
దసరాకు ముందే ఉద్యోగులకు వేతనం!
దసరా, బతుకమ్మ పండుగల నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఈనెల జీతం ముందుగానే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.
- సీఎం ఆమోదానికి ఫైలు పంపిన ఆర్థిక శాఖ
సాక్షి, హైదరాబాద్: దసరా, బతుకమ్మ పండుగల నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఈనెల జీతం ముందుగానే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన ఫైలును ఆర్థిక శాఖ సీఎం కె.చంద్రశేఖర్రావుకు పంపించింది.
ప్రతి నెలా 1న ఉద్యోగులకు నెల జీతాలను ప్రభుత్వం చెల్లిస్తుంది. కానీ ఈనెల 29న సద్దుల బతుకమ్మ, 30న దసరా పండుగలు కావటంతో జీతాన్ని ముందుగా చెల్లిస్తే ఉద్యోగులకు పండుగ ఖర్చులకు ఉపయోగపడుతుందనే అభిప్రాయాలున్నాయి. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు సైతం ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాయి. ఆర్థిక శాఖ ప్రతిపాదనలకు సీఎం ఆమోదం లభించిన వెంటనే జీతాల ముందస్తు చెల్లింపుపై స్పష్టత రానుంది.