
కాంగ్రెస్ నేతల అరెస్టులు దుర్మార్గం: ఉత్తమ్
ప్రధానమంత్రి పర్యటిస్తున్న సమయంలో కాంగ్రెస్ నేతలను అరెస్టు చేయడం దుర్మార్గమని ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు.
హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటయిన తర్వాత తొలిసారిగా ప్రధానమంత్రి పర్యటిస్తున్న సమయంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలను అరెస్టు చేయడం దుర్మార్గమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడమేకాక హౌస్ అరెస్ట్లు చేయడంతో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ఆయన విమర్శించారు.
ప్రధాని పర్యటన సందర్భంగా సుహృద్భావ వాతావరణం నెలకొల్పాల్సిందిపోయి, నిర్బంధకాండ కొనసాగించడం సరికాదని, తెలంగాణలో కనీస హక్కులు లేకుండా ఫాసిస్టు పాలన కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రధాని రాష్ట్రంలో జరుగుతున్న సర్కారు అణచివేత పై కూడా దృష్టి సారించాలని ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఉత్తమ్ పేర్కొన్నారు.