డప్పుచప్పుళ్ల మోతలు.. పోతురాజుల విన్యాసాలు.. శివసత్తుల పూనకాలు.. చిన్నారుల కేరింతల మధ్య.. మట్టికుండల్లో నైవేద్యాలు నెత్తిన పెట్టుకొని ఊరేగింపుగా అమ్మవార్ల ఆలయాలకు తరలివచ్చిన మహిళలతో పాలమూరు పరవశించింది.
ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని మంగళవారం జిల్లాకేంద్రంతోపాటు గ్రామ గ్రామాన బోనాల పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు.
అమ్మవార్లకు కోళ్లు, పొట్టేళ్లు బలి ఇచ్చి.. పచ్చిపులుసు, అన్నంతో నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు బాగా పండాలని, పిల్లాపాపలు సుఖసంతోషాలతో ఉండాలని మొక్కుకున్నారు.
ఈ క్రమంలోనే పలు ప్రధాన ఆలయాలకు ప్రజాప్రతినిధులు, నాయకులు చేరుకుని ప్రజలతో కలిసి వేడుకలు జరుపుకొన్నారు.


