ప్రజలను విశ్వాసంలోకి తీసుకోరా? | jdu leader Sharad Yadav opposes Telangana | Sakshi
Sakshi News home page

ప్రజలను విశ్వాసంలోకి తీసుకోరా?

Nov 24 2013 1:57 AM | Updated on Jul 25 2018 4:09 PM

ప్రజలను విశ్వాసంలోకి తీసుకోరా? - Sakshi

ప్రజలను విశ్వాసంలోకి తీసుకోరా?

రాష్ట్ర శాసనసభను, ప్రజలను విశ్వాసంలోకి తీసుకోకుండా రాజ్యాంగంలోని మూడో అధికరణను దేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌పై వినియోగిస్తున్న కేంద్ర ప్రభుత్వ చర్య దేశానికి హాని చేస్తుందని జనతాదళ్-యునెటైడ్ (జేడీయూ) అధినేత శరద్‌యాదవ్ ఆందోళన వ్యక్తంచేశారు.

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర శాసనసభను, ప్రజలను విశ్వాసంలోకి తీసుకోకుండా రాజ్యాంగంలోని మూడో అధికరణను దేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌పై వినియోగిస్తున్న కేంద్ర ప్రభుత్వ చర్య దేశానికి హాని చేస్తుందని జనతాదళ్-యునెటైడ్ (జేడీయూ) అధినేత శరద్‌యాదవ్ ఆందోళన వ్యక్తంచేశారు. 3వ అధికరణను ఇలా ఉపయోగిస్తారని దేశంలో ఇప్పటివరకూ ఎవరూ ఆలోచించలేదని వ్యాఖ్యానించారు. ఏకపక్ష విభజనకు అవకాశం కల్పిస్తున్న ఈ అధికరణను సవరించాలని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న వాదన సరైనదేనని శరద్‌యాదవ్ ఏకీభవించారు.
 
 ఈ అంశంపై పార్లమెంటులో సీరియస్‌గా చర్చిస్తామని చెప్పారు. దీనిపై జేడీయూ తరఫున గళమెత్తుతామని ఆయన పరోక్షంగా స్పష్టంచేశారు. జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్ సీపీ నేతల బృందం శనివారం తనతో చర్చలు జరిపిన అనంతరం శరద్‌యాదవ్ మీడియాతో మాట్లాడారు. ‘‘మేం జగన్‌తో సవివరంగా చర్చించాం. దేశంలో తొలిసారి ఇలా జరుగుతోంది.  ఆర్టికల్ 3ను కేంద్రం ఆంధ్రప్రదేశ్‌పై ప్రయోగిస్తోంది. యూపీఏ చేపట్టిన ఈ చర్య దేశానికి హాని చేస్తుందని భావిస్తున్నా’’ అని పేర్కొన్నారు.
 
 జగన్ ఇచ్చిన వివరాలను చూస్తే రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉందన్నారు. దేశంలో ఇప్పటివరకు ఏర్పాటైన రాష్ట్రాలన్నీ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానంతోనే జరిగాయన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా అసెంబ్లీని విశ్వాసంలోకి తీసుకోలేదని తప్పుపట్టారు. అసెంబ్లీని పరిగణనలోకి తీసుకోకుండా విభజన వంటి చర్యలు దేశానికి మంచిదికాదని పునరుద్ఘాటించారు. మెజారిటీ ఉంటే ఏ రాష్ట్రం విషయంలోనైనా తాము అనుకున్నది చేయాలనుకోవటం సరికాదన్నారు. అక్కడి ప్రజలను విశ్వాసంలోకి తీసుకోకుండా రాష్ట్రాన్ని విభజించటాన్ని తప్పుపట్టారు. ఈ అంశం పార్లమెంటులో వచ్చినప్పడు చాలా సీరియస్‌గా చర్చ జరుగుతుందని చెప్పారు.
 
 అసెంబ్లీ తీర్మానం లేకుండా ఏ రాష్ట్రం ఏర్పాటైంది?
 
 ‘తెలంగాణ బిల్లు వస్తే పార్లమెంటులో మద్దతు ఇస్తారా? ఇవ్వరా?’ అన్న విలేకరుల ప్రశ్నకు.. ‘‘తొలుత చర్చకు బిల్లు వస్తుంది. చర్చ జరుగుతుంది’’ అని శరద్‌యాదవ్ బదులిచ్చారు. ‘గతంలో టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు వచ్చిన సమయంలో తెలంగాణకు మద్దతు ఇచ్చారు కదా?’ అని మరో విలేకరి ప్రశ్నించగా.. ‘‘లేదు.. లేదు.. నేనెప్పుడూ అలా మద్దతు ఇవ్వలేదు. ఈ సమస్య పరిష్కారానికి ఏదైనా మధ్యేమార్గం చూపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాను’’ అని చెప్పారు. ‘ఆర్టికల్ 3 ప్రకారం ముసాయిదా బిల్లును అసెంబ్లీ ఆమోదించాల్సిన అవసరం లేదు కదా?’ అని విలేకరులు ప్రస్తావించగా.. ‘‘ఆర్టికల్ 3ని అక్కడి అసెంబ్లీ ఆమోదించిందా..?’’ అని శరద్‌యాదవ్ వ్యాఖ్యానించారు. ‘ఆర్టికల్ 3 ప్రకారం అసెంబ్లీ తీర్మానం అవసరం లేదు కదా?’ అని ప్రశ్నించగా.. ‘‘అలా ఏ రాష్ట్రం ఏర్పాటైంది?’’ అని ప్రశ్నించారు. ‘‘దేశంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఇప్పటి వరకూ దేశంలో జరిగిన రాష్ట్రాల విభజన అంతా అసెంబ్లీల ఏకగ్రీవ తీర్మానంతోనే జరిగింది’’ అని స్పష్టంచేశారు. ‘ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 175 మందికి పైగా సీమాంధ్ర ఎమ్మెల్యేలు ఉన్నారు కదా?’ అని ప్రశ్నించగా.. ‘‘అలా అయితే ఈ సమస్య అన్ని రాష్ట్రాల్లో ఉంటుంది. మరి దీని అర్ధం ఏమిటి? దేశంలోని ప్రజలను విశ్వాసంలోకి తీసుకుంటారా? లేదా?’’ అని ప్రశ్నించారు. ‘మైనారిటీగా ఉన్నవారిని అణచివేస్తున్నారనే ఒక విలేకరి వ్యాఖ్యకు.. అలా ఏమీలేదని శరద్ బదులిచ్చారు. ‘తెలంగాణకు మీరు మద్దతు తెలుపుతున్నారా? లేదా?’ అన్న ప్రశ్నకు ‘‘ఈ విషయాన్ని చర్చలో చెప్తా’’ అని ఆయన బదులిచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement