ఢిల్లీలో వెంకన్న దర్శన భాగ్యం


*  శ్రీవేంకటేశ్వర వైభవోత్సవానికి హాజరుకానున్న ప్రధాని

*  నేడు అంకురార్పణ.. హాజరుకానున్న బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ

 సాక్షి, న్యూఢిల్లీ: కలియుగదైవం శ్రీవెంకటేశ్వర వైభవోత్సవానికి శుక్రవారం ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో అంకురార్పణ జరుగనుంది. శుక్రవారం ఉదయం అంకురార్పణతో ప్రారంభమై నవంబర్ 8న జరిగే పుష్పయాగంతో వైభవోత్సవం ముగియనుందని నిర్వాహకులు టీటీడీ, స్వర్ణభారత్ ట్రస్ట్, జీఎంఆర్ ప్రతినిధులు వెల్లడించారు. ఢిల్లీలో గురువారం విలేకరులతో నిర్వాహకులు దీపా వెంకట్, బి.వి.ఎన్.రావు, విష్ణువర్థన్‌రెడ్డి మాట్లాడుతూ విగ్రహ ప్రతిష్ట, అంకురార్పణ కార్యక్రమంలో బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ పాల్గొననున్నారని, సాయంత్రం చాగంటి కోటేశ్వరరావు ధార్మిక ప్రవచనాలు ఉంటాయన్నారు. శనివారం నుంచి శ్రీవారి సేవ లు ప్రారంభంకానున్నాయని చెప్పారు.




వైభవోత్సవానికి ప్రధాని మోదీ హాజరుకానున్నట్టు తెలిపారు. కేంద్ర మంత్రులు మనోహర్ పారికర్, స్మృతీ ఇరానీ, సురేష్ ప్రభు, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హాజరుకానున్నారు. 7న జరగనున్న శ్రీనివాస కల్యాణంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొననున్నారని నిర్వాహకులు తెలిపారు. ప్రతి రోజు సుప్రభాతం, తోమాల సేవ, కొలువు, అర్చన, నివేదన, శాత్తుమొర, విశేష పూజ, సర్వదర్శనం, సహస్ర దీపాలంకరణ, వీధోత్సవం, రాత్రి కైంకర్యం, ఏకాంత సేవలు ఉంటాయన్నారు. విశేష పూజగా సుదర్శన హోమం, వసంతోత్స వం, అష్టాదళ పాదపద్మారాధన, సహస్ర కలశాభిషేకం, తిరుప్పావడ, అభిషేకం, శ్రీనివాస కల్యాణం, పుష్పయాగం ఉంటుందని వెల్లడించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top