
డిసెంబర్ 22వ తేదీ నుంచి జనవరి 1 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ పుస్తక ప్రదర్శనను నిర్వహించనున్నారు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత హైదరాబాద్ బుక్ ఫెయిర్ జాతీయ స్థాయి పుస్తక ప్రదర్శనగా ఎదిగిందని సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ఈనెల 22వ తేదీ నుంచి జనవరి 1 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ పుస్తక ప్రదర్శనను నిర్వహించనున్నట్లు తెలిపారు.
హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, మాజీ మంత్రి జోగు రామన్న, బుక్ ఫెయిర్ ఉపాధ్యక్షుడు కోయ చంద్రమోహన్ తదితరులు మంగళవారం మంత్రిని కలిశారు. పుస్తక ప్రదర్శనకు తెలంగాణ కళా భారతి (ఎన్టీఆర్) స్టేడియంలో అనుమతివ్వాల్సిందిగా కోరారు. ఈ మేరకు మంత్రి ఉత్తర్వులు జారీచేశారు.
అనంతరం శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ 35 ఏళ్లుగా హైదరాబాద్ బుక్ ఫెయిర్ నిర్వహించడం అభినందనీయమన్నారు. అన్ని భాషల పుస్తకాలతో పాటు తెలుగు భాషా సంస్కృతి, తెలంగాణ చరిత్రకు సంబంధించిన పుస్తకాలు, దేశవ్యాప్తంగా 300 లకుపైగా పబ్లిషర్స్ రావడంతో ఇది జాతీయ పుస్తక ప్రదర్శనగా మారిందని తెలిపారు. (క్లిక్ చేయండి: ‘తానా’ అంతర్జాతీయ కార్టూన్ పోటీ.. విజేతలకు రూ. లక్ష నగదు)