అసెంబ్లీ వద్ద యువకుడి ఆత్మాహుతియత్నం | youth tries to immolate self at assembly gate | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ వద్ద యువకుడి ఆత్మాహుతియత్నం

Sep 30 2015 11:59 AM | Updated on Aug 11 2018 6:42 PM

అసెంబ్లీ వద్ద యువకుడి ఆత్మాహుతియత్నం - Sakshi

అసెంబ్లీ వద్ద యువకుడి ఆత్మాహుతియత్నం

వరంగల్ జిల్లా తాడ్వాయి ఎన్కౌంటర్ను నిరసిస్తూ ప్రజాసంఘాలు చేపట్టిన చలో అసెంబ్లీలో ఓ యువకుడు అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద ఆత్మాహుతియత్నం చేశాడు.

వరంగల్ జిల్లా తాడ్వాయి ఎన్కౌంటర్ను నిరసిస్తూ ప్రజాసంఘాలు చేపట్టిన చలో అసెంబ్లీలో ఓ యువకుడు అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద ఆత్మాహుతియత్నం చేశాడు. పౌర హక్కుల సంఘాలకు చెందిన రాజ్కుమార్ అనే యువకుడు పెట్రోలు పోసుకుని, నిప్పు అంటించుకునే ప్రయత్నం చేస్తుండగా మీడియా ప్రతినిధులు, పోలీసులు గుర్తించి వెంటనే అతడి చేతిలోంచి అగ్గిపెట్టె లాగేసుకున్నారు. భగత్ సింగ్ దేశం కోసం త్యాగం చేసినట్లుగా తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని రాజ్ కుమార్ చెప్పాడు.

పోలీసులు ఎంత ప్రయత్నించినా ఆగకుండా.. తాను చచ్చిపోతాననే చెప్పాడు. కాసేపు.. తన పేరు భగత్ సింగ్ అని కూడా అతడు అన్నట్లు తెలుస్తోంది. భ్రష్టుపట్టిన రాజకీయాల నేపథ్యంలోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని రాజ్ కుమార్ అంటున్నాడు. అతడు ఎవరో, ఎక్కడినుంచి వచ్చాడో తెలియలేదు. అతడి మాటలను చూసి, అతడి మానసిక స్థితి ఏంటో కూడా తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.

చలో అసెంబ్లీ పిలుపు నేపథ్యంలో ముందునుంచి పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేసినా, అతడు మాత్రం భద్రతావలయాన్ని ఛేదించుకుని మరీ పెట్రోలు సీసా పట్టుకుని వెళ్లాడు. అసెంబ్లీ మెయిన్ గేటు వద్ద ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు, సీఆర్పీఎఫ్ లాంటి దళాలతో చాలా పటిష్ఠమైన భద్రత ఏర్పాటుచేశారు. డీజీపీ స్థాయి నుంచి కింది స్థాయి వరకు అత్యంత అప్రమత్తంగా ఉన్నారు. అయినా కూడా రాజ్ కుమార్ అసెంబ్లీ గేటుకు కేవలం 50 మీటర్ల దూరంలో ఆత్మహత్యాయత్నం చేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement