నేటి నుంచి పుస్తక ప్రదర్శన | 37th Hyderabad Book Fair kicks off today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి పుస్తక ప్రదర్శన

Dec 19 2024 9:16 AM | Updated on Dec 19 2024 9:16 AM

37th Hyderabad Book Fair kicks off today

అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న నిర్వాహకులు 

కవాడిగూడ: హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ ఆధ్వర్యంలో 37వ జాతీయ పుస్తక ప్రదర్శన గురువారం సాయంత్రం ఎనీ్టఆర్‌ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఈ నెల 29 వరకు ఇది కొనసాగనుంది. బుధవారం హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ అధ్యక్షుడు యాకూబ్,  కార్యదర్శి ఆర్‌.శ్రీనివాస్‌ విలేకరులతో ఇక్కడ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 210 మందికి పైగా ప్రచురణకర్తలు, డిస్ట్రిబ్యూటర్లు పుస్తకాలను ప్రదర్శించనున్నారని తెలిపారు. ప్రతి ఇంటిలో పుస్తకం ఉండే లక్ష్యంతో బుక్‌ ఫెయిర్‌ను ముందుకు తీసుకువెళ్తామన్నారు. 36 ఏళ్ల క్రితం 30 స్టాళ్లతో ప్రారంభమై పుస్తక ప్రదర్శన ప్రస్తుతం 350 స్టాళ్లతో  సాహితీ అభిమానులను, పుస్తక ప్రేమికులను ఆకట్టుకోనుందని తెలిపారు.  బాల సాహిత్యానికి ప్రాధాన్యమిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.  

విద్యార్థులకు ప్రవేశం ఉచితం..   
పుస్తక ప్రదర్శనలో పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు వారి ఐడీ కార్డులు చూపించి ఉచిత ప్రవేశం పొందవచ్చని తెలిపారు.  

ఉచిత ఆరోగ్య శిబిరం.. నోరూరించే వంటకం  
తెలంగాణ రుచులతో ప్రత్యేక ఫుడ్‌ స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బుక్‌ఫెయిర్‌ సందర్శకుల కోసం ఈ ఏడాది ఉచిత ఆరోగ్య శిబిరంతో పాటు రెండు వీల్‌ చైర్లను అందుబాటులో ఉంచుతామన్నారు.   

సాంస్కృతిక ప్రదర్శనలు..   
ప్రతిరోజూ సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. సమావేశంలో తెలుగు భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ, బుక్‌ఫెయిర్‌ ఉపాధ్యక్షులు శోభన్‌బాబు, బాల్‌రెడ్డి, ట్రెజరర్‌ నారాయణరెడ్డి, జాయింట్‌ సెక్రటరీ సూరిబాబు, కె.సురేష్‌ పాల్గొన్నారు.  

 

Advertisement
 
Advertisement
Advertisement