
చట్టంలో ఉన్నవన్ని ఇస్తాం: జైట్లీ
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఉన్న హామీలన్నింటిని అమలు చేస్తామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఉన్న హామీలన్నింటిని అమలు చేస్తామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ప్రధానితో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం జైట్లీ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నింటిపైనా చర్చ జరిగిందని, ఏపీకి సంబంధించి నిర్ధిష్ట హామీలు ఆ చట్టంలో ఉన్నాయని తెలిపారు.
చట్టంలో ఉన్న హామీలన్నింటిని అమలుచేయాలని, ఆమేరకు సహకారం అందించాలని ప్రధాని ఆదేశించినట్లు చెప్పారు. ఏపీ అధికారులతో నిరంతర సంప్రదింపులు జరపాలని నీతిఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ను మోదీ కోరినట్లు వివరించారు. హామీల అమలుకు మార్గదర్శక ప్రణాళిక కూడా సిద్ధం చేయాలని, ప్రత్యేక హోదా సాధ్యాసాధ్యాల అవకాశాలపై మాట్లాడినట్లు వివరించారు.