సహజీవనం: మహిళా టెక్కీతో గొడవపడి..! | Sakshi
Sakshi News home page

సహజీవనం: మహిళా టెక్కీతో గొడవపడి..!

Published Thu, Mar 9 2017 3:33 PM

సహజీవనం: మహిళా టెక్కీతో గొడవపడి..! - Sakshi

సహజీవనం చేస్తూ.. పెళ్లి విషయమై గొడవపడ్డందుకు ఓ 30 ఏళ్ల సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను ఆమె భాగస్వామి గొంతునులిమి చంపాడు. ఈ ఘటన మహారాష్ట్ర థానె జిల్లాలోని బద్లాపూర్‌లో బుధవారం జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం..

నాసిక్‌కు చెందిన పూనం పూన్యకర్‌ గజ్‌బియే గత మూడేళ్లుగా బద్లాపూర్‌లో నివసిస్తోంది. ఆమె ముంబై కన్జుర్‌మార్గ్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగిని... విజయ్‌ సంజయ్‌ ఝార్కడ్‌(22)తో అనే యువకుడితో ఆమె సహజీవనం చేస్తోంది. తమ సహజీవనం గురించి ఇంట్లో తెలిసిపోయిందని, దీనిని తమ కుటుంబసభ్యులు వ్యతిరేకిస్తున్నారని, కాబట్టి ఇక తమ అనుబంధం కొనసాగబోదని పూనం చెప్పడంతో ఇద్దరి మధ్య బుధవారం రాత్రి గొడవ జరిగింది.

గొడవ పెద్దది కావడంతో క్షణికావేశంలో విజయ్‌ చున్నీతో పూనం గొంతు నులిమి చంపేశాడు. ఆ వెంటనే ఇంటి బయటి నుంచి తలుపు పెట్టి స్నేహితుడి ఇంటికి పరారయ్యాడు. అక్కడ స్నేహితుడికి జరిగిన విషయం చెప్పడంతో అతడు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకొని.. ఆ తర్వాత విజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. బద్లాపూర్‌లోని ఓ మొబైల్‌ రిపేర్‌ షాపులో పూనం, విజయ్‌ను మొదట కలిసింది. కొన్నాళ్లుగా వారిరువురు సహజీవనం చేస్తున్నారు. 'ఆరు నెలల కిందట పూనం కొనుగోలు చేసిన గదిలో ఇద్దరూ కలిసి జీవిస్తున్నారు. రెండేన్నరేళ్లుగా ఇద్దరి మధ్య అనుబంధం కొనసాగుతోంది. ఇటీవల వారి సహజీవనం గురించి పూనం ఇంట్లో తెలిసిందే. దీనిని వారు వ్యతిరేకించడంతో ఈ విషయమై ఇద్దరి మధ్య గత కొన్నిరోజులుగా తరచూ గొడవలు జరిగాయి' అని జోన్‌ 4 డిప్యూటీ కమిషనర్‌ సునీల్‌ భరద్వాజ్‌ తెలిపారు.
 

Advertisement
Advertisement