ఎస్సీ గురుకులాల్లో వేతన వెతలు | Unpaid Salaries of Teachers in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఎస్సీ గురుకులాల్లో వేతన వెతలు

Jun 21 2026 4:57 AM | Updated on Jun 21 2026 4:57 AM

Unpaid Salaries of Teachers in Andhra Pradesh

1,800 మంది పార్ట్‌ టైం టీచర్లకు రెండు నెలలుగా జీతాల్లేవ్‌ 

కుటుంబ పోషణ కోసం అప్పుల తిప్పలు

సాక్షి, అమరావతి: బీఆర్‌ అంబేడ్కర్‌ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో పనిచేస్తున్న 1,800 మంది పార్ట్‌టైమ్‌ టీచర్లకు వేతన వెతలు తప్పడం లేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఏ నెలలోనూ సమయానికి జీతం ఇచ్చిన దాఖలాలు లేవు. చాలీచాలని వేతనాలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న పార్ట్‌టైమ్‌ టీచర్లకు ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌ మాసాలకు జీతాలు ఇవ్వలేదు. మే నెల గురుకులాల సెలవుల్లో వారికి ఉద్యోగ విరామం ఉంటుంది. మళ్లీ ఈ నెల నుంచి వారి ఉద్యోగాలను ప్రభుత్వం రెగ్యులర్‌ చేయాల్సి ఉంది. ఈ నెల కూడా గడిస్తే వారికి మూడు నెలల వేతన బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. 

ప్రతిసారి ఇదే తంతు కొనసాగడంతో కుటుంబ పోషణ కష్టతరంగా మారుతోందని వారంతా వాపోతు­న్నారు. సకాలంలో వేతనాలు అందకపోవడంతో అప్పులు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సిన దుస్థితి దాపురించిందని చెబుతు­న్నారు. పేరుకు పార్ట్‌టైమ్‌ టీచర్లే అయినా వా­రితో నిబంధనలకు విరుద్ధంగా ఫుల్‌టైమ్‌ పని చేయిస్తూ శ్రమ దోపిడీ చేస్తున్నారు. ఉదయం 7.30 గంటలకు స్కూల్‌ డ్యూటీ మొదలు పెట్టి.. సాయంత్రం 4 గంటల వరకు వారు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కూడా స్టడీ అవర్స్‌ నిర్వహించాలనే ఒత్తిడి వారిపై ఉంది. 

దీనికితోడు రెగ్యులర్‌ స్టాఫ్‌ చేయాల్సిన విద్యార్థుల పర్యవేక్షణ బాధ్య­త, రికార్డుల పరిశీలన కూడా పార్ట్‌టైమ్‌ టీచర్ల నెత్తినే పడింది. ఇంత చేసినా.. నెలనెలా అందరితోపాటు సకాలంలో జీతాలు అందక ఇబ్బ­ందులు తప్పడం లేదని వాపోతున్నారు. స్కూ­ళ్లు, కాలేజీలు తెరిచిన ఈ సమయంలో పిల్లల చదువులకు ఫీజులు, పుస్తకాలు తదితర ఖర్చులకు అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే వారు పడే అవస్థలు అన్నీఇన్నీ కాదు. ప్రభు­త్వం స్పందించి పెండింగ్‌ జీతాలు విడుదల చేసి ఆదుకోవాలని వారంతా కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement