నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు | Sakshi
Sakshi News home page

నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు

Published Fri, Feb 3 2017 9:48 AM

Sensex, Nifty sluggish in opening; ICICI falls

ముంబై: ఆసియా నుంచి వీస్తున్న సంకేతాలు బలహీనంగా ఉండటంతో ఈక్విటీ బెంచ్​మార్కులు శుక్రవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 36.47 పాయింట్ల నష్టంలో 28,190.14 వద్ద, నిఫ్టీ 12.20  పాయింట్ల నష్టంలో 8722.05 వద్ద ఎంట్రీ ఇచ్చాయి. వచ్చే వారంలో వచ్చే ఆర్బీఐ పాలసీ,  కార్పొరేట్ ఫలితాలపై పెట్టుబడిదారులు ఎక్కువగా ఫోకస్ చేశారు. ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకు, అదానీ పోర్ట్స్, మారుతీ సుజుకీ, ఇండస్ఇండ్ బ్యాంకు మార్నింగ్ ట్రేడ్లో నష్టాలు గడించగా.. యాక్సిస్ బ్యాంకు, ఓఎన్జీసీ, సన్ఫార్మా, గెయిల్, కోల్ ఇండియా, ఐడియా సెల్యులార్, భారతీ ఇన్ఫ్రాటెల్, టాటా పవర్, టెక్ మహింద్రా, అరబిందో ఫార్మా లాభాలు పొందాయి.
 
గురువారం ట్రేడింగ్తో పోలిస్తే శుక్రవారం డాలర్తో రూపాయి మారకం విలువ స్వల్పంగా లాభపడింది. 67.35 వద్ద ప్రారంభమైంది. గ్లోబల్గా డాలర్ బలహీనపడటంతో రూపాయి విలువ పెరుగుతుందని హెచ్డీఎఫ్సీ బ్యాంకు అశుతోష్ రైనా చెప్పారు. నేడు విడుదలయ్యే అమెరికా ఉద్యోగ డేటాపై కూడా మార్కెట్లు ఎక్కువగా దృష్టిసారించాయన్నారు. అనూహ్యంగా బీజింగ్ తన పాలసీని కఠినతరం చేస్తూ స్వల్పకాలిక రేట్లను పెంచడంతో చైనీస్ మార్కెట్లు పడిపోయాయి. దీంతో ఆసియా షేర్లలో ఆందోళన నెలకొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపడుతున్న కఠినతరమైన పాలసీలపై మార్కెట్లు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి. మరోవైపు ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర అత్యంత స్వల్పంగా 5 రూపాయల లాభంతో 28,875గా ట్రేడవుతోంది. 
 
 
 

Advertisement
Advertisement