
తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేడు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీవారి తరఫున సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనుల వారు ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు.

అనంతరం అంకురార్పణ కార్యక్రమాల్లో భాగంగా ఆలయంలోని యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటారు. వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టాన్ని నిర్వహించారు.

బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలలోని పలు ప్రాంతాలను విద్యుద్దీపాల అలంకరణలతో కళ్లుమిరిమిట్లు గొలిపేలా తీర్చిదిద్దారు. అక్టోబర్ 2 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
















