ఐటీ రంగంలో కృత్రిమ మేధ సృష్టిస్తున్న ప్రకంపనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. నిన్నటివరకు ఉద్యోగాల కోతకే పరిమితమైన ఏఐ ముప్పు.. ఇప్పుడు నేరుగా ఉద్యోగుల వార్షిక వేతన ప్యాకేజీలు, ఇంక్రిమెంట్లపై పడింది. సాంకేతికతను అందిపుచ్చుకునే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ సంస్థలు తమ వ్యాపార శైలిని పూర్తిగా మార్చేస్తున్నాయి. పనులను వేగవంతం చేయడానికి ఏఐపై పెట్టుబడులను భారీగా పెంచుతూ అందుకోసం ఉద్యోగుల జీతాల పెంపునకు బ్రేకులు వేస్తున్నాయి. తాజాగా, గ్లోబల్ క్లౌడ్ సాఫ్ట్వేర్ కంపెనీ ‘టెరాడేటా’ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఐటీ వర్గాల్లో కలకలం రేపుతోంది.
ఏఐ వైపు మళ్లుతున్న నిధులు
ప్రముఖ అంతర్జాతీయ బిజినెస్ జర్నల్ ‘బిజినెస్ ఇన్సైడర్’ నివేదిక ప్రకారం.. టెరాడేటా సంస్థ తన ఉద్యోగుల వార్షిక వేతన పెంపును ఈ ఏడాదికి పూర్తిగా నిలిపివేయాలని (ఫ్రీజ్) నిర్ణయించింది. ఈ బడ్జెట్ను నేరుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులుగా మళ్లించడమే దీనికి ప్రధాన కారణం. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 5,100 మంది ఉద్యోగులపై ప్రభావం పడనుంది. ఈ ఏడాది వార్షిక జీతాల సర్దుబాటు ఉండబోదని కంపెనీ సీఈఓ స్టీవ్ మెక్మిలన్ ఉద్యోగులకు పంపిన ఒక అంతర్గత మెమోలో స్పష్టం చేశారు.
‘మార్కెట్లోకి సరికొత్త ఏఐ ఆవిష్కరణలను తీసుకురావడానికి, ఈ రంగానికి చెందిన నిపుణులను ఆకర్షించడానికి పెద్ద ఎత్తున నిధులు అవసరం. అందుకే ఈ ఏడాది వార్షిక జీతాల బడ్జెట్ను పునసమీక్షించి ఆ నిధులను ఏఐ పెట్టుబడులకు కేటాయిస్తున్నాం’ అని టెరాడేటా సీఈఓ స్టీవ్ మెక్మిలన్ అన్నారు. అయితే, ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు పనితీరు ఆధారిత బోనస్లు, ఈక్విటీ షేర్లను మాత్రం యథావిధిగా అందిస్తామని కంపెనీ పేర్కొంది.
ఇదీ చదవండి: వ్యర్థాల్లో దాగున్న బంగారు అవకాశం!


