మెటల్ షేర్లలో కొనుగోళ్ల జోరు
ఆసియా మార్కెట్లు ర్యాలీ జరుపుతున్న ప్రభావంతో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లో బ్లూచిప్ షేర్లలో కొనుగోళ్లు జరిగాయి.
ఆసియా మార్కెట్లు ర్యాలీ జరుపుతున్న ప్రభావంతో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లో బ్లూచిప్ షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్ 158 పాయింట్లు పెరిగి 18,946 పాయింట్ల వద్ద ముగిసింది. ఒకదశలో 19,000 పాయింట్ల స్థాయిని అధిగమించి 19,066 పాయింట్ల గరిష్టస్థాయికి ర్యాలీ జరిపినా, ముగింపులో లాభాల స్వీకరణ కారణంగా లాభాల్లో కొంత శాతాన్ని సెన్సెక్స్ కోల్పోయింది. ఇదే బాటలో 5,644 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగిన ఎన్ఎస్ఈ నిఫ్టీ చివరకు 47 పాయింట్ల లాభంతో 5,612 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. సంస్థాగత ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో మెటల్స్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, క్యాపిటల్ గూడ్స్ రంగాలకు చెందిన షేర్లు జోరుగా పెరిగాయి.
మెటల్ షేర్లలో షార్ట్ కవరింగ్...
కొద్ది వారాల నుంచి అదేపనిగా పతనమై, ఐదేళ్ల కనిష్టస్థాయికి తగ్గిన మెటల్ షేర్లలో సోమవారం పెద్ద ఎత్తున షార్ట్ కవరింగ్ జరిగింది. లోహాలను అధికంగా వినియోగించే చైనాలో పారిశ్రామికోత్పత్తి మెరుగుపడుతున్నదన్న వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లో ఇనుప ఖనిజం, రాగి, అల్యూమినియం, జింక్ తదితర లోహాలు గత వారం నుంచి పెరుగుతున్నాయి. ఈ ప్రభావంతో మెటల్ కౌంటర్స్లో సంస్థాగత ఇన్వెస్టర్లు వారి షార్ట్ పొజిషన్లను తగ్గించుకున్నారు. దాంతో జిందాల్ స్టీల్, టాటా స్టీల్ షేర్లు 8-9 శాతం మధ్య ఎగిసాయి. జేఎస్డబ్ల్యూ స్టీల్, సెయిల్, ఎన్ఎండీసీ, హిందాల్కో, స్టెరిలైట్ ఇండస్ట్రీస్, సేసా గోవాలు కూడా 3-6 శాతం మధ్య పెరిగాయి. ప్రముఖ మెటల్ కంపెనీలు టాటా స్టీల్, హిందాల్కోలు వాటి ఆర్థిక ఫలితాల్ని వెల్లడించనున్న నేపథ్యం కూడా ఈ కౌంటర్లలో షార్ట్ కవరింగ్కు పురికొల్పినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.
టాటా స్టీల్ ఫ్యూచర్లో ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) నుంచి ఒక్కసారిగా 23.52 లక్షల షేర్లు (11 శాతం) కట్ అయ్యాయి. అలాగే రూ. 220, రూ. 230, రూ. 240 స్ట్రయిక్స్ వద్ద కాల్ ఆప్షన్స్ నుంచి ఓఐ గణనీయంగా తగ్గడంతో పాటు రూ. 220, 230 స్ట్రయిక్స్ పుట్ ఆప్షన్లలో ఓఐ భారీగా పెరిగింది. జిందాల్ స్టీల్ అండ్ పవర్ ఫ్యూచర్ ఓఐ నుంచి 2.96 లక్షల షేర్లు (3 శాతం), ఎన్ఎండీసీ ఓఐ నుంచి 12.10 లక్షల షేర్లు (7.5 శాతం), హిందాల్కో ఓఐ నుంచి 8.72 లక్షల షేర్ల (3.4 శాతం) చొప్పున ఓఐ కట్ అయ్యింది. షార్ట్ పొజిషన్ అంటే షేరు క్షీణతను అంచనావేస్తూ ఫ్యూచర్ కాంట్రాక్టును విక్రయించడం.
ధర మరింత పెరగవచ్చన్న అంచనాలతో ఇటువంటి పొజిషన్ వున్న కాంట్రాక్టును స్క్వేర్ఆఫ్ చేయడాన్నే షార్ట్ కవరింగ్గా వ్యవహరిస్తారు. విలీన ప్రతిపాదనకు ముంబాయి హై కోర్టు నుంచి గ్రీన్సిగ్నెల్ పొందిన సేసా గోవా, స్టెరిలైట్ ఇండస్ట్రీస్ కౌంటర్లలో భిన్నమైన పొజిషన్లు క్రియేట్ అయ్యాయి. సేసా గోవా ఫ్యూచర్ ఓఐ నుంచి 2 శాతం షేర్లు కట్కాగా, స్టెరిలైట్ ఫ్యూచర్లో 2 శాతం షేర్లు యాడ్ అయ్యాయి. ఈ విలీన ప్రక్రియలో మరో భాగస్వామ్య కంపెనీ కెయిర్న్ ఇండియా ఓఐ నుంచి 3.5 శాతం షేర్లు కట్ అయ్యాయి. ఈ మూడు షేర్లూ క్యాష్ మార్కెట్లో 2 శాతంపైగా పెరగడం విశేషం.