
షి జిన్పింగ్ పర్యటనపై టిబెటన్ల నిరసన జ్వాల
భారత్లో చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్ పర్యటనపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
న్యూఢిల్లీ: భారత్లో చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్ పర్యటనపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఇక్కడ నివసిస్తున్న టిబెటన్లు ఆయన పర్యటనకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. గత రెండు రోజుల నుంచి టిబెటన్లపై చైనా వైఖరిని ఖండిస్తూ టిబెటన్లు చేసిన నినాదాలు మిన్నంటాయి. శుక్రవారం ఉదయం మూడో రోజు కూడా టిబెటన్లు తీవ్ర నిరసన ప్రదర్శనలతో హోరెత్తించారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మరియ మిగతా ఆ దేశ ప్రతినిధిలు బసచేసిన తాజ్ ప్యాలెస్ హోటల్ వద్ద టిబెటన్లు ఆందోళనకు దిగారు. అక్కడి పరిస్థితి ఉద్రిక్తతలకు దారితీయడంతో 20 మంది నిరసన కారులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
గురువారం కూడా ఇదే పరంపర కొనసాగింది. చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ రాజ్ఘాట్లో మహాత్మాగాంధీ సమాధి వద్ద పుష్పగుచ్చం సమర్పిస్తున్న క్రమంలో ఓ టిబెట్ యువకుడు ఆగ్రహంతో రెచ్చిపోయాడు. టిబెట్ జెండా పట్టుకొని ధౌలాకువా వద్ద ఉన్న టీవీ టవర్పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు.