'ఉగ్రవాదుల కంటే పండ్ల వ్యాపారులే డేంజర్' | fruit wenders are danger than terrorist | Sakshi
Sakshi News home page

'ఉగ్రవాదుల కంటే పండ్ల వ్యాపారులే డేంజర్'

Aug 20 2015 1:47 AM | Updated on Sep 3 2017 7:44 AM

వివిధ రకాల కాయలు త్వరగా పక్వానికి వచ్చేందుకు, ఆకర్షణీయంగా కనిపించేందుకు ప్రమాదకరమైన కాల్షియం కార్బైడ్‌ను వినియోగిస్తున్న పండ్ల వ్యాపారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

సాక్షి, హైదరాబాద్: వివిధ రకాల కాయలు త్వరగా పక్వానికి వచ్చేందుకు, ఆకర్షణీయంగా కనిపించేందుకు ప్రమాదకరమైన కాల్షియం కార్బైడ్‌ను వినియోగిస్తున్న పండ్ల వ్యాపారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కార్బైడ్ ఉపయోగిస్తున్న వ్యాపారులు ఉగ్రవాదుల కంటే ప్రమాదకారులని వ్యాఖ్యానించింది. ఉగ్రవాదులు నేరుగా వచ్చి చంపుతారని, కార్బైడ్ వాడే వ్యాపారులు పండ్ల ద్వారా విషాన్ని శరీరాల్లోకి చొప్పిస్తున్నారని మండిపడింది. ఈ వ్యవహారంలో కోర్టు సహాయకారి (అమికస్ క్యూరీ)గా వ్యవహరించాలని న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డిని కోరింది.

కార్బైడ్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలు, నాడీ వ్యవస్థపై ప్రభావం తదితర వివరాలను తమ ముందుంచాలని నిరంజన్‌రెడ్డికి ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే గత వారం పండ్ల మార్కెట్ తనిఖీలకు తామిచ్చిన ఆదేశాలను ఎప్పుడు అందుకున్నారు.. ఏ సమయంలో తనిఖీలు చేశారు.. తదితర వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 2కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement