ఫేస్‌బుక్ పరిచయంతో బ్లాక్ మెయిల్ చేసి.. | man arrested over facebook cheating | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్ పరిచయంతో బ్లాక్ మెయిల్ చేసి..

Sep 10 2016 10:11 PM | Updated on Oct 9 2018 5:39 PM

ఫేస్‌బుక్ పరిచయంతో బ్లాక్ మెయిల్ చేసి.. - Sakshi

ఫేస్‌బుక్ పరిచయంతో బ్లాక్ మెయిల్ చేసి..

ఫేస్‌బుక్ పరిచయంతో ఓ మహిళను బ్లాక్ మెయిల్ చేసి లక్షలు దండుకున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

నాగోలు: ఫేస్‌బుక్ పరిచయంతో ఓ మహిళను బ్లాక్ మెయిల్ చేసి రూ.14 లక్షలు తీసుకుని విదేశాలకు వెళ్లిన నిందితున్ని ఎల్‌బీనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎల్‌బీనగర్ సీఐ కాశిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొండ జిల్లా కోదాడ మండలం మారుతీనగర్‌కు చెందిన ఒట్టి జైపాల్‌రెడ్డి కుమారుడు రాజ్‌గోపాల్‌రెడ్డి ఎలక్టాన్రిక్స్ అండ్ కమ్యూనికేషన్‌‌సలో ఎంఎస్ చేశాడు. 2010 నుంచి 2012 వరకు లండన్‌లో ఉద్యోగం చేశాడు. అప్పుడే అతనికి ఎల్‌బీనగర్ శివగంగకాలనీలో నివాసముండే జి. సతీష్‌రెడ్డి భార్య సుష్మతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ముసుగులో రాజ్‌గోపాల్‌రెడ్డి సుష్మతో చనువుగా మాట్లాడేవాడు.
 
రాజ్‌గోపాల్‌రెడ్డి 2012 అక్టోబరులో నగరానికి వచ్చి కేపీహెచ్‌బీ కాలనీలో కొంత కాలం ఉన్నాడు. ఈ క్రమంలో రాజ్‌గోపాల్‌రెడ్డి, సుష్మ తరచూ ఫోన్‌లో మాట్లాడుతూ మరింత చనువు పెంచుకున్నాడు. సుష్మ మాటలను సెల్‌ఫోన్‌లో రికార్డు చేసిన రాజ్‌గోపాల్‌రెడ్డి భర్తకు చెబుతానని బెదిరించాడు. రాజ్‌గోపాల్‌రెడ్డి తల్లి క్లెమెనా, సోదరి తుమ్మరాజు ప్రియాంక ఖాతాలలో సుష్మ ద్వారా డబ్బులను వేయించుకున్నాడు. 2014 డిసెంబరు 14న సుష్మ ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. దీంతో భర్త ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. కొద్ది గంటలలో ఆమె తిరిగి ఇంటికి వచ్చి తనను రాజ్‌గోపాల్‌రెడ్డి అనే వ్యక్తి ఫేస్‌బుక్ ద్వారా పరిచయమై, మాయమాటలు చెప్పి తన ఫోన్ సంభాషణలను రికార్డు చేసి బెదిరిస్తున్నాడని తెలిపింది.
 
తన వద్ద నుంచి, బంధువుల నుంచి రూ.14 లక్షల వరకు రాజ్‌గోపాల్‌రెడ్డికి పంపానని పేర్కొంది. ఆ డబ్బులు తిరిగి ఎలాగైనా రాబట్టాలని భర్తను కోరింది. గత ఏడాది ఎల్‌బీనగర్ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  రాజ్‌గోపాల్‌రెడ్డి పాస్‌పోర్టు, వీసా సంబంధిత వివరాలనుఇమ్మిగ్రేషన్ అధికారులకు పంపించారు. శనివారం సాయంత్రం రాజ్‌గోపాల్‌రెడ్డి అమెరికా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. దీంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు సమాచారం ఇవ్వడంతో ఎల్‌బీనగర్ ఎస్‌ఐ శ్రీనివాస్ ఎయిర్‌పోర్టులో అతన్ని అరెస్ట్ చేసి పాస్‌పోర్టు, వీసాలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement