కశ్మీర్ లో నెలకొన్న కల్లోల పరిస్థితులపై పీఎం నరేంద్రమోదీ అధికారులు, మంత్రులతో సమావేశమయ్యారు.
న్యూఢిల్లీ: కశ్మీర్ లోయలో కల్లోల పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతీయ భధ్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్, హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, సీనియర్ కేబినేట్ సభ్యులతో మంగళవారం చర్చించారు. జమ్మూ-కశ్మీర్ నుంచి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా ఏ ఇతర శాఖలకు చెందిన మంత్రులుఇలా ఎవరూ చర్చల్లో లేకపోవడం గమనార్హం.
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేతో పీడీపీకి కూటమి ఉన్నా రాష్ట్రానికి సంబంధించిన విషయంలో ఒక్కరికి కూడా సమావేశంలో చోటు కల్పించకపోవడంపై జమ్మూ-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కేంద్రాన్ని టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేశారు. తెలివిగా ఆలోచించి తిరిగి కశ్మీర్ లో ప్రశాంతవాతావరణం ఏర్పడేలా చేయాలని హోం శాఖ భద్రతాదళాలకు సూచించింది.
కశ్మీర్ లో నెలకొన్న పరిస్థితులను సద్దుమణిగేలా చేసేందుకు హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అమెరికా ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. తాజా పరిస్థితులపై ముస్లిం మత పెద్దలతో చర్చించారు. బుధవారం వరకూ బంద్ ను కొనసాగిస్తామని వేర్పాటువాదులు ప్రకటించడంతో కశ్మీర్ లోని అన్ని జిల్లాల్లో కర్ఫ్యూని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.