సర్వజ్ఞుడై యుండి’నప్పుడు కూడా ఉండే బలహీనతలను ఎత్తిపొడిచాడు. ఆత్మసారం తెలుసుకోవడమే ముఖ్యమన్నాడు.అతడు ‘బాగా చదువుకున్నవాడు’ అంటే లోకాన్ని బాగా అర్థం చేసుకున్నవాడు, పరిణత స్వభావం ఉన్నవాడు, గౌరవనీయుడు, ఒక్క మాటలో వివేకి అని! వివేకం అనేది ఎన్నో గుణాలను మేళవించుకొన్న పెనుగుణమే కావొచ్చు. అయినా అదొక్కటే చాలా? ‘చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా/ చదువు నిరర్థకమ్ము’ అన్నాడు భాస్కర శతకకర్త మారవి వెంకయ్య. ‘బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం/పొదవెడు నుప్పులేక రుచి బుట్టగ నేర్చునటయ్య భాస్కరా!’ అని ప్రశ్నించాడు. కూరకు రుచి తెచ్చే ఉప్పులాగే జీవితంలో ‘యించుక’ రసజ్ఞత ఉండాలి. చాలామందిలో ఆ సున్నితం, ఆ సరస హదయం లోపించడం వల్లే సంబంధాలు బండబారుతున్నాయి. అందుకే వివేకం, రసజ్ఞతలను పెంచే చదువు ముఖ్యం. ఈ చదువు తరగతి చదువు కాదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తరగతి గదిలోనే ఇవి అలవడితే అంతకంటే కావాల్సింది ఏముంది! ప్రపంచంలోకి దారి చూపే చదువు, ప్రపంచాన్ని చేరువ చేసే చదువు సాహిత్య రూపంలో ఉంటుంది. ఆ సాహిత్యం మంచి పుస్తకం రూపంలో హస్తభూషణమై ఉంటుంది.మనుషుల వివేకాన్ని కొలవదలిచినవాళ్లు ‘ఇప్పుడు ఏం చదువుతున్నారు?’ అని అడుగుతారు. చదవడం మాత్రమే సరిపోదు, ఆ చదువుతున్నది ఏమిటి? ‘నీ దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయన్నది విషయం కాదు, నీ దగ్గరున్న పుస్తకాలు ఎంత మంచివి అన్నదే ముఖ్యం’ అంటాడు గ్రీకు తత్వవేత్త సెనెకా. మంచిని ఎలా కొలవాలి? ‘మనల్ని గాయపరిచే, పోటుపొడిచే పుస్తకాలే మనం చదవాలి. తల మీద ఒక్క చరుపు చరిచి మేలుకొలపకపోతే అసలంటూ ఎందుకు చదవడం’ అంటాడు రచయిత ఫ్రాంజ్ కాఫ్కా. చదవడమే పెద్ద విషయం అయిన కాలంలో, దానికి ఇన్ని షరతులా అన్న ప్రశ్న రావడం సహజమే. ఎందుకంటే, ‘నేషనల్ లిటరసీ ట్రస్ట్’ నివేదిక ప్రకారం, భారతీయ చిన్నారుల్లో చదవడం దాదాపు సంక్షోభం స్థాయికి పడిపోయింది. 5–18 ఏళ్లవారిలో కేవలం మూడింట ఒక్కరు మాత్రమే తమ ఖాళీ సమయంలో చదవడాన్ని ఆనందిస్తామని చెప్పారు. కేవలం 20 శాతం మంది మాత్రమే, ప్రతిరోజూ ఏదో ఒకటి చదువుతున్నామని జవాబిచ్చారు. చదివే అలవాటును పెంచకపోతే, వికాసానికి దారులు మూస్తున్నట్టే!ఆధునిక తరానికి చదవడం మీద ఉత్సాహం కలిగించేలా, అయోమయ తరానికి రసజ్ఞత పెంచేలా ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’ డిసెంబర్ 19 నుంచి 29 వరకు పాటు కాళోజీ కళాక్షేత్రం (ఎన్టీఆర్ స్టేడియం)లో జరగనుంది. మధ్యాహ్నం పన్నెండు నుంచి రాత్రి తొమ్మిది వరకు ఇది కొనసాగుతుంది. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ, హిందీలో పేరున్న భిన్న ప్రచురణకర్తలు, విక్రేతలు, రచయితల స్టాళ్లు సుమారు 350 వరకు ఏర్పాటవుతాయి. నూతన పుస్తకాల ఆవిష్కరణలు, ఉపన్యాసాలు ఉంటాయి. 1985 నుంచి జరుగుతున్న ఈ బుక్ ఫెయిర్ను ఈసారి పదిహేను లక్షల మంది సందర్శిస్తారని అంచనా. ‘మనం అనేక పండుగలు చేసుకుంటాం. కానీ పుస్తకాల పండుగ ప్రత్యేకమైనది. పెద్ద జాతరలో మంచినీళ్ల కుండ లాంటిది బుక్ ఫెయిర్. ఏ రకమైనా కావొచ్చుగాక, అసలు పుస్తకాల వైపు రాగలిగితే మనిషికి వివేకం, వివేచన పెరుగుతాయి. జీవిత సారాన్ని అందించేదే కదా పుస్తకమంటే! ‘ఏడు తరాలు’ లాంటి నవలకు మనం ఎట్లా కనెక్ట్ అయ్యాం! పుస్తకాలు, అక్షరాలు లేకపోతే మనం ఎక్కడుండేవాళ్లం? అందుకే ఈసారి నచ్చిన, మెచ్చిన, ప్రభావితం చేసిన పుస్తకం అంటూ పుస్తకం కేంద్రకంగా కొన్ని సెషన్లు నిర్వహిస్తున్నాం’ అని చెబుతున్నారు బుక్ ఫెయిర్ అధ్యక్షుడు ‘కవి’ యాకూబ్. అయితే, పుస్తకాల దుకాణాల కన్నా, దగ్గర్లోని బజ్జీల బండికి గిరాకీ ఎక్కువ అనే వ్యంగ్యం మన దగ్గర ఉండనే ఉంది. అన్నింటిలాగే ఇదీ ఒక ఔటింగ్, ఒక వినోదం, బయటికి వెళ్లడానికి ఒక సాకు... లాంటి ప్రతికూల అభిప్రాయాలు ఉండనే ఉన్నాయి. ఏ వంకతో వెళ్లినా దేవుడి దగ్గరికి వెళ్లగానే భక్తిగా కళ్లు మూసుకున్నట్టు, పుస్తకం చూడగానే ఆర్తిగా చేతుల్లోకి తీసుకుంటున్నప్పుడు ఏ కారణంతో వెళ్తేనేం? కాకపోతే వ్యక్తిత్వానికి సరిపడే, వివేకం– రసజ్ఞతలను పెంచే పుస్తకాలను ఎంపిక చేసుకోవడమే పెద్ద పని. దానికోసం కొంత పొల్లు కూడా చదవాల్సి రావొచ్చు. కానీ క్రమంగా ఒక ఇంట్యూషన్ వృద్ధి అవుతుంది. అదే చదువరి పరిణతి. -
అది అంబేడ్కర్ స్ఫూర్తికి విరుద్ధం
సాక్షి, హైదరాబాద్: భారతదేశం అనాదిగా నాస్తిక, అస్తిక వాదాలకు నిలయంగా ఉందని, అయితే ప్రస్తుత పరిస్థితులు మాత్రం దీనికి భిన్నంగా ఉన్నాయని మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్రావు అన్నారు. నగరంలోని కళాభారతిలో 10 రోజులపాటు కొనసాగిన హైదరాబాద్ బుక్ ఫెయిర్ ముగింపు సభ ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విద్యాసాగర్రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పాల్గొన్నారు. విద్యాసాగర్రావు మాట్లాడుతూ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగం ద్వారా సమతా స్ఫూర్తిని ప్రజలమధ్య నింపడానికి కృషిచేశారని, నాస్తికులు, ఆస్తికులు పోట్లాడుకుని జైళ్లకు వెళ్లడం అంబేడ్కర్ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. అప్పటి సామాజిక విధానాల్లో ఉన్న అస్పృశ్యతను తొలగించడానికి అంబేడ్కర్ బౌద్ద మతాన్ని స్వీకరించి, అందులోని విధానాల ద్వారానే సౌభాతృత్వాన్ని రాజ్యాంగంలో పొందుపరిచారని అన్నారు. వీటికి సంబంధించిన విజ్ఞానం లభించాలంటే ఇలాంటి పుస్తక ప్రదర్శనలు అవసరమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహన్ని తయారుచేయించడం అభినందనీయమని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో గ్రంథాలయాలు: ఇంటర్నెట్తో పిల్లల్లో వచ్చిన మార్పులు చూశాక అందోళన అనిపించినా ఇలాంటి పుస్తక ప్రదర్శన ద్వారా ఆ భయాలు తొలగిపోయాయని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ అన్నారు. నైతిక విలువలు పెంపొందించే విధంగా విద్యావిధానం ఉండాలని తెలిపారు. హైదరాబాద్లో 100 స్కూళ్లను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని సిలబస్ మార్చే విధంగా కృషి చేస్తున్నామని, అందులో నీతి కథలు, పర్యావరణం, వ్యక్తిత్వ నిర్మాణం పాఠ్యాంశాలుగా చేర్చబోతున్నామని పేర్కొన్నారు. భిన్న వాదనలు ఉన్నా పుస్తకం మనుషులను ఏకం చేస్తుందని బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయా చితం శ్రీధర్, రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి, పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్ సోమ భరత్ కుమార్, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, ఓయూ ప్రొఫెసర్ కొండ నాగేశ్వర్ పాల్గొన్నారు. -
Hyderabad Book Fair : ఎన్టీఆర్ స్టేడియంలో పుసక్త ప్రియుల సందడి (ఫొటోలు)
-
Hyderabad National Book Fair: బుక్ఫెయిర్కు 10 లక్షల మంది!
పంజగుట్ట: రాబోయే తరానికి దార్శనికతను అందించేందుకు బుక్ఫెయిర్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్, హైదరాబాద్ బుక్ఫెయిర్ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ అన్నారు. అక్షరాస్యత పెరుగుతున్న విధంగానే పుస్తకపఠనం కూడా పెరుగుతుందని, అది డిజిటల్, నెట్ ఏవిధంగా చదివినా అన్నింటికీ తల్లి మాత్రం పుస్తకమే అని ఆయన పేర్కొన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 35వ హైదరాబాద్ నేషనల్ బుక్ఫెయిర్ విశేషాలను ఆయన వెల్లడించారు. ఒగ్గు కథలకు ప్రాణం పోసిన మిద్దె రాములు ప్రాంగణంగా, కవి, రచయిత అలిశెట్టి ప్రభాకర్ వేదికగా ఈ యేడు నామకరణం చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 22వ తేదీ నుంచి 2023 జనవరి 1వ తేదీ వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8:30 వరకు, శని, ఆది, ఇతర సెలవు దినాల్లో మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 9 గంటల వరకు ఎన్టీఆర్ స్టేడియంలో ప్రదర్శన కొనసాగుతుందన్నారు. పాఠశాల విద్యార్థులకు, జర్నలిస్టులకు గుర్తింపు కార్డు చూపితే ఉచిత ప్రవేశం ఉంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత బుక్ఫెయిర్కు ఎన్టీఆర్ స్టేడియంను ఉచితంగా ఇవ్వడమే కాకుండా, నిర్వహణకు కూడా సాంస్కృతిక శాఖ ద్వారా నిధులు కేటాయిస్తోందన్నారు. ఈ ఏడాది 340 స్టాల్స్ ఏర్పాటుచేస్తున్నామని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు నుంచి సుమారు 10 లక్షల మంది పాఠకులు, పబ్లిషర్స్ వస్తారని చెప్పారు. మొదటి రోజు మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్, సబితతోపాటు పత్రికల సంపాదకులు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హాజరవుతారని జూలూరి వెల్లడించారు. కాగా, సీఎం కేసీఆర్పై వివిధ రచయితలు రాసిన పుస్తకాలు, ఉద్యమ ప్రస్థానం, ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాలపై ప్రత్యేక బుక్ స్టాల్ ఏర్పాటు చేస్తున్నారు. -
Hyderabad Book Fair 2023: పుస్తకాల రుతువు
ఆ నల్లటి వరుస కట్టిన అక్షరాల వెంట అక్షువులతో వెంబడిస్తే గుత్తులుగా కాసిన మామిడి పండ్ల చెట్టు కింద అశ్వాన్ని వదిలి సేదతీరుతున్న రాకుమారుడు కనిపిస్తాడు. కొమ్మపై కూచున్న జంట పక్షులు ఏవో అతనికి తెలియాల్సిన రహస్యం మరికాసేపట్లో చెవిన ఊదుతాయి. నల్లటి వరుస కట్టిన ఆ పంక్తుల వెంట పరిగెడితే కొత్త పెళ్లికూతురిని శోభనం రాత్రి చంపడమే వ్రతంగా పెట్టుకున్న రాకుమారుడు ఆ పెళ్లికూతురు మొదలెట్టిన గొలుసు కథల్లో గుడ్లు తేలేసి వ్రతం మరిచి ‘ఆ తర్వాత?’ అనే ప్రశ్నతో జీవితాంతం బతుకు వెళ్లమార్చడం చూస్తాము. కాగితం మీద వరుస కట్టిన పంక్తులు రాముడు కానలకు వెళ్లాక కౌసల్య పడిన శోకమెట్టిదన్న ఆలోచనను ఇస్తాయి. బోధిచెట్టు కింద దేహాన్ని క్షోభ పెట్టుకుంటున్న సిద్ధార్థుని సాక్షాత్కారం కోసం వేచి చూడమంటాయి. కరకు పళ్లు దిగబడి కాలి విముక్తి కోసం ఘీంకారం చేస్తున్న గజేంద్రుని మోక్షానికి శంఖు చక్రాలు వదిలి శ్రీ మహావిష్ణువును పరిగెత్తమంటాయి. రామలింగడు ఈ పంక్తులు పలకడానికే అంబ ఇచ్చిన ఒక చేతి పాలు, మరో చేతి పెరుగును కలిపి గొంతులోకి ఒంపుకున్న వైనం చెబుతాయి. పుటలు కొన్ని శ్రీనాథుని పల్లకీ మోస్తాయి. పుటలు కొన్ని పేదవాడి తెల్లని నవ్వును మల్లెలుగా విరబూస్తాయి. పుటల నిండా వీరుని ధీరకంపనం... వనిత దీక్షా కంకణం... పసిపిల్లల కేరింతలు... యువతీ యువకుల సల్లాపాలు... కన్నీటి ఉప్పదనం... త్యాగపు శౌర్యము... భీరువు ఆక్రందన... ఆలోచనల అలజడి... తేజోమూర్తి జీవన సందేశము. ఒక దేశ ‘తలసరి ఆదాయం’ ఎలా గణిస్తారోగాని ఒక దేశ ‘తలసరి సంస్కారం’ సగటున ఆ దేశపౌరుడు చదివిన పుస్తకాల సంఖ్యను బట్టి అవి ఎలాంటి పుస్తకాలన్న నాణ్యతను బట్టి గణించాలి. ఆహార కొరత వస్తేనో, విదేశీ మారకద్రవ్యం అడుగంటితేనో, ద్రవ్యోల్బణం విజృంభిస్తేనో మాత్రమే ఆ దేశం ప్రమాదంలో పడినట్టు కాదు. ఏ దేశ ప్రజలైతే నిజంగా పుస్తకాలు చదవడం మానేస్తారో, ఇంట పుస్తకాల అల్మారా లేకుండా జీవిస్తారో, ‘పుస్తకమా అది ఏమి’ అని ఫోన్ స్క్రీన్లో తల కూరుస్తారో ఆ దేశం నిజంగా ప్రమాదంలో పడినట్టు! వస్తు ప్రపంచం కంటే పుస్తక ప్రపంచం మేలైనది. ఇంట టివి, ఫ్రిజ్జు, కారు, ఐఫోన్ ఎన్ని కొన్నా మరోటేదో కావాలన్న అత్యాశను, పేడలో పడవేసే పేరాశను కలిగిస్తాయి. పుస్తకాలు? నీ పాదాలకు లేపనం రాసి హిమానీనదాల వరకూ తీసుకెళతాయి. నీ చీకటి కవాటాలను తెరిచి వెలుతురు వాకిళ్ల ఎదుట నిలబెడతాయి. నీ మూఢవిశ్వాసాలకు నువ్వే నవ్వుకునేలా చేస్తాయి. చైతన్యాన్ని కలిగించి నీ నిజస్థితి మీద అంచనా కట్టిస్తాయి. ద్వేషంతో, హైన్యంతో, వ్యవస్థీకృత దుర్లక్షణాలతో బతకాలన్న నీ పట్టుదలను అవి హరిస్తాయి. పుస్తకాలు నిన్ను పెట్రోలు కొట్టించమనవు. ఫుడ్డు ఆర్డర్ పెట్టమనవు. విలాసాలు అమేజాన్ చేయమనవు. అవి కోరేదల్లా తెరిచి చదవమనే! రెండు రాష్ట్రాల్లో 9 కోట్ల తెలుగు జనాభా. ఏ పుస్తకమూ 500 కాపీలు అమ్ముడుపోదు. అంటే కోటికి 100 మంది కూడా పుస్తకాలు కొనరు. సినిమా హీరోల కొరకు టికెట్టు రికార్డు స్థాయిలో కొంటారు. ‘నెక్ట్స్ సినిమా ఏమిటి?’ అని అడుగుతారు. ‘నువ్వు చదివిన పుస్తకం చెప్పు’ అని ఏ హీరోనీ ఎవరూ అడగరు. శ్రీమంతురాలైన సుధామూర్తి తానే శ్రీమంతులుగా భావించే ఒకరి ఇంటికి వెళ్లిందట. ‘అబ్బబ్బ... ఆ ఇంట మణిమాణిక్యాలు వజ్రవైఢూర్యాలు.. బంగారు సింహాసనాలు... అమూల్య కళాకృతులు... ఒక్కటే లోపం. ఒక్క పుస్తకం కనపడలేదు’ అని రాసింది. ఇలాంటి పేదరికంలో ఉన్న శ్రీమంతులు మనలో ఎందరు? పూర్వం తెలుగు ఇళ్లల్లో తప్పనిసరిగా ఎక్కాల పుస్తకం ఉండేది. శతకాలు ఉండేవి. పెద్ద బాలశిక్ష అయినా కనిపించేది. ఒక చిన్న గూటిలో ఇవి కూడా లేని స్థితికి తెలుగుజాతి ఎగబాకింది 10 వేల మంది తెలుగు కవులు ఉన్నారు. పక్క కవి పుస్తకం కొనరు. 5 వేల మంది తెలుగు కథకులు ఉన్నారు. పక్క రచయిత సంకలనం కొనరు. పాఠకుల మీద వంక పెడుతుంటారు. మొదట వీరే పుస్తకాలు కొనరు. రచయిత అంటే ఎవరు? సీనియర్ పాఠకుడు! మంచి కవి కావాలన్నా, మంచి కథకుడు కావాలన్నా మొదట జీవితంలో పాల్గొనాలి అనుభవం కోసం. తర్వాత పుస్తకాలు చదవాలి సాధన కోసం. జీవన స్పర్శ, పుస్తకాల సంపర్కం లేని శుష్కకవులతో, కథకులతో నిండి ఉంది నేటి మెజారిటీ తెలుగు సమాజం. ఇక మన పాఠకులు ‘మా పిల్లలు తెలుగు చదవరు’... ‘మాకు ఈ కథలు, కవిత్వం పడవు’ అంటూ ఉంటారు. నీకు రోటి పచ్చడి ఇష్టమైతే కనీసం రోటి పచ్చళ్ల మీద వచ్చిన పుస్తకమైనా కొను. ఇంట పుస్తకంగా కనపడుతూ ఉంటుంది. డిసెంబర్ 22 నుంచి జనవరి 1 వరకు హైదరాబాద్లో పుస్తకాల రుతువు. అంటే బుక్ ఎగ్జిబిషన్. వందలాది స్టాళ్ళు, వేలాది పుస్తకాలు, ఆవిష్కరణలు, ఉపన్యాసాలు, సాహితీకారుల దర్శనం, మిత్రుల కరచాలనం, చలిగాలుల్లో ఛాయ్తో చేసే కబుర్లు. తెలుగులో ఎందరో రచయితలు, కవులు, బుద్ధిజీవులు... ఈ బుక్ ఎగ్జిబిషన్కు తరలివచ్చే పాఠకుల మీద నమ్మకంతో కొత్త పుస్తకాలను విడుదల చేస్తున్నారు. పాత క్లాసిక్స్ను రీప్రింట్ చేస్తున్నారు. ‘ఈ పుస్తకాలు చదివి ఆనందించండి, ఆస్వాదించండి, ఆలోచించండి’ అని కొమ్ముబూర ఊది మరీ మొరపెట్టుకోనున్నారు. ఈ రుతువులో పాలుపంచుకోండి. పుస్తకాల చెట్టు నీడ ప్రతి ఇంటా పడుగాక! -
హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన.. పూర్తి వివరాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత హైదరాబాద్ బుక్ ఫెయిర్ జాతీయ స్థాయి పుస్తక ప్రదర్శనగా ఎదిగిందని సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ఈనెల 22వ తేదీ నుంచి జనవరి 1 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ పుస్తక ప్రదర్శనను నిర్వహించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, మాజీ మంత్రి జోగు రామన్న, బుక్ ఫెయిర్ ఉపాధ్యక్షుడు కోయ చంద్రమోహన్ తదితరులు మంగళవారం మంత్రిని కలిశారు. పుస్తక ప్రదర్శనకు తెలంగాణ కళా భారతి (ఎన్టీఆర్) స్టేడియంలో అనుమతివ్వాల్సిందిగా కోరారు. ఈ మేరకు మంత్రి ఉత్తర్వులు జారీచేశారు. అనంతరం శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ 35 ఏళ్లుగా హైదరాబాద్ బుక్ ఫెయిర్ నిర్వహించడం అభినందనీయమన్నారు. అన్ని భాషల పుస్తకాలతో పాటు తెలుగు భాషా సంస్కృతి, తెలంగాణ చరిత్రకు సంబంధించిన పుస్తకాలు, దేశవ్యాప్తంగా 300 లకుపైగా పబ్లిషర్స్ రావడంతో ఇది జాతీయ పుస్తక ప్రదర్శనగా మారిందని తెలిపారు. (క్లిక్ చేయండి: ‘తానా’ అంతర్జాతీయ కార్టూన్ పోటీ.. విజేతలకు రూ. లక్ష నగదు) -
ప్రజల మనిషి నవలను చదివాను: సీజేఐ ఎన్వీ రమణ
సాక్షి, హైదరాబాద్: ప్రతిఒక్కరూ పుస్తకం చదివి, ఇతరులతో చదివించడాన్ని ఒక ఉద్యమంలా ముం దుకు తీసుకెళ్లాలని భారత ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. ప్రపంచగతిని సాహిత్యమే మార్చిందని, ఎంతోమంది మహానుభావులు ప్రపంచాన్ని అర్థం చేసుకొని రాసిన గ్రం థాలే సమాజాలను ముందుకు నడిపించేందుకు దోహదం చేశాయని అన్నారు. గాంధీజీ, నెహ్రూ వంటి జాతీయనేతలు రాసిన పుస్తకాలు జాతీయోద్యమానికి స్ఫూర్తిగా నిలిచాయని కొనియాడారు. హైదరాబాద్ 34వ జాతీయ పుస్తక ప్రదర్శన ముగింపు సందర్భంగా మంగళవారం ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జస్టిస్ రమణ మాట్లాడుతూ చదివేవాళ్లు కరువవుతున్నారని, పుస్త కం భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆందోళన చెందుతున్న తరుణంలో వేలాదిమంది యువత పుస్తక ప్రదర్శనలో కనిపించడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు. పుస్తకం భవిష్యత్తు ప్రశ్నార్థం కాబోదని, అది సజీవంగానే ఉంటుందనే ఆశ చిగురించిందని చెప్పారు. తాను చదువుకొనే రోజుల్లో కోఠిలోని నవయుగ, విశాలాంధ్ర వంటి పుస్తకాల షాపుల్లోనే పుస్తకాలు లభించేవని పేర్కొన్నారు. డిజిటల్ రీడింగ్ ప్రమాదకరం ఇప్పుడు చదవాల్సిన అవసరం లేకుండా, చదివి వినిపించే డిజిటల్ రీడర్స్ అందుబాటులోకి వచ్చాయని, కానీ ఈ పద్ధతి ప్రమాదకరమని జస్టిస్ రమణ చెప్పారు. పుస్తకాలు, పత్రికలు చదివినప్పుడే మేధోవికాసం లభిస్తుందని, తల్లిదండ్రులు తప్పనిసరిగా పిల్లలు పుస్తకాలను చదివేవిధంగా ప్రోత్సహించాలని సూచించారు. తాను చిన్నప్పుడు రోజూ గ్రంథాలయానికి వెళ్లి మూడు, నాలుగు గంటలపాటు పత్రికలు, పుస్తకాలు చదివేవాడినని పేర్కొన్నారు. ప్రస్తుతం స్కూళ్లలో గ్రంథాలయాలు, ఆటస్థలాలులేవని, వాటి ఏర్పాటుకు అందరూ కృషి చేయాలన్నారు.భావాల వ్యక్తీకరణకు లేఖలు రాయడానికి మించిన మార్గం లేదని చెప్పారు. నేనూ ఓ పుస్తకం రాస్తా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, తగి నన్ని నిధులు ఇవ్వాలని జస్టిస్ రమణ కోరారు. మహాకవి శ్రీశ్రీ 1930 నుంచే రచనలు చేసినప్పటికీ ఆయన మహాప్రస్థానం వెలువడిన తరు వాతే ఎంతోమంది చదివి చైతన్య వంతులయ్యా రని అన్నారు. పుస్తక ప్రచురణ సంస్థల కష్టాలు తనకు తెలుసునని, లా చదివే రోజుల్లో కొంతకాలంపాటు ‘నడుస్తున్న చరిత్ర’పత్రిక నిర్వహించి చాలా కష్టాలు పడ్డానని గుర్తు చేశారు. ప్రస్తుతం ఎన్నో అద్భుతమైన పుస్తకాలు తెలుగులో వస్తున్నాయని, హైదరాబాద్ బుక్ ట్రస్టు ప్రచురించిన మేరీ టైలర్ జైలు జీవితం పుస్తకం చాలా బాగుందన్నారు. తాను చదువుకొనే రోజుల్లో అమ్మ నవలను ఎన్నోసార్లు చదివినట్లు చెప్పారు. పదవీ విరమణ అనంతరం పుస్తకాలు చదువుతానని, ఒక పుస్తకం కూడా రాస్తానని జస్టిస్ రమణ చెప్పారు. కాగా, యాదాద్రి భువనగిరి జిల్లా వెల్లంకికి చెందిన ఆచార్య కూరెళ్ల గ్రంథాలయం వ్యవస్థాపకుడు, దాశరథీ పురస్కార గ్రహీత డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృ తిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, హైదరాబాద్ బుక్ ఫెయిర్ కమిటీ కార్యదర్శి కోయ చంద్రమోహన్, కోశాధికారి పి.రాజేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. తెలుగులోనే తీర్పులివ్వాలి మన తెలుగు రాష్ట్రాల్లో హైకోర్టు తీర్పులను తెలుగు, హిందీ భాషల్లో వెలువరించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. సుప్రీంకోర్టు తీర్పులను ఇప్పటికే కొంతకాలంగా ప్రాంతీయ భాషల్లోకి అనువదించి వెబ్సైట్లో ఉంచుతున్నట్లు చెప్పారు. తాను గతంలో హైకోర్టులో పనిచేసిన సమయంలో తెలుగులోనే తీర్పులివ్వాలనే ఉద్దేశంతో అప్పట్లో జూబ్లీహాలులో జడ్జిలకు సంవత్సరం పాటు శిక్షణ ఇప్పించామన్నారు. ఈ శిక్షణ పొంది తెలుగులోనే తీర్పులిచ్చిన వారిని అభినందించి, అవార్డులు కూడా అంద చేశామని ఆయన గుర్తుచేశారు. -
హైదరాబాద్: బుక్ ఫెయిర్కు పోటెత్తిన పాఠకులు
-
Hyd Book Fair: పుస్తకాల పండుగకు అక్షరాల తోరణం..
సాక్షి, సిటీబ్యూరో: పుస్తకాల పండుగ మళ్లీ వచ్చేసింది. ఏటేటా చదువరుల మనసు దోచుకుంటూ కొలువుదీరే 34వ జాతీయ పుస్తకమహోత్సవం శనివారం ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభమైంది. సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరు గౌరీశంకర్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, హైదరాబాద్ బుక్ ఫెయిర్ కమిటీ కార్యదర్శి కోయ చంద్రమోహన్, తదితరులు ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వైవిధ్యభరితంగా.. విభిన్న సంస్కృతులు, బహుభాషలకు నిలయమైన భాగ్యనగరంలో పుస్తకం మరోసారి వేడుక చేసుకుంటోంది. వైవిధ్యభరితమైన అంశాలపైన రూపొందించిన పుస్తకాలతో పాఠక మహాశయులకు చేరువైంది. జాతీయ, అంతర్జాతీయ ప్రచురణ సంస్థలతో 260 స్టాళ్లను ఏర్పాటు చేశారు. రచయితలు స్వయంగా తమ పుస్తకాలను విక్రయించేందుకు హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ సొసైటీ ప్రత్యేకంగా ఒక స్టాల్ను ఏర్పాటు చేసింది. విభిన్న జీవన పార్శ్వాలను సమున్నతంగా ఆవిష్కరించే వివిధ భాషల పుస్తకాలు ప్రదర్శనలో పుస్తకప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సామాజిక మాద్యమాలు, ఇంటర్నెట్లు, స్మార్ట్ఫోన్లు రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలోనూ పుస్తకానికి ఏ మాత్రం ఆదరణ తగ్గలేదనేందుకు నిదర్శనంగా మొదటి రోజే సందర్శకులతో ఎన్టీఆర్ స్టేడియంలో సందడి నెలకొంది. బాలల సాహిత్యం, ఆధ్యాత్మికం, వ్యక్తిత్వ వికాసం, వైద్యం, ఆరోగ్యం వంటి అన్ని రంగాలకు చెందిన పుస్తకాలతో పాటు, చరిత్ర, సాహిత్యం, ప్రముఖుల జీవిత చరిత్ర గ్రంధాలు అందుబాటులో ఉన్నాయి. మరోసారి ‘చందమామ కథలు’ అనేక దశాబ్దాల పాటు తెలుగు పాఠకలోకాన్ని కట్టిపడేసిన చందమామ కథలు సంపుటాలుగా వెలువడ్డాయి. బాలల మనసు దోచుకొనే అద్భుతమైన కథలతో రూపొందించిన ఈ పుస్తకాలు మొత్తం 15 సంపుటాలుగా ముద్రించారు. 1950 నుంచి 2012 వరకు వచ్చిన కథలనన్నింటినీ ఈ సంపుటాల్లో నిక్షిప్తం చేశారు. విశాలాంధ్ర, నవతెలంగాణ, నవోదయ తదితర స్టాళ్లలో ఇవి అందుబాటులో ఉన్నాయి. విశాలాంధ్రకు చెందిన 10 నుంచి 13వ స్టాల్ వరకు ఈ సంపుటాలు అందుబాటులో ఉన్నాయి. చలం సమగ్ర సాహిత్యం.. చలం రాసిన పుస్తకాలన్నింటినీ 22 సంపుటాలుగా ముద్రించారు. ప్రియదర్శిని ప్రచురణ సంస్థకు చెందిన స్టాల్ నెంబర్ 112 లో ఈ సంపుటాలు అందుబాటులో ఉన్నాయి. మైదానం, దైవమిచి్చన భార్య, అమీనా, చలం మ్యూజింగ్స్, స్త్రీ వంటి అనేక గ్రంధాలతో ఆ నాటి నుంచి నేటి వరకు పాఠకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న చలం సాహిత్యం అంతా ఒక్క చోట లభించడం విశేషం. చిందు ఎల్లమ్మ వేదిక.. పుస్తక ప్రదర్శన వద్ద ఏర్పాటు చేసిన సాహిత్య వేదికకు ఈసారి యక్షగాన కళాకారిణి చిందు ఎల్లమ్మ వేదికగా నామకరణం చేశారు. అలాగే మొత్తం ప్రాంగణానికి మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణు మాధవ్ పేరు పెట్టారు. ♦ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. తెలంగాణ కళారూపాలు, నృత్యప్రదర్శనలు నిర్వహిస్తారు. u యంగ్ రైటర్స్ను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. కోవిడ్ కారణంగా పుస్తకాలను ఆవిష్కరించలేకపోయిన వారికి సముచిత ప్రోత్సాహం ఉంటుంది. ♦పుస్తకం పఠనం పట్ల అభిరుచిని పెంచేందుకు సదస్సులు, చర్చలు ఉంటాయి. ♦ఈ నెల 22వ తేదీన పర్యావరణంపైన ప్రత్యేక సాహిత్య సదస్సును ఏర్పాటు చేయనున్నారు. ఇదీ చారిత్రక నేపథ్యం... హైదరాబాద్ లో 1980వ దశాబ్దంలో పుస్తక ప్రదర్శన మొదలైంది. కానీ పుస్తకాలను ఒక దగ్గరకు చేర్చి ప్రదర్శించాలనే ఆలోచన కూడా లేని రోజుల్లో అంటే 1948 నుంచి వట్టికోట ఆళ్వారుస్వామి తన ‘దేశోద్ధారక గ్రంథమాల’ సంస్థ ప్రచురించిన పుస్తకాలను పాఠకుల వద్దకు తీసుకెళ్లాడు. 1961వరకు ఆయన ఈ సంప్రదాయాన్ని కొనసాగించాడు. హైదరాబాద్ నగరంలో నిజాంల కాలం నుంచే పుస్తకాలకు ఆదరణ ఉంది. అధికార భాష ఉర్దూతో పాటు తెలుగు, మరాఠా, కన్నడ భాషలకు చెందిన పుస్తకాలు వచ్చాయి. కోఠీలోని బడీచౌడీ ఒక పుస్తక బజార్గా వెలుగొందింది. ఈ బడిచౌడీ బుక్ సెల్లర్సే హైదరాబాద్ బుక్ ఫెయిర్కు శ్రీకారం చుట్టారు. విశాలాంధ్ర, ప్రజాశక్తి, మిళింద ప్రకాశన్, ఎమెస్కో, నవోదయ వంటి సంస్థలు అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రదర్శనలో తమ భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నాయి. ప్రదర్శన ఆరంభం ఇలా.. ♦దేశవ్యాప్తంగా పుస్తక పఠనాన్ని పెంచే లక్ష్యంతో ఆవిర్భవించిన నేషనల్ బుక్ ట్రస్టు ఆధ్వర్యంలో 1986లో ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’ కేశవ మొమోరియల్ స్కూల్లో ప్రారంభించారు. ♦ఆ తరువాత నిజాం కళాశాల మైదానం, ఆర్టీసీ క్రాస్రోడ్స్, చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయం, నెక్లెస్రోడ్డు తదితర ప్రాంతాల్లో పుస్తక ప్రదర్శనలు జరిగాయి. ♦ఆ నాటి నుంచి నేటి వరకు కథలు, నవలలు, గల్ఫికలు, చరిత్ర గ్రంథాలదే అగ్రస్థానం. శ్రీశ్రీ, చలం, బుచ్చిబాబు, కొడవటిగంటి కుటుంబరావు, త్రిపురనేని గోపీచంద్, వట్టికోట, విశ్వనాథ సత్యనారాయణ, షేక్స్పియర్, సోమర్సెట్ మామ్, యద్దనపూడి, మాదిరెడ్డి, కొమ్మూరి వేణుగోపాల్రావు వంటి ప్రముఖుల రచనలు ఇప్పటికీ హాట్కేకుల్లా అమ్ముడవుతూనే ఉన్నాయి. ♦‘మహాత్మాగాంధీ ఆత్మకథ’ వంటి గ్రంథాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు లక్షలాది మంది పాఠకులను ప్రభావి తం చేస్తూనే ఉన్నాయి. శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ ఖడ్గసృష్టి వంటి గ్రంథాలకు ఇప్పుడూ అదే ఆదరణ ఉంది. ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంది హైదరాబాద్ బుక్ ఫెయిర్ చాలా అద్భుతంగా ఉంది. చాలా పుస్తకాలు కొనుక్కోవాలని ఉంది. కానీ న్యూజిలాండ్కు తీసుకెళ్లడం కష్టంకదా. చందమామ కథల సంపుటాలు తీసుకున్నాం. ఇప్పటి పిల్లలకు ఆ పుస్తకాలు చాలా అవసరం. – శ్రీలత మగతల, అధ్యక్షురాలు న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ పాఠకులకు నచ్చిన పుస్తకాలున్నాయి ఈసారి 260కి పైగా స్టాళ్లు ఏర్పాటు చేశాం. సుమారు 2.5 లక్షల పుస్తకాలు అన్ని ప్రముఖ భాషలలో ఉన్నాయి. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి కావలసిన అద్భుతమైన మెటీరియల్ ఉంది. అలాగే ఎవరి అభిరుచికి తగిన పుస్తకాలను వారు కొనుక్కోవచ్చు. కవులు, రచయితల కోసం ఒక ప్రత్యేక స్టాల్ను కూడా ఏర్పాటు చేశాం. వారు అక్కడ స్వయంగా తమ పుస్తకాలను విక్రయించవచ్చు. – కోయ చంద్రమోహన్, బుక్ ఫెయిర్ కమిటీ కార్యదర్శి తెలుగు నవలల కోసం వచ్చాను తెలుగు నవలలపైన ఆసక్తితో వచ్చాను. తెలుగు భాషపైన పట్టు రావాలంటే సాహిత్యం చదవాలి కదా. ఈసారి చాలా మంచి పుస్తకాలు వచ్చాయి. బుక్ఫెయిర్ వారికి కృతజ్ఞతలు. – లహరి, దిల్సుఖ్నగర్ బైక్రైడింగ్..బుక్ రీడింగ్ బైక్ రైడింగ్ నా హాబీ. బైక్ పై చాలా దూరం వెళ్లి ప్రశాంతమైన వాతావరణంలో రోజంతా ఒక పుస్తకం చదువుకొని వస్తాను. చాలా హాయిగా ఉంటుంది. అందుకే నచ్చిన పుస్తకాలు కొనుగోలు చేద్దామని వచ్చాను. – విశ్వేశ్వర్, ఓల్డ్సిటీ -
స్త్రీలు పుస్తక ప్రియులు
‘మేగజీన్ వచ్చిందా’ నుంచి ‘సీరియల్ వస్తోంది టీవీ ఆన్ చెయ్యి’ వరకూ కాలం ప్రవహించింది. ఫేస్బుక్, వాట్సప్ చెక్ చేసుకుంటే తప్ప రోజు గడవని రోజూ వచ్చింది. ఒకప్పుడు పాఠకుల కంటే పాఠకురాళ్లే ఎక్కువ. వారి కోసమే మేగజైన్లు, ప్రత్యేక సీరియళ్లు నడిచేవి. కాని ఇప్పుడు తమ పుస్తక పఠనాన్ని కాపాడుకోవడం కోసం స్త్రీలు కూడా ప్రయాస పడాల్సి వస్తోంది. నేటి నుంచి హైదరాబాద్ బుక్ఫెయిర్ జనవరి 1 నుంచి విజయవాడలో. స్త్రీలు ఏం చదువుతున్నారు... ఎటువంటి పుస్తకాలు ఆశిస్తున్నారు... అసలు చదివే సమయం మిగిలిందా? చూద్దాం. మన భాషలో వచ్చిన గొప్ప పుస్తకాలు చదివి ఉండాలి ఇంట్లో పుస్తకాలు ఉండే వాతావరణం వల్ల పుస్తకాలు చదివే అలవాటైంది. అయితే కాలక్షేపం పుస్తకాలు కాదు. హైస్కూల్లోనే ‘ఏడుతరాలు’ చదివేశా. ఉద్యోగాలు చేసే స్త్రీలు ఉద్యోగం, కుటుంబం రెంటి మధ్య సమయం వెతుక్కుని పుస్తకాలు చదవాల్సి వస్తోంది. నేనైతే ప్రయాణాల్లోనే ఇప్పుడు ఎక్కువగా చదువుతున్నాను. ‘అంటరాని వసంతం’ వంటి గొప్ప పుస్తకాలు మన దగ్గర ఉన్నాయి. కనీసం మన భాషలో వచ్చిన గొప్ప పుస్తకాలను కొన్నైనా ప్రతి ఒక్కరూ చదివి ఉండాలి. ఇటీవల నేను కొత్త జనరేషన్ ఏం రాస్తున్నారా అని ఆసక్తిగా చూస్తున్నాను. పుస్తక పఠనం నా పిల్లలకు అలవాటు చేశాను. వాళ్లు నాకంటే ఎక్కువ చదువుతారు. కాకపోతే ఇంగ్లిష్లో. ఒక ప్రిన్సిపాల్గా విద్యార్థులకు పుస్తకాలు అలవాటు చేయడానికి లైబ్రరీలో కనీసం గంట కూచోవాలని చెబుతున్నా. – ఎం. ప్రగతి, ప్రిన్సిపల్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, హిందూపురం చదివేవాళ్లు సాకులు చెప్పరు పుస్తకాలు చదవడం మా నాన్నగారు, అమ్మగారు అలవాటు చేశారు. చిన్నప్పటి నుంచి నా బెస్ట్ఫ్రెండ్ పుస్తకాలే. నా ఎమోషన్ వాటితోనే షేర్ చేసుకునేదాన్ని. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే నాకు మొదట పుస్తకమే గుర్తుకు వస్తుంది. నేను మనుషులను డైరెక్ట్గా అర్థం చేసుకోవడం కంటే పుస్తకాల ద్వారానే అర్థం చేసుకున్నా. కాబట్టి నా మంచిచెడ్డలు రెంటికీ పుస్తకాలే బాధ్యులు. ‘ఏడుతరాలు’ వంటి పుస్తకాలు చిన్నప్పుడే చదివి పనిమనుషులతో ఎంత మర్యాదగా వ్యవహరించాలో నేర్చుకున్నాను. రావిశాస్త్రి ‘రత్తాలు– రాంబాబు’ చదివి టీనేజ్లో కంగారు పడ్డాను. పుస్తకం చదివే అలవాటు ఉన్నవాళ్లు వాటిని చదవలేకపోతే గిల్ట్ ఫీలవుతారు. పుస్తకాలు చదవడానికి టైం లేకపోవడాన్ని నేను నమ్మను. టైమ్ దొరుకుతుంది. కొంతమంది ఈ కాలం పిల్లల్ని గమనిస్తే ఇవాళ్టి జనరేషన్ కూడా పుస్తకాలు చదువుతున్నారన్న ఆశ ఉంది. – అరుణ ప్రసాద్, గృహిణి, నిజాంపేట, హైదరాబాద్ ఎక్కడ పడితే అక్కడ కూచుని పుస్తకం చదవాలి నేను కాలేజీలో ఉండగా పుస్తకాలు చదవడం మొదలెట్టా. సీరియస్ సాహిత్యానికి నాన్ సీరియస్ సాహిత్యానికి తేడా సీరియస్ సాహిత్యంలో కూరుకుపోయా. సెంట్రల్ యూనివర్సిటీలో చదివేప్పుడు పుస్తకాలంటే ఎక్కువ ఆసక్తి ఏర్పడింది. నామిని పుస్తకం ‘పచ్చనాకు సాక్షిగా’ అక్కడే చదివా. చలం పుస్తకాలు, తిలక్ అమృతం కురిసిన రాత్రి, మహా ప్రస్థానం, జాషువా గబ్బిలం, శివసాగర్... ఇలా ఎన్ని పుస్తకాలో. అవన్నీ ఏ జనరేషన్ అయినా చదువుతూ ఉండాల్సిందే. టెక్నాలజీ వచ్చింది. కొంతమంది యూట్యూబ్లో కథలు వింటున్నారు. ఆడియో లిటరేచర్ వింటున్నారు. కాని నాకు పుస్తకం చదవడమే బాగుంటుంది. అది కూడా ఎక్కడ పడితే అక్కడ కూచుని పుస్తకం చదువుతూ ఉంటే ఆ ఆనందం వేరు. పుస్తకం ఇచ్చే ఆలోచన వేరు. –చల్లపల్లి స్వరూపరాణి, ప్రొఫెసర్, నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు ఇవాళ కావాల్సింది ఆలోచన రేపే పుస్తకాలు నేను ఆర్ట్ స్టూడెంట్ని. మా నాన్నగారు ఆర్ట్ స్టూడెంట్స్ సాహిత్యం కూడా చదవాలని‘కంప్లీట్ వర్క్స్ ఆఫ్ షేక్స్పియర్’ చదివించేవారు. ఆ రోజుల్లో నాకు ప్రకృతి అంటే ఇష్టం ఉండేది. వర్డ్స్వర్త్, షెల్లీ... ఇష్టపడ్డాను. ఆ తర్వాత ఓ హెన్రీ కథలు చాలా నచ్చాయి. మెల్లగా లెఫ్ట్ సాహిత్యం చదవడం మొదలుపెట్టాను. మనం టీవీ చూడకపోతే చాలా పుస్తకాలు చదవొచ్చు. టీవీ ఐదు నిమిషాలైనా చూడగలమా? ఎప్పటికైనా సరే పుస్తకమే ముఖ్యమైనది. మనల్ని జంతువుల నుంచి వేరు చేసేది ఆలోచన. ఆ ఆలోచన పుస్తకం నుంచే వస్తుంది. ఈ రోజు సమాజంలో అనేక మార్పులు వస్తున్నాయి. వాటిని అర్థం చేసుకునే పుస్తకాలు చదవాలి. వివక్ష, సామాజిక సమస్యలు, మతతత్వం... వీటిని అర్థం చేసుకునే పుస్తకాలు చదవాలి. –కె.ఉషారాణి, ప్రజాశక్తి బుక్ హౌస్ మాజీ ఎడిటర్, విజయవాడ పుస్తకాల షెల్ఫ్లు లేని ఇళ్లు తయారయ్యాయి! మా ఇంట్లో మా నాన్న, మేనత్తలు పుస్తకాలు చదివేవారు. కనుక మాకు పుస్తకాలు చదవడం అలవాటైంది. ఇంట్లో అందుబాటులో పుస్తకాలు ఉంటే పిల్లలు ఎప్పుడో ఒకప్పుడు వాటిని చదువుతారు. మేము కొన్ని కారణాల రీత్యా ఇల్లు, ఊరు మారాం. కాని ఇంత పెద్ద ఫ్లాట్లో పుస్తకాలు పెట్టుకోవడానికి వీలుగా ర్యాక్స్ లేవు. ఇలాంటి ఇళ్లు తయారైతే ఎలా? మా చిన్నప్పుడు ఇంట్లో పుస్తకాలు లేకపోతే పక్కింటివాళ్లైనా ఇచ్చేవారు. ఇవాళ ఆ వాతావరణం మళ్లీ రావాలి. చలం ‘స్త్రీ’ వంటి పుస్తకం చదవకపోతే ఎలా? ఓటిటిలు, షాపింగులు స్త్రీల సమయాన్ని తీసుకున్నా ఆ ఆకర్షణకు మించిన పుస్తకాలు కూడా బోలెడు వచ్చి పడుతున్నాయి. వాటిలో చదవదగ్గది ఉంటే పఠనాభిలాష ఎక్కడికీ పోదు. మంచి పుస్తకాన్ని ఎవరు వదిలిపెడతారు? చదవడానికి ట్యూన్ కావాలి. అది ముఖ్యం. – వాడ్రేవు వీరలక్ష్మీ దేవి, రచయిత, కాకినాడ ట్రాఫిక్లోనే చదవాల్సి వస్తోంది నేను చదివిన సెయింట్ ఫిలోమినా స్కూల్లో లైబ్రరీ ఉండేది. రోజూ ఒక గంట అందులో కూచుని చదవాలి. అలా నాకు పుస్తకాలు అలవాటయ్యాయి. మా చర్చిలో ఒక తాతకు చదువురాదు. ఆయన నా చేత పుస్తకాలు చదివించుకుని వాటి ఆధారంగా మాట్లాడేవాడు. అలా కూడా నేను పుస్తకాలు చదివాను. సీరియస్ సాహిత్యం అంటే 2002లో విశాలాంధ్ర వారు పెట్టిన వ్యాసరచన పోటీలో బహుమతి వస్తే వాళ్లు 3000 రూపాయల పుస్తకాలు గిఫ్ట్ చేశారు. వాటిలో విశ్వంభర, మహాప్రస్థానం, అమృతం కురిసిన రాత్రి ఉండటంతో పొయెట్రీలోకి వచ్చాను. ఆ తర్వాత ఫేస్బుక్ వల్ల చాలా పుస్తకాలు తెలిశాయి. ముఖ్యంగా జయకాంతన్ కథలు నాకు నచ్చాయి. ఇప్పుడు ట్రాఫిక్లో మాత్రమే పుస్తకాలు చదివే వీలు దొరుకుతోంది. నాకే కాదు.. చాలామందికి. టెక్నాలజీ పెరిగాక ఆఫీస్ కాల్స్ 24 గంటలు అవుతున్నాయి. పుస్తకం చదవాలంటే టైమ్ చూసుకోవాల్సిందే. – మెర్సీ మార్గరెట్, గురుకుల స్పెషల్ స్కూల్ ఇన్చార్జ్, ఘట్కేసర్. -
Hyderabad: 18 నుంచి 27 వరకు బుక్ఫెయిర్
సాక్షి, హైదరాబాద్: పుస్తకం రెక్కలల్లార్చుకొని చదువరి చెంతకు తిరిగి వచ్చేస్తోంది. లక్షలాది మంది సాహితీ ప్రియుల మదిని దోచుకోనుంది. ఈ నెల 18 నుంచి 27 వరకు హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన 34వ వేడుకలు ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభం కానున్నాయి. ఈసారి కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా హైదరాబాద్ బుక్ ఫెయిర్ కమిటీ సన్నాహాలు చేపట్టింది. ఏటా సుమారు 330 నుంచి 350 స్టాళ్లతో జాతీయ స్థాయి పుస్తక ప్రచురణ సంస్థలతో నిర్వహిస్తున్న ప్రదర్శనలో ఈ ఏడాది వీటి సంఖ్యను తగ్గించినట్లు నిర్వాహకులు తెలిపారు. కోవిడ్ జాగ్రత్తలను పాటిస్తూ సందర్శకులు పుస్తక ప్రదర్శనలో పాల్గొనేందుకు అనుగుణంగా 250 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. బహుభాషల్లో.. ► అన్ని రాష్ట్రాలకు చెందిన జాతీయ, అంతర్జాతీయ పుస్తక ప్రచురణ సంస్థలు ఈ ప్రదర్శనలో పుస్తకాలను అందుబాటులో ఉంచనున్నాయి. సామాజిక మాధ్యమాలు, ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్లు రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలోనూ హైదరాబాద్ ఏటేటా పుస్తకానికి బ్రహ్మరథం పడుతూనే ఉంది. ► విభిన్న జీవన రంగాలకు చెందిన లక్షలాది పుస్తకాల విక్రయాలు జరుగుతున్నాయి. కథ, కవి త్వం, నవల, చరిత్ర వంటి సాహిత్యమే కాకుండా బాలల సాహిత్యం, పోటీ పరీక్షల పుస్తకాలు ఆర్థిక, రాజకీయ పరిణామాలపై వెలుడిన విశ్లేషణ గ్రంథాలు, వ్యక్తిత్వ వికాసం, అకడమిక్ పాఠ్యపుస్తకాలు వంటి వాటికీ పాఠకాదరణ లభిస్తోంది. (చదవండి: కళ్యాణలక్ష్మి: కాసులిస్తేనే.. ‘కానుక’!) ప్రదర్శన వేళలు ఇలా.. ► మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు. ► శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో మధ్యాహ్నం 12.30 నుంచి రాత్రి 9 గంటల వరకు. జాగ్రత్తలు పాటించాలి ఎంతో సాహసం చేసి ఏర్పాటు చేస్తున్న ఈ ప్రదర్శనకు సందర్శకులు సహకరించాలి. కచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాలి. మాస్కులు ధరించి మాత్రమే ప్రదర్శనకు రావాలి. భౌతిక దూరం పాటించాలి. – కోయ చంద్రమోహన్, బుక్ఫెయిర్ కమిటీ -
ఇంకొన్ని రోజులు ఉంటే బాగుటుంది..
-
విజేత ఉంటే విజయం మీ వెంటే!
-
బుక్ఫెయిర్లో ఆ స్టాల్స్ ఎంతో ప్రత్యేకం!
-
‘ఫోన్లు కాదు పిల్లలకు పుస్తకాలు ఇవ్వాలి’
-
‘ప్రేమ ఎప్పుడు ఒంటరిగా ఉండదు’
-
బుక్ ఫెయిర్
కలల వరద ప్రపంచంతో సంభాషించడా నికి అరుణాంక్ లత ఒక స్వప్న మార్గాన్ని ఎన్నుకున్నాడు. కలలో తొణికిన ప్రేమను అంతే జాగ్రత్తగా లేఖలుగా మలిచి పాఠకుల ముందుకు తెచ్చాడు. ‘యే తొలి సంధ్య వేళ సూర్యోదయమో, మలి సంధ్య వేళ చంద్రోదయమో చూసినప్పుడు తెరలు తెరలుగా చుట్టుము’ట్టే జ్ఞాపకాల పునాదులు ‘ఖ్వాబ్’లో ఉన్నాయి. ‘హృదయం బద్దలయ్యాక బతికి ఇంకా చేసేదేముందని. అయినా, పగిలిన హృదయంతోనూ ప్రేమించాను కదూ’ అని కలవరిస్తాడు. ఇందులో గుండె ఉక్కబోతలు, వాన పలకరింపులే కాదు, ఒక విధ్వంసం కోసం మరో విధ్వంసానికి బలవుతున్న నల్లమల వ్యథ, అసు వులు బాస్తున్న అఖ్లాక్ల కథ, వాఘా యుద్ధోన్మాద ప్రకటనలపై విసుర్లు కూడా ఉంటాయి. అందుకే ఇది ప్రేమ, విప్లవాల మేలుకలయిక. మరోవైపు తలత్, సైగల్ గొంతుల పలవరింత మైమరపిస్తుంది. మీరూ వినండి. (ఖ్వాబ్ –అరుణాంక్ లత, వెల: రూ. 120) బస్తర్ తిరుగుబాటు స్వాతంత్య్ర పోరాటంతో సహా ఆదివాసీలు ఎన్నో అసమాన పోరాటాలు చేసినా అవి ఎందుకో సరైన రీతిలో సమగ్రంగా చరిత్రకు ఎక్కలేదు. అలా విస్మృతికి గురైన మరో పోరాటం భూంకాల్ విప్లవ పోరాటం. ఆ పోరాటం నుంచి ఆవిర్భవించినవాడే గుండాధూర్. రాజకీయ నేతలెవరూ ఇంకా స్వాతంత్య్రం కోసం ఎలుగెత్తక ముందే ఆదివాసీ సమాజం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించింది. బ్రిటిష్ సైన్యాన్ని గడగడలాడించి, తన జీవిత కాలంలోనే పురాణ పురుషుడిగా ఖ్యాతినొందాడు గుండాధూర్. 1910లో 30 గోండు రాజ్యాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా భూంకాల్ తిరుగుబాటు అనివార్యమైంది. గుండాధూర్ చేసిన పోరాటాలు బస్తర్ ప్రాంతంలోని ఆదివాసీలను ఉత్తేజితులను చేస్తూనే ఉంటాయి. (భూంకాల్– బస్తర్లో ఆదివాసీల తిరుగుబాటు–హెచ్.ఎల్.శుక్లా, వెల: రూ. 130) నమ్మకమిచ్చే కథలు కథలన్నీ సంకలనంగా రాకముందే, రచయితగా పాఠకులను మెప్పించినవారు అరుదుగా ఉంటారు. అలాంటివారిలో అక్కిరాజు భట్టిప్రోలు ఒకరు. వస్తువును స్వీకరించడంలో, దాన్ని నడిపించడంలో, పాత్రలకు సహజత్వాన్ని అద్దడంలో.. వెరసి పాఠకుడిని కథలోకి ఆవాహన చేయడంలో ఆయన చేయి తిరిగినవాడని ‘మూడు బీర్ల తర్వాత’ సంపుటం నిరూపిస్తుంది. తాను చూసిన జీవితంలోంచే కథా వస్తువులను స్వీకరించాడు. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలోని మహిళ అంతరంగాన్ని ఆవిష్కరించడంలో, అనుభూతి ప్రకంపనలు కోల్పో కుండా కొన్నిసార్లు కథను తర్కబద్ధంగా నడిపించడంలో, ఎవరినీ తప్పుబట్టకుండా జీవన వైరుధ్యాలను ఆవిష్కరించడంలో రచయిత ప్రతిభ పాఠకుడిని ఆకట్టుకుంటుంది. తన జీవన ప్రయాణంలోని అనుభవాలకు ఇచ్చిన ఈ కథలు కొన్నిసార్లు మనకూ తారసపడతాయి. – దేశరాజు (మూడు బీర్ల తర్వాత –అక్కిరాజు భట్టిప్రోలు, వెల: రూ. 170) నిలువెత్తు హింస అభివృద్ధి పేరిట ప్రభుత్వాలు కార్పొరేటర్లకు దోచిపెట్టడానికి చేపట్టే భూసేకరణలో అంతు లేని హింస చోటుచేసుకుంటోంది. అందుకు దక్షిణ ఛత్తీస్ గఢ్ నిదర్శనం. అక్కడ ఏం జరిగిందనే వివరాలతో అక్కడి లైంగిక హింసపై ‘నిలువెత్తు సాక్ష్యం’ కార్యాచరణ బృందం వెలువరించిన పుస్తకాన్ని మలుపు ప్రచురణలు తెలుగులోకి తీసుకొచ్చింది. గనుల తవ్వకాల కోసం, ఉక్కు కర్మాగార నిర్మాణం కోసం స్థల సేకరణ, వారి సామగ్రి రక్షణకు సీఆర్పీఎఫ్ బలగాలను ప్రభుత్వం మోహరిస్తే, ప్రైవేట్ కంపెనీల అవసరాల కోసం సొంత సైన్యాలు రంగంలోకి దిగాయని సమాచారం. వీరంతా కలిసి రెండున్నర లక్షల మంది ఆదివాసీలను అడవి నుండి వెళ్లగొట్టారు. వారిని భయభ్రాంతులకు గురి చేయడానికి, అవమానించి తరిమేయడానికి లైంగిక హింసను ఆయుధంగా వాడుకున్నారు. (నిలువెత్తు సాక్ష్యం–దక్షిణ ఛత్తీస్గఢ్లో లైంగిక హింస, వెల: రూ.130) కవిత్వపు గింజలు పల్లెను ప్రేమించడానికి అక్కడివారే కానక్కర్లేదు. పంటను కళ్లకద్దుకోవడానికి వ్యవసాయదారుడే అవ్వక్కర్లేదు. పచ్చదనాన్ని కలగనడానికి పర్యావరణవేత్తే కానక్కర్లేదు. ‘అతనికి అందరూ తెలియక పోవచ్చు/కానీ అన్నం తెలిసిన ప్రతివాడికీ/అతను తెలుసు, ఆకలి తెలిసినట్లే–’ అని రైతు గురించి రాయగలిగిన కవి దర్భశయనం శ్రీనివాసాచార్య గురించి కూడా కవిత్వం తెలిసినవారందరికీ తెలుసు. పంటను తగలబెట్టకు తండ్రీ, పంట కాల్వ, ధాన్య మానవునికి, మట్టి బిడ్డా, వరిపొలానికి కృతజ్ఞతల్తో, మళ్లీ నా వ్యవసాయ కళాశాలకు వంటి కవితలతో అన్నంపెట్టే రైతుపట్ల, వ్యవసాయంపట్ల తనకు గల అపార అభిమానాన్ని మరో సారి ఆయన చాటుకున్నారు. ‘వాళ్లు/ నేలతో నీటితో నింగితో నిప్పుతో/కలిసి బతికేవాళ్లు/అందుకే వాళ్లకు ప్రేమా దయా కృతజ్ఞతా/చల్లని చూపూ తెలుసు’అంటూ ప్రజల్ని అభిమానించే కవి కాబట్టే ‘కళ్లకు కాసిన్ని/చూపు ఉత్సవాల్ని ఇవ్వకుండా’ ఇంతగా పరుగెత్తాలా అని నిలదీస్తాడు.(ధాన్యం గింజలు–దర్భశయనం శ్రీనివాసాచార్య, వెల: రూ. రూ.80) పల్లె చెప్పిన పాఠం పల్లెటూరినుంచి మద్రాస్ వలసపోయిన విద్యాధిక కుటుంబంలో పుట్టి పెరిగిన పట్నవాసం అమ్మాయి.. పెళ్లయి పల్లె జీవితంలోకి వచ్చి పడితే ఎన్ని వైరుధ్యాలమధ్య నలగవలసి వస్తుందో చెప్పిన అనుభవాల పరంపరే ‘పాలంగి కథలు’. మద్రాసులో గొప్ప గొప్ప విద్వాంసుల రాకపోకలతో ఇల్లంతా సందడిగా పెరిగిన రచయిత్రి.. తణుకు పక్కన పాలంగి పల్లెటూరులో వివాహ జీవితంలోకి అడుగుపెట్టారు. ఆధునికత దరిచేరని సమాజంలో, భిన్నమైన వాతావరణంలో ఎలా ఒదిగి పోయిందీ ‘పాలంగి కథలు’లో ఆత్మకథనాత్మక రీతిలో పాఠకుల ముందుపెట్టారు. ఇది ఆమె జీవితం మాత్రమే కాదు. అలనాటి సంప్రదాయ కుటుంబాల స్త్రీల జీవితాల ప్రతిబింబమీ కథలు. ఒక్క మాటలో చెప్పాలంటే ’ఈతరం వారు ఎప్పటికీ చూడలేని, అనుభవించలేని ఒక సహజ సుందరమైన గ్రామీణ జీవితంలోకి మనల్ని తీసుకుపోయే’ అరుదైన రచన. దీన్ని చదివే అనుభవాన్ని కోల్పోవద్దు. – కె. రాజశేఖరరాజు వెల: 100, ప్రతులకు స్టాల్ నంబర్ 275 -
అందుకే స్ర్తీవాద రచనలు చేస్తాను!
-
‘మాటల మడుగు’ మెర్సీ.. ‘లవ్ లెటర్స్’ కడలి..
-
పుస్తకం రాయడానికి అంతకు మించి ఇంకేం కావాలి!
-
ఈ ఏడాది ఆ పుస్తకాలే ఎక్కువగా అమ్ముడయ్యాయి!
-
పుస్తకాల జాతర చూసొద్దాం రండి
-
పుస్తకాల జాతర చూసొద్దాం రండి
వేలకొలది పుస్తకాలు.. లక్షలాది మంది పాఠకులు, వీక్షకులు.. కవులు, రచయితలు, పబ్లిషర్స్, ప్రముఖులు.. ఇలా హైదరాబాద్ బుక్ఫెయిర్ ప్రారంభమైన నాటినుంచి అత్యంత అట్టహాసంగా కొనసాగుతోంది. నగరం నడిబొడ్డున తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం) వేదికగా ఒక జాతరలా, ఒక ఉత్సవంలా, ఒక వేడుకలా జరుగుతున్న హైదరాబాద్ నేషనల్ బుక్ఫెయిర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు, ఇంట్రస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
పుస్తక పఠనంతోనే చైతన్యం
సాక్షి, హైదరాబాద్: పుస్తకాలు భాషా, సంస్కృతులకు దర్పణాలని, విజ్ఞాన సముపార్జనలో, సమాజాభివృద్ధిలో కీలకమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. పుస్తక పఠనం పెరిగి, సమాజంలో చైతన్యం వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. 32వ హైదరాబాద్ జాతీయ పుస్తకమహోత్సవ వేడుకలు శనివారం ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణ సాంస్కృతిక, పర్యాటకశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి, తెలంగాణ మీడియా కమిషన్ చైర్మన్ అల్లం నారాయణ, హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్, కార్యదర్శి కోయ చంద్రమోహన్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు ప్రసంగించారు. తెలంగాణలో గ్రంథాలయ ఉద్యమం అప్పట్లో ప్రజలను చైతన్యవంతులను చేసిందని, మరోసారి ఆ ఉద్యమం రూపుదాల్చా లని అన్నారు. ప్రతి ఇంటికీ స్వచ్ఛాలయం (శౌచాలయం), ప్రతి పల్లెకూ గ్రంథాలయం నినాదంతోపాటుగా స్వచ్ఛత మరియు పుస్తకాలు చదివే సంస్కృతి విస్తరించాలని సూచించారు. తెలుగు భాషాభిమాని, రచయిత అయిన సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో గ్రంథాలయాల ప్రాధాన్యత పెరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ‘‘అక్షర రూపం దాల్చిన ఒక్క సిరా చుక్క, లక్ష మెదళ్ళకు కదలిక’’అన్న కాళోజీ మాటల్ని గుర్తు చేశారు. పుస్తకాలే అండగా నిలిచాయి.... దేశాభివృద్ధి, విజ్ఞాన శాస్త్ర పురోగతి, యుద్ధాలు, శాంతి సుస్థిరతల స్థాపన వంటి అనేక సందర్భా ల్లో సమస్త మానవాళికి పుస్తకాలే అండగా నిలిచాయన్నారు. ఇలాంటి వేడుకల్లోనే కొత్త పుస్తకాల గురించి, కొత్త రచయితల గురించి తెలుసుకోవచ్చునన్నారు. ఆన్లైన్ డిజిటల్ వేదికలు వచ్చినప్పటికీ అచ్చులో అక్షరం విలువ, పరిమళం ఎప్పటికీ వాడిపోవని చెప్పారు. నేషనల్ బుక్ ట్రస్ట్ 1966లో ముంబైలో తొలిసారి పుస్తక ప్రదర్శన నిర్వహించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ బుక్ ఫెయిర్ దేశంలో రెండో స్థానం లో ఉందని, మొదటి స్థానంలో ఉన్న పశ్చిమ బెంగాల్ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. తెలంగాణ మొదటిస్థానానికి చేరేలా ప్రభుత్వం ప్రోత్సహించాలన్నారు. తెలుగు భాష సాంస్కృతిక, సారస్వత పునరుజ్జీవనానికి, తెలంగాణ వికాసానికి గ్రంథాలయ ఉద్యమం చేసిన కృషిని గుర్తు చేశారు. విద్యార్థులకు మహనీయు ల జీవితాలు, చరిత్రను, సంస్కృతిని, విజ్ఞానాన్ని అందించే పుస్తకాలను పరిచయం చేయాలని దిశానిర్దేశం చేశారు. పిల్లలకు పుస్తక పఠనం అలవాటు చేయడం ద్వారా విజ్ఞానం, మెరుగైన జీవితం తద్వారా మెరుగైన సమాజం సాకారమవుతాయన్నారు. ప్రధాని మోదీ సూచించిన విధంగా వివిధ కార్యక్రమాల్లో మంచి పుస్తకాలను బహుమతులుగా అందజేయాలని సూచించారు. ప్రజల్లో పఠనాసక్తిని పెంచేందుకు పత్రికలు, మీడియా చైతన్యం తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. -
వేడుకలా పుస్తక ప్రదర్శన
సాక్షి, హైదరాబాద్: ‘డిసెంబర్ అనగానే పుస్తకాల పండుగ గుర్తొస్తుంది. కవులు, కళాకారులు, రచయితల సందడి కన్పిస్తుంది. పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలే కాకుండా అరుదైన నవలలు, ప్రముఖల జీవితగాథలు, చారిత్రక పోరాటాలు, కథలు, ట్రావెలాగ్స్, కళలు, సంస్కృతి, సంప్రదాయాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ పుస్తకాలన్నీ ఒకే చోట దర్శనమిస్తాయి. రాజధాని నలుమూలల నుంచే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల పాఠక ప్రియులు పెద్ద ఎత్తున వస్తుంటారు. ఈసారి కూడా భారీ సంఖ్యలో పాఠకులు వస్తారని మా అంచనా. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది’అని హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ చెప్పారు. ఈ మేరకు బుధవారం ఆయన ‘సాక్షి ప్రతినిధి’తో మాట్లాడారు. పుస్తక ప్రదర్శన ఏర్పాట్లకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఆయన మాటల్లోనే! సాక్షి ప్రతినిధి: హైదరాబాద్ బుక్ ఫెయిర్ విశిష్టత ఏమిటీ? జూలూరి: దేశంలోనే అతి ప్రాచీనమైన బుక్ఫెయిర్ ఇదే. దీనికంటూ ఓ ప్రత్యేక విశిష్టత ఉంది. సంస్కృతి, సాహిత్యం, సాహిత్య వేత్తలకు సంబంధించిన సేవలను నెమరువేసుకునే ప్రయత్నం చేస్తుంది. అంతేకాదు ఈ నేలమీద పుట్టిన రచయితలకు, వారి రచనలకు ఓ వేదిక కల్పిస్తుంది. భిన్న జాతులు, మతాలు, కులాలు, సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన ప్రజలు జీవిస్తున్నారు. వారి ఆలోచనలకు, అభిరుచికి తగిన పుస్తకాలు అందుబాటులోకి తెచ్చి వారిలో పఠనాసక్తిని పెంచుతుంది. హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఎలా ఎప్పుడు ప్రారంభమైంది? 1985లో మొదటగా చిక్కడపల్లిలోని నగరకేంద్ర గ్రంథాలయంలో హైదరాబాద్ పుస్తక ప్రదర్శన ప్రారంభమైంది. స్థలాభావంతో ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని ఓడియన్ థియేటర్ వద్దకు మార్చాం. ఆ తర్వాత కేశవ్మెమోరియల్ గ్రౌండ్స్, ఎగ్జిబిషన్ మైదానం, నిజాం కళాశాల, పీపుల్స్ప్లాజా, ఆ తర్వాత తెలంగాణ కళాభారతిని (ఎన్టీఆర్ స్టేడియాన్ని) పుస్తక ప్రదర్శనకు వేదికగా మార్చాం. తొలి రోజుల్లో 50 స్టాల్స్తో ప్రారంభమైన ఈ ప్రదర్శన ప్రస్తుతం 320 స్టాల్స్కు చేరుకుంది. సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలకు సంబంధించిన పుస్తకాలే కాదు.. వంటలు, బ్యూటీ టిప్స్ బుక్స్, భక్తి, ముక్తి సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు దొరుకుతాయి. మారుతున్న కాలంలో పుస్తకాలకున్న ప్రాధాన్యం ఏంటి? ఇంటర్నెట్, యూట్యూబ్, స్మార్ట్ఫోన్లు, టీవీలు వచ్చాక పుస్తక పఠనం తగ్గిన మాట వాస్తవమే. టెక్నాలజీ ఎంత వచ్చినా పుస్తకాల అమ్మకాలు మాత్రం తగ్గలేదు. పోటీ పరీక్షల నేపథ్యంలో తెలంగాణ సాహిత్యం, చరిత్ర పుస్తకాలకు డిమాండ్ పెరిగింది. పీడీఎఫ్, ఈ–బుక్ కాపీలను ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని మరీ చదువుతున్నారు. బుక్ఫెయిర్కు లక్షల్లో తరలివస్తున్న పాఠకులే ఇందుకు నిదర్శనం. తెలుగు సాహిత్య విమర్శ ఏ స్థితిలో ఉంది? విమర్శ అసలు లేదని కాదు. అది చేయాల్సినంత పని చేయట్లేదన్నది వాస్తవం. విమర్శ సాహిత్యంలోని విలువలను విశ్లేషించి చూపాలి. సమర్థనకో, విస్మృతికో గురిచేయడం సరికాదు. కవిత్వం, కథ వచ్చినంతగా, నవల, విమర్శ రావట్లేదు. కవుల సంఖ్య పెరిగినంతగా విమర్శకుల సంఖ్య పెరగట్లేదు. ఉన్నవాళ్లలో కూడా లోతైన అధ్యయనంతో నిలబడే విమర్శకులను వేళ్లమీద లెక్కబెట్టొచ్చు. యూనివర్సిటీ విద్యార్థుల రూపంలో విమర్శకు కావాల్సిన ముడి సరుకు ఉంది. -
రారండోయ్
‘హైదరాబాద్ ఫెస్ట్ 2018(పుస్తక ప్రదర్శన) తెలంగాణ కళాభారతి(ఎన్టీఆర్ స్టేడియం) లో ఏప్రిల్ 13 నుంచి 22 వరకు జరగనుంది. తెలంగాణ సాహిత్య అకాడమి నెలనెలా ‘కావ్య పరిమళం’ శీర్షిక క్రమంలో ఏప్రిల్ 13న సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాల్లో పాల్కురికి సోమనాథుని బసవ పురాణంపై డాక్టర్ అనుమాండ్ల భూమయ్య ప్రసంగిస్తారు. అధ్యక్షుడు నందిని సిధారెడ్డి. తంగెళ్లపల్లి కనకాచారి కవితా సంకలనం ‘కుదుపు’ ఆవిష్కరణ ఏప్రిల్ 15న ఉదయం 10 గంటలకు వట్టికోట ఆళ్వారుస్వామి నగర కేంద్ర గ్రంథాలయం, చిక్కడపల్లిలో జరగనుంది. పాలమూరు సాహితీ అవార్డు కోసం 2017లో వచ్చిన వచన కవితా సంపుటాల మూడేసి ప్రతులను ఏప్రిల్ 30 లోగా పంపాలని నిర్వాహకులు కోరుతున్నారు. చిరునామా: డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, 8–5–38, టీచర్స్ కాలనీ, మహబూబ్నగర్–509001. వివరాలకు: 9032844017 ‘సోమనాథ కళా పీఠం’ 2018 ద్వైవార్షిక పురస్కారాలకుగానూ ఏప్రిల్ 30లోగా ప్రతిపాదనలు ఆహ్వానిస్తున్నారు. పాలకురికి సోమనాథుని జీవిత సాహిత్యాలపై పరిశోధన చేసినవారు ‘సోమనాథ సాహిత్య పురస్కారం’, సోమనాథుని భావజాలంపై కృషి చేసినవారు ‘సోమనాథ సామాజిక శోధన పురస్కారం’, నాటక రంగమున సాధన చేసినవారు ‘సోమనాథ రంగస్థల పురస్కారం’, తెలుగు భాషా సాహిత్యములకు సేవ చేసినవారు ‘పందిళ్ల శేఖర్ బాబు రాజయ్య శాస్త్రి స్మారక పురస్కారం’, సాహిత్య రసాస్వాదనకు కృషి చేస్తున్న కోవిదులు ‘వి.చలపతి రావు స్మారక పురస్కారం’ కోసం ‘డాక్టర్ రాపోలు సత్యనారాయణ, గౌరవ అధ్యక్షుడు, సోమనాథ కళాపీఠం, పాలకుర్తి – 506146, జనగామ, ఫోన్: 9440163211’ చిరునామాకు పంపవచ్చు. -
ఆదరణ తగ్గని పుస్తక పఠనం
ఏటేటా లక్షలాది గ్రంథాల అమ్మకాలు 15 నుంచి హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన అందమైన అక్షరాల ఒడి.. జ్ఞానప్రియుల అద్భుత లోకం.. వందలు, వేల సంవత్సరాల చరిత్రను తనలో నిక్షిప్తం చేసుకున్న భాండాగారం.. గతాన్ని వర్తమానానికి, వర్తమానాన్ని భవిష్యత్తుకు అనుసంధానిస్తూ మానవసమాజాన్ని నవోత్సాహంతో ముందుకు నడిపించే అద్భుత చోదక శక్తి ‘పుస్తకం’. కళలు, సంస్కృతులు, సంప్రదాయాలు, భక్తి, ఆధ్యాత్మికం, చరిత్ర, తత్వశాస్త్రం, మనస్తత్వం, సామాజికం, ఆర్థికం, రాజకీయం, జాతీయం,అంతర్జాతీయం.. అన్ని అంశాలకు ప్రతిబింబం. కాగితాల దొంతరలో కూర్చిన అక్షరాల వెంట పరుగులు పెట్టే నేత్రాలు.. భావాన్ని మనసు పొరల్లో నిక్షిప్తంచేసే మరో ప్రపంచం ‘పుస్తకం’. వాట్సప్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలు, ఇంటర్నెట్ రాజ్యమేలుతోన్న కాలంలోనూ పుస్తకం వన్నె తరగలేదు. వైభవాన్ని కోల్పోలేదు. పాఠకుడి ఆదరణ, జిజ్ఞాస మేరకు అన్ని రంగాల్లోకి రెక్కలల్లార్చుకొని విస్తరిస్తూనే ఉంది. విభిన్న భాషా సంస్కృతులకు నిలయమైన హైదరాబాద్ నగరంలో వందల ఏళ్లుగా పుస్తకం వర్ధిల్లుతూనే ఉంది. అలా పాఠకుల ఆదరాభిమానాలతోనే మూడు దశాబ్దాలకు పైగా మహానగరంలో ఏటేటా వేడుక చేసుకుంటోన్న పుస్తకం మరోసారి ప్రదర్శనకు సన్నద్ధమవుతోంది. ఈనెల 15 నుంచి 26వ తేదీ వరకు ఇందిరాపార్కు ఎన్టీఆర్ స్టేడియం ‘హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన’కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. – సాక్షి,సిటీబ్యూరో సామాజిక మార్పులకు అనుగుణంగా పుస్తకం సైతం కొత్త పుంతలు తొక్కుతోంది. మానవ సంబంధాల్లో, మార్కెట్ సంబంధాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా పుస్తకం స్పందిస్తోంది. కాల్పనిక సాహిత్యం, చారిత్రక గ్రంథాలు అప్పటి తరాన్ని ప్రభావితం చేస్తే.. ఇప్పుడు మేనేజ్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ రంగాలకు చెందిన పుస్తకం లక్షల మెదళ్లకు పదును పెడుతోంది. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థుల కెరీర్కు పుస్తకం కేరాఫ్గా మారింది. అయినప్పటికీ సాహితీ పాఠకుల సంఖ్య ఏ మాత్రం తగ్గలేదు. శ్రీశ్రీ మహాప్రస్థానం చదివి మరో ప్రపంచాన్ని ఆవిష్కరిస్తున్నారు. కన్యాశుల్కంలో గిరీశం గిలిగింతలు చూస్తున్నారు. బుచ్చిబాబు ‘చివరకు మిగిలేది’లో ఏముందో తెలుసుకుంటున్నారు. ‘అసమర్ధుని జీవయాత్ర’లోని సాహిత్య సమర్థతను అంచానా వేస్తున్నారు. ప్రతి ఇంటినీ బుల్లితెర ధారావాహికలు ముంచేస్తున్నా.. అక్షరం విలువ తెలిసిన పాఠకుడు నవలను ఆదరిస్తున్నాడు. అందుకే తెలుగు, ఇంగ్లిష్ పుస్తక ప్రచురణ సంస్థలు పదుల సంఖ్యలో మనగలుగుతున్నాయి. విశాలాంధ్ర, నవోదయ, హైదరాబాద్ బుక్ ట్రస్ట్, ఎమెస్కో వంటి ప్రచురణ సంస్థలు దశాబ్ధాలుగా వివిధ రంగాల పుస్తకాలను ప్రచురిస్తుండగా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్, ఓరియంట్ బ్లాక్స్వాన్, కేంబ్రిడ్జి, పియర్సన్, టాటా మెగ్రాహిల్ వంటి పబ్లికేషన్స్ మాధ్యమిక, ఉన్నత విద్యారంగానికి చెందిన ప్రామాణిక పుస్తకాలను ముద్రిస్తూ పాఠకలోకానికి చేరవయ్యాయి. ఓరియంట్ లాంజ్ఞన్, ఇండియా బుక్హౌస్ వంటి సంస్థలు అనేక విలువైన పుస్తకాలను అందజేస్తూనే ఉన్నాయి. రూప పబ్లిషర్స్ నుంచి వచ్చే చేతన్ బగత్, రస్కిన్బాండ్ వంటి రచయితల పుస్తకాల కోసం జిజ్ఞాసాపరులు ఎదురు చూస్తుంటారు. చేతన్ భగత్ ‘టు స్టేట్స్’, ‘త్రీ మిస్టేక్స్ ఆఫ్ మైలైఫ్’, ‘ఫైవ్ పాయింట్ సమ్ వన్’, ‘వాట్ యంగ్ ఇండియా’, ‘రెవల్యూషన్ 2020’ వంటి గ్రంథాలు ఇప్పటికీ హాట్కేకులే. రస్కిన్బాండ్ ‘చిల్డ్రన్స్ ఓమ్ని బస్’, గ్రేట్ స్టోరీ ఫర్ చిల్డ్రెన్’, ‘స్కూల్ డేస్ స్కూల్ టైమ్స్’ వంటి పిల్లల పుస్తకాలకు ఎంతో క్రేజ్ ఉంది. ఇక విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ‘గీతాంజలి’ ఇప్పటికీ పాఠకుడి మనసు దోచుకుంటూనే ఉంది. పిల్లల కామిక్స్ సైతం విపరీతంగా అమ్ముడవుతున్నాయి. ఆంగ్ల గ్రంథాలు, బిజినెస్, మేనేజ్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కాంపిటీటివ్ పుస్తకాలే కాదు.. తెలుగు సాహితీ గ్రంథాలకు కూడా అద్భుత ఆదరణ ఉంది. మహాకవి శ్రీశ్రీ రాసిన ‘మహాప్రస్థానం’ 1954 నుంచి ఇప్పటి వరకు 33 సార్లు ముద్రించారు. ఈ పుస్తకం నగరంలో ప్రతిరోజు కనీసం 200 కాపీలు అమ్ముడవుతూనే ఉంది. తస్లీమా నస్రీన్ ‘లజ్జ’ నవల, తాపీ ధర్మారావు ‘పెళ్లి–దాని పుట్టుపూర్వోత్తరాలు’, దాశరథి కృష్ణమాచార్య, దాశరథి రంగాచార్యల సాహిత్యం, ముళ్లపూడి రచనలు, తిలక్ ‘అమృతం కురిసిన రాత్రి’ ,పెద్దిభొట్ల, మధురాంతకం రాజారాం వంటి ప్రముఖ రచయితల కథల పుస్తకాలు, మనస్తత్వ గ్రంథాలు, తెలుగు సినిమా సాహిత్యం, బాపు కార్టూన్లు, వట్టికోట ఆళ్వారుస్వామి ‘మట్టి మనిషి’, ‘గంగు’నవలల కోసం పాఠకులు వెతికి మరీ చదువుతున్నారు. అంతేనా.. మేనేజ్మెంట్ గురించి తెలుసుకునేవారు కూడా రామాయణం. మహాభారతాన్ని చదువుతున్నారు. ఆనాటి పరిస్థితులనునేటి స్థితిగతులకు అన్వయిస్తూ.. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను అంచనా వేస్తున్నారు. అందుకే జీవిత సత్యాలను చెప్పే ఈ మహాగ్రంథాలు ప్రతి కార్పొరేట్ కార్యాలయంలో కొలువుదీరుతున్నాయి. 15 నుంచి హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఎన్టీఆర్ స్టేడియంలో ఈనెల 15న 30వ ‘హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్’ ప్రారంభమవుతుందని బుక్ ఫెయిర్ కన్వీనర్ డాక్టర్ ఎస్.రఘు, కార్యదర్శి చంద్రమోహన్ తెలిపారు. 16 నుంచి 10 రోజుల పాటు సాహిత్య కార్యక్రమాలు ఉంటాయన్నారు. ముఖ్య అతిథిగా తెలుగు విశ్వవిద్యాలయం వైస్స్ చాన్సలర్ డాక్టర్ ఎస్వీ సత్యనారాయణ హాజరవుతారన్నారు. తెలుగు సాహిత్యంలోని ధోరణులు, అస్తిత్వ ఉద్యమాలు, రచయితల పాత్ర, కథ, నవల, వచన కవిత–పరిణామ వికాసాలు, ఉద్యమాలు–పాట ప్రభావం, తెలంగాణ సినిమా, అభ్యుదయ సాహిత్యం, స్త్రీవాద సాహిత్యం, బాలసాహిత్యం తదితర అంశాలపై సాహితీవేత్తలతో ప్రసంగాలు ఉంటాయని వివరించారు. మహాశ్వేతాదేవి సాహిత్య ప్రాంగణాన్ని తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా‡వెంకటేశం, గూడ అంజన్న ప్రాంగణాన్ని డాక్టర్ కె.వి.రమణాచారి ప్రారంభిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎన్.గోపి. నందిని సిధారెడ్డి, అమ్మంగి వేణుగోపాల్, ఎం.వేదకుమార్, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, ముదిగంటి సుజాతరెడ్డి, యాకూబ్, సుద్దాల అశోక్తేజ, భూపాల్, ఏలె లక్ష్మణ్ వంటి సాహితీవేత్తలు పాల్గొంటారని తెలిపారు. – సుందరయ్య విజ్ఞానకేంద్రం 280 స్టాళ్లతో ప్రదర్శన.. వైవిధ్యభరితమైన భాగ్యనగర సంస్కృతిని, విభిన్న జీవన శైలులను సమున్నతంగా ఆవిష్కరించే వివిధ భాషల పుస్తకాలకు ‘హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన’ మరోసారి వేదిక కానుంది. ఈనెల 15 నుంచి 26వ తేదీ వరకు జరుగనున్న ఈ వేడుకలో 280 స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8.30 వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుంది. విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. శని,ఆది వారాల్లో మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సహకారంతో హైదరాబాద్ పుస్తక ప్రదర్శణ కమిటీ ఈ ప్రదర్శనను నిర్వహిస్తోంది. -
రెండొందల పుస్తకాలు రాసినా.. నిరుపేదే..!!
-
ఆప్ కే లియే..
ఈసారి హైదరాబాద్ బుక్ ఫెయిర్ తన పుటలో ఒక కొత్త అంశానికి చోటిచ్చింది! అదే ‘అనగనగా’ యాప్! దీని రూపకర్త మార్టిన్! వృత్తిరీత్యా మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ విభాగంలో ఉద్యోగి.. ప్రవృత్తిరీత్యా సోషియో సైకాలజిస్ట్!. ఆ కథేమిటంటే.. - సరస్వతి రమ కొన్నాళ్ల కిందట మార్టిన్ డిప్యూటేషన్పై మినిస్టర్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్లో విధులు నిర్వహించారు. అందులో భాగంగా కొంతకాలం వేరే దేశాల్లోని ఇండియన్ ఎంబసీలలో పనిచేశారు. సోషియో సైకాలజిస్ట్ కూడా కాబట్టి ఆ జిజ్ఞాసతో ప్రవాసాంధ్రుల జీవనశైలిని గమనించారు. ఆ స్టడీలో పిల్లలకు కథలు చెప్పే ప్రక్రియ అంతరించిపోయిందని తేలింది. టెక్నాలజీ మాయలో పడ్డ ఈ తరం చదవడాన్ని మరిచిపోయింది. వాళ్లే చదవనప్పుడు వాళ్ల పిల్లలకేం చెప్తారు?. అందరూ కంప్యూటర్ గేమ్స్కి పరిమితమైపోయారు. ఇదే టెక్నాలజీ, ఈ తరం అలవాట్లనూ ఉపయోగించుకొని కథలు చెప్పే కళను పునరుద్ధరించాలనుకున్నారు. అందుకే ‘ఈ యాప్ పిల్లలకన్నా తల్లిదండ్రులకే ఎక్కువ ఉపయోగం’ అంటారు మార్టిన్. ‘వాళ్లకు కథలు తెలిస్తేనే కదా పిల్లలకు చెప్పగలుగుతారు’ అనేది ఆయన లాజిక్!. ముందుకెలా వెళ్లిందంటే.. ‘చాలామంది తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే.. పిల్లలకు కావల్సిన భోజనం పెట్టడం, వాళ్లడిగిన ఆట వస్తువులు, గాడ్జెట్స్ తెచ్చివ్వడం, పిల్లలతో కలిసి టీవీ చూడ్డం, సినిమాకెళ్లడం.. ఇవన్నీ చేస్తే పిల్లలతో మీనింగ్ ఫుల్ టైమ్ గడిపినట్టే అని!. కానీ క్వాలిటీ టైమ్ ఇవ్వడమంటే అదికాదుకదా.. మన సంస్కృతి, మన భాష, మన కళలు, మన కథలు.. ఇలా మన పూర్తి నేటివిటీని పిల్లలకు అందిస్తేనే మనం వాళ్లకు మేలు చేస్తున్నట్టు’ అంటారు మార్టిన్. అందులో కథలు చాలా ముఖ్యమైనవి. పిల్లలకు మనం కథలు చెప్తున్నామంటేనే జీవించడం నేర్పుతున్నామన్న మాట అని ఆయన అంటారు. ఆ కథలను నీతుల మోతతో బరువెక్కనీయకుండా ఈ కాలానికనుగుణంగా క్లుప్తంగా, తిన్నగా, ఉన్నది ఉన్నట్టు చెప్పగలిగితే చాలు. టెక్నికల్ టూల్స్ మన కమ్యూనికేషన్ను ఈజీ చేసేసి ఊహాశక్తిని తగ్గిస్తున్నాయి. కాబట్టి ఆ ఊహాశక్తిని కాస్త పెంచేలా కథలు చెప్పే విధానాన్ని మలుచుకుంటే మంచిది. ఆ రకమైన స్టోరీ టెల్లింగ్ను పేరెంట్స్ దగ్గర ప్రమోట్ చేయాలి అని ఓ నిశ్చయానికి వచ్చి ఆ ఆలోచనను ముగ్గురి స్నేహితులతో పంచుకున్నాడు. వాళ్లూ ఉత్సాహంగా ఓకే అన్నారు. ఫస్ట్భెల్.. నలుగురూ కలిసి ‘ఫస్ట్ భెల్ టీమ్’గా ఏర్పడ్డారు. ‘స్కూల్లో పిల్లలు లాస్ట్ భెల్కి హుషారుగా, ఫస్ట్భెల్కి నీరసంగా ఉంటారు. అలాకాక మా కథల కోసం ఫస్ట్భెల్నూ అంత ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో ఆ పేరుపెట్టాం’ అంటారు మార్టిన్. యాప్ కోసం కావల్సిన డబ్బుని తమకొచ్చే జీతంలోంచే కొంత తీసి పక్కన పెట్టసాగారు. ఈ నలుగురి స్నేహితుల్లో మార్టిన్ సహా ముగ్గురు ఇంతకుముందే కొన్ని కథలు రాశారు కూడా. ఆ అనుభవంతో పాతకథలన్నీ పోగుచేశారు. అందులోంచి కొన్ని ఎంచుకొని తెలుగు నేటివిటీకి అనుగుణమైన 20 ఎలిమెంట్లు ఉండేలా రీరైట్ చేశారు. ఒక్కో కథ నాలుగు నిమిషాల నిడివి ఉండేలా 300 కథలను రాసుకున్నారు. మళ్లీ వాటిలోంచి తుదిగా 120 కథలను ఎంచారు. పేదరాశి పెద్దమ్మ, విక్రమ్భేతాళ, పంచతంత్ర, వెర్రి వెంగళప్ప, జానపద కథలు.. ఇలా 12 విభాగాలుగా చేసి విభాగానికి పది చొప్పున ఆడియో రికార్డింగ్ చేయించారు. ఆడిషన్స్కి ఆడియన్స్నూ పిలిచి ఎవరిచేత ఏ కథను చెప్పిస్తే బాగుంటుందో వాళ్ల సలహా, సూచనలతో ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్లతో ఆయా కథలను చెప్పించారు. ఈ కాన్సెప్ట్నంతా తీసుకొని తనికెళ్ల భరణి దగ్గరకు వెళ్లారు. ఆయన ఈ ప్రాజెక్ట్కి పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇవ్వడమే కాదు పన్నెండు విభాగాల ముందుమాటకు తన గొంతునిచ్చారు. అయితే, తమ కాన్సెప్ట్ను ప్రయోగవంతంగా నిరూపించుకోవడానికి భిన్నరంగాల్లోని పది కుటుంబాలను ఎంచుకున్నారు. ఇందులో రాజీవ్ కనకాల, సుమ దంపతులూ ఉన్నారు. రికార్డ్ చేసిన కథలను ఈ పది కుటుంబాలకు వినిపించి వాళ్ల అభిప్రాయాలు తీసుకోవడం, వాటికనుగుణంగా మార్పులు చేర్పులు చేయడం.. ఇలా ఈ కాన్సెప్ట్ యాప్ రూపంలోకి రావడానికి ఏడాదిన్నర పట్టిందట మార్టిన్ వాళ్ల టీమ్కి. అనగనగా.. మొత్తానికి ఫస్ట్భెల్ కథలు ‘అనగనగా’ పేరుతో మొన్న అక్టోబర్లో యాప్లోకి ఒదిగిపోయాయి. ‘ఫోర్త్ లార్జెస్ట్ డౌన్లోడెడ్ ఇన్ ఇండియన్ యాప్స్. ఫైవ్ రేటింగ్ ఐఓఎస్, ఫైవ్ రేటింగ్ ఇన్ ఆండ్రాయిడ్ అండ్ ఫైవ్ రేటింగ్ ఇన్ విండోస్. ఇంత పెద్ద కంటెంట్ ఇచ్చిన యాప్ వరల్డ్లోనే లేదు. మాదే ఫస్ట్. ఇంకా కొంతమంది పేరెంట్స్ కోరిక మేరకు ఇందులో పరమానందయ్య శిష్యులు, తెనాలి రామకృష్ణ కథలనూ ఈ యాప్కి యాడ్ చేయబోతున్నాం. పిల్లల మొహంలో చిరునవ్వు, తద్వారా కుటుంబాల్లో ఆనందం తేవడమే తమ యాప్ ముఖ్య లక్ష్యం’ అంటూ ‘అనగనగా యాప్’ కథను ముగించారు మార్టిన్. అన్నట్టు పిల్లలకో గుడ్న్యూస్.. ఫిజిక్స్ సబ్జెక్ట్ అంటే పిల్లల్లో ఒక రకమైన భయం ఉంటుంది. దాన్ని పోగొట్టడానికి ఫిజిక్స్ సబ్జెక్ట్నంతా గేమ్ రూపంలో మార్చి ‘ఫిజ్వార్స్’ అనే యాప్నూ రూపొందించబోతోందీ టీమ్. -
ప్రపంచ ముఖచిత్రం పుస్తకం
సందర్భం పుస్తకాలు జ్ఞాన నిక్షిప్త కేంద్రా లు. పుస్తకాల్లోనే ప్రపంచం పొదిగి ఉంటుంది. పుస్తకాల్లో పండే జ్ఞానపు పంటలు కొత్త సమాజాలను నిర్మిస్తాయి. వంద తుపాకులను చూసినా వెనకడుగు వేయని నియంత లు సైతం ఒక్క సిరాచుక్కను చూస్తే భయంతో వెనుదిరు గుతారు. ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్ల కదలిక అన్నది అక్షర సత్యమని మరువరాదు. పుస్తకాల సమ్మేళనమంటే ప్రపం చంలోని దేశదేశాల సమ్మేళనంలాగా ఉంటుంది. ఒక ప్రాంతాన్ని చూడాలన్నా ఆ ప్రాంతం సర్వసమగ్రరూపం, సాహిత్య సాంస్కృతిక, రాజకీయ, సామాజిక రంగాలను అవగతం చేసుకునే జ్ఞానకేంద్రం పుస్తకం. ప్రపంచమంతా పరిణామక్రమంలో ఎలా పురోగమి స్తూ ముందుకు సాగిందో తెలియజేసే సాధనం పుస్తకం. అందుకే పుస్తకం మనచేతిలో ఉంటే ప్రపంచమంతా మన చేతుల్లో ఉన్నట్లుగానే భావించాలి. చరిత్రను చదువుకుని వర్తమానంలో నిలిచి భవిష్యత్తుకు ముందుకు అడుగులు వేసేందుకు ఒక వంతెనలాంటిది పుస్తకం. అందుకే ప్రపం చాన్ని వెతుక్కుంటూ పోయిన వాళ్ల దారులన్నీ పుస్తకాల నుంచే మొదలయ్యాయి. పుస్తకం ఒక బోధి చెట్టు. పుస్తకం ఒక సమాజ వ్యవస్థ. పుస్తకం ఎగిసిపడే పోరాటాల అలల నది. పుస్తకం ప్రపంచ ముఖచిత్రం. పుస్తకం సర్వస్వం. అందుకే మనందరం పుస్తకాలమవుదాం. మనదేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పుస్తకాలను చదువుకుంటూ ప్రపంచాన్ని చదువుకున్నవా డు. నెహ్రూ పుస్తక ప్రియుడు. అందుకే తన ఆలోచనతో నేషనల్ బుక్ట్రస్టును ప్రారంభించారు. ఆ వారసత్వంతో నే ఇప్పటి వరకు నేషనల్ బుక్ట్రస్ట్ అన్ని ప్రాంతీయ భాషల్లో అనేక విలువైన పుస్తకాలను దేశానికి అందిం చింది. నెహ్రూ ఆలోచనా మార్గంలో నాటి నుంటి నేటి వరకు నేషనల్ బుక్ట్రస్టు వేలాది విలువైన పుస్తకాలను చరిత్రకు అందించింది. కేంద్ర ప్రభుత్వం, నేషనల్ బుక్ ట్రస్టు తరపున ఢిల్లీలోని ప్రగతి మైదానంలో ప్రతి రెండు సంవత్సరాలకొకసారి ‘‘వరల్డ్ బుక్ ఫెయిర్’’ జరుగు తుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రాంతీయ భాషలు, భారతీ య భాషలు, దేశదేశాల భాషలకు చెందిన పుస్తకాలు ఈ బుక్ ఫెయిర్లో లభిస్తాయి. ఇతర భాషల్లోకి వెళ్లే వారికి కాపీరైట్స్కు సంబంధించిన లావాదేవీలు ఈ వరల్డ్బుక్ ఫెయిర్లో విస్తృతంగా జరుగుతాయి. రచయితల ప్రచుర ణలకు, ప్రచురణకర్తలకు కాపీరైట్స్ అమ్మకాలకు, వరల్డ్ బుక్ ఫెయిర్ వేదికగా ఢిల్లీ బుక్ఫెయిర్ నిలుస్తుంది. ఈ వరల్డ్ బుక్ ఫెయిర్ దృక్పథం నుంచే మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో నేషనల్ బుక్ట్రస్ట్ దేశ వ్యాప్తంగా బుక్ ఫెయిర్లు నిర్వహిస్తుంది. నేషనల్ బుక్ ట్రస్ట్(ఎన్బీటీ) ప్రతి సంవత్సరం రెండు నుంచి మూడు రాష్ట్రాలను ఎంపిక చేసుకొని జాతీ య పుస్తక ప్రదర్శనలను ఏర్పాటు చేస్తూ ఉంది. ఇదే కాకుండా ప్రాంతీయ జిల్లాస్థాయిల వరకు ఈ పుస్తక ప్రదర్శనలు నిర్వహిస్తుంది. కొత్త పుస్తకాలు తేవటం, అచ్చు వేయటం, కొత్త రచయితలు విస్తృతంగా రాసుకునే అవకాశం ఎన్బీటీ కల్పిస్తుంది. దేశవ్యాప్తంగా మానవ వనరులశాఖ ఆధ్వర్యంలో నేషనల్ బుక్ ఫెయిర్ నిర్వహి స్తున్నట్లుగా తెలుగు రచయితలకు, ప్రచురణకర్తలకు ప్రోత్సాహకరంగా ఉండేందుకు తెలంగాణ భాషాభివృద్ధి, నిఘంటువుల నిర్మాణం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం ‘‘తెలుగు బుక్ట్రస్ట్’’ను రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేస్తే బావుంటుంది. ఇప్పటి వరకు హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఆధ్వర్యంలో 28 బుక్ ఫెయిర్లు జరిగాయి. ఈ ఏడాది 29వ బుక్ ఫెయిర్ హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో డిసెంబర్ 17 నుంచి 26వ తేదీ వరకు జరు గుతుంది. ప్రాంతీయ భాషల సమాహారంగా హైదరాబా ద్ విలసిల్లుతుంది. పలు భాషలు, భిన్న సంస్కృతులు, భిన్న నాగరికతలను తన కడుపులో దాచుకున్న పలు భాషల తల్లిగా హైదరాబాద్ నగరం నిలిచింది. 14, 15 శాతాబ్దాల నుంచి బహుభాషల రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్ నిలిచింది. కులీకుతుబ్షా హైదరాబాద్ నగరాన్ని నిర్మిస్తూ సముద్రంలో చేపలు ఎలా నిండుతాయో హైదరాబాద్ నగరం కూడా ప్రజలతో నిండిపోవాలని ఈ నగర నిర్మాణం ప్రారంభించారు. దేశంలో ఎన్ని భాషలున్నాయో అవన్నీ హైదరాబాద్ నగర పునాదుల్లో ఉన్నాయి. దేశ భాషలన్నింటికీ హైదరాబాద్ కేంద్రంగా ఉంది. ఇప్పుడు తెలంగాణ భాషతో, తెలం గాణ జీవన సంస్కృతి ఉట్టిపడే విధంగా తెలంగాణ రాష్ట్రం లో తొలిసారిగా ఈ బుక్ఫెయిర్ జరగబోతుంది. భిన్న భాషా సంస్కృతులను తనలో ఇముడ్చుకున్న రాష్ట్రం ఏదంటే అది ఒక తెలంగాణ రాష్ట్రం మాత్రమేనని సగ ర్వంగా చెప్పుకోవాలి. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత జరుగుతున్న తొలి పుస్తకాల పండుగగా 2014 బుక్ ఫెయిర్ నిలుస్తుంది. ఈసారి జరిగే బుక్ ఫెయిర్ ముఖద్వారం తెలంగాణ వైతాళికులతో రూపు దిద్దుకుం టుంది. తెలంగాణ సాహిత్య, సాంస్కృతికరంగానికి దిశా నిర్దేశం చేసిన వైతాళికులతో ఈ బుక్ఫెయిర్ ద్వారం నిర్మించబడుతుంది. బుక్ ఫెయిర్ లోపల జరిగే సాహిత్య సాంస్కృతిక వేదిక నవల, కథ, రచయిత, ఆంధ్ర మహా సభ, నాయకులు, తెలంగాణ పోరాటాల్లో భాగస్వామి అయిన వట్టికోట ఆళ్వారుస్వామి, బండి యాదగిరిల పేరుతో రూపుదిద్దుకుంటుంది. 1938లోనే దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించి 1961 వరకు వట్టికోట పుస్తకాల ను వేశారు. పుస్తక సంస్కృతిని పెంపొందించేందుకు ఈ బుక్ ఫెయిర్ను తీర్చిదిద్దాలని నిర్వాహకులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. పేరుపడ్డ పబ్లికేషన్స్ మూడు రోజు లకొక పుస్తకాన్ని వెలువరిస్తున్నాయి. అలాగే స్వతంత్రంగా ఎందరెందరో రచయితలు పుస్తకాలు వేస్తున్నారు. ఈ లెక్కన తెలంగాణ రాష్ట్రంలో సంవత్స రానికి వేయికి పైగా పుస్తకా లు వెలువడుతున్నాయి. ఈ పుస్తక ప్రదర్శనను తిలకిం చేందుకు లక్షలాది మంది హాజరవుతున్నారు. దేశంలో ఢిల్లీ, కలకత్తా, తర్వాత జరిగే అతిపెద్ద పుస్తక ప్రదర్శనగా హైదరాబాద్ బుక్ ఫెయిర్కు స్థానముంది. దేశంలోనే బుద్ధిజీవులందరికీ ఈ పుస్తక ప్రదర్శన కేంద్రంగా నిలుస్తుంది. పుస్తక సంస్కృతిని విస్తృతపరిస్తే అది విశ్వ కల్యాణానికి దోహదపడుతుంది. మంచి సమాజాన్ని నిర్మించటానికి మనందరం కలిసి అడుగులు వేద్దాం. కొత్త సమాజ నిర్మాణానికి పునాదులు వేసేందుకు కొత్త తరాన్ని తయారు చేసేందుకు మనందరం పుస్తకాలమవుదాం పదండి. పుస్తకమే ప్రపంచమని ప్రపంచానికి చాటి చెబుదాం. (ఈ నెల 17 నుంచి 26 వరకు హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో 2014 బుక్ఫెయిర్ సందర్భంగా) వ్యాసకర్త కవి, సీనియర్ జర్నలిస్ట్