ఐస్ క్రీం ఖరీదు రూ.30 చెప్పాడనీ.. | Ice cream seller asks for Rs 30, battered to death | Sakshi
Sakshi News home page

ఐస్ క్రీం ఖరీదు రూ.30 చెప్పాడనీ..

Jul 3 2016 12:08 PM | Updated on Sep 4 2017 4:03 AM

ఐస్ క్రీంల ఖరీదు రూ.30లు చెల్లించమన్నందుకు దారుణంగా కొట్టి చంపిన ఘటన నగరంలోని మహారాజపూర్ ప్రాంతంలో శుక్రవారం చోటుచేసుకుంది.

ఘజియాబాద్: ఐస్ క్రీంల ఖరీదు రూ.30లు చెల్లించమన్నందుకు దారుణంగా కొట్టి చంపిన ఘటన ఘజియాబాద్ లోని మహారాజపూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. బాధితుడు మహమ్మద్ ఇస్లాం కుటుంబం బీహార్ నుంచి వలస వచ్చి మహారాజపూర్ లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. ఇస్లాం తోపుడు బండితో ఐస్ క్రీంలు అమ్ముతూ జీవనం గడుపుతుండగా, అతని అన్నయ్య ముబారక్ సైకిల్ రిపేర్ షాపును నడుపుకొంటున్నాడు. ఇస్లాంకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ముబారక్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా నివసించే ఓ గ్యాంగ్ తరచూ ఇస్లాం వద్ద ఐస్ క్రీంలు తీసుకుని డబ్బులు ఇచ్చేది కాదని చెప్పాడు. శుక్రవారం మొత్తం ఆరుగురు సభ్యులున్న ముఠా రూ.30లు ఖరీదు చేసే ఆరు ఐస్ క్రీంలు ఇవ్వాలని ఇస్లాంను అడిగారు. ఇస్లాం ఐస్ క్రీంలు ఇచ్చి డబ్బు ఇవ్వాలని కోరగా వాళ్లు అందుకు నిరాకరించారు. అంతేకాకుండా మమ్మల్ని డబ్బులు అడుగుతావా? అంటూ ఇస్లాం మీద గొడవకు దిగడంతో తనను తాను కాపాడుకోవడం కోసం వారితో కొట్లాటకు దిగాడని చెప్పాడు.

ఆరుగురి ముఠాలో ఇద్దరు తన తమ్ముడి చేతులను లాగి పట్టుకున్నారని, మిగిలిన నలుగురు జాలి, దయ లేకుండా ఇస్లాంపై పిడి గుద్దుల వర్షం కురిపించారని ఆరోపించారు. దాంతో ఇస్లాం అక్కడికక్కడే కుప్పకూలిపోవడంతో  నిందితుల్లో ఇద్దరు ఆసుపత్రికి తరలించారని, అప్పటికే ఇస్లాం మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. కేసును నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకుని విచారిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement