పాకిస్థాన్‌కు అమెరికా స్ట్రాంగ్‌ వార్నింగ్‌! | US warns Pakistan on terrorism | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్‌కు అమెరికా స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

Oct 23 2016 3:08 PM | Updated on Aug 24 2018 7:24 PM

పాకిస్థాన్‌కు అమెరికా స్ట్రాంగ్‌ వార్నింగ్‌! - Sakshi

పాకిస్థాన్‌కు అమెరికా స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్‌ను అమెరికా మరోసారి తీవ్రంగా హెచ్చరించింది.

వాషింగ్టన్‌: ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్‌ను అమెరికా మరోసారి తీవ్రంగా హెచ్చరించింది. ఆ దేశంలోని ఉగ్రవాద నెట్‌వర్క్‌లను నేలమట్టం చేసేందుకు తానే స్వయంగా చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడబోననని తేల్చిచెప్పింది. పాకిస్థాన్‌ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐ (ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్) తమ దేశంలో ఉన్న ఉగ్రవాద గ్రూపులన్నింటిపై చర్యలు తీసుకోవడం లేదని, ఈ నేపథ్యంలో తానే స్వయంగా రంగంలోకి దిగాల్సి రావొచ్చునని తేల్చిచెప్పింది.

'సమస్య ఏమిటంటే పాకిస్థాన్‌ ప్రభుత్వంలో మూడు బలమైన వ్యవస్థలు ఉన్నాయి. ముఖ్యంగా ఐఎస్ఐ.. పాకిస్థాన్‌లో క్రియాశీలంగా ఉన్న ఉగ్రవాద గ్రూపులపై చర్యలు తీసుకోవడానికి అది నిరాకరిస్తున్నది.  కొన్ని ఉగ్రవాద గ్రుపుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నది. వాటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు' అని ఉగ్రవాదానికి ఆర్థిక మద్దతును అడ్డుకునే అంశంలో అండర్‌ సెక్రటరీగా ఉన్న ఆడమ్ జుబిన్ పేర్కొన్నారు. 

వాషింగ్టన్‌ లో జరిగిన ఓ సదస్సులో ఆయన మాట్లాడుతూ 'తమ భూభాగంలోని ఉగ్రవాద నెట్‌వర్క్‌లన్నింటిపైనా కఠినంగా వ్యవహరించమని మేం భాగస్వామి అయిన పాకిస్థాన్‌ను కోరుతూ వస్తున్నాం. వారికి సాయం చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఉగ్రవాదులకు నిధులను అడ్డుకోవడంలో, వారి కార్యకలాపాలు నిలువరించడంలో పాకిస్థాన్‌కు మా సహకారం ఉంటుందనే విషయంలో ఎలాంటి సందేహానికి తావు లేదు. అదే సమయంలో ఈ ఉగ్రవాద నెట్‌వర్క్‌లను ధ్వంసం చేయడానికి అమెరికా స్వయంగా రంగంలోకి దిగడానికి ఏమాత్రం వెనుకాడబోదు' అని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరులో పాకిస్థాన్‌ తమ కీలక భాగస్వామిగా కొనసాగుతుందనే విషయాన్ని స్పష్టం చేస్తూనే.. అవసరమైతే తామే స్వయంగా ఉగ్రవాద గ్రూపుల భరతం పడతామని ఆయన స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement