
ఫ్యామిలీ కోర్టు జడ్జి ప్రపంచ రికార్డు!
ఉత్తరప్రదేశ్ లోని ముజాఫర్ నగర్ కుటుంబ న్యాయస్థానం ప్రిన్సిపల్ జడ్జి జస్టిస్ తేజ్ బహదుర్ సింగ్ అరుదైన ఘనత సాధించారు.
ముజాఫర్ నగర్: ఉత్తరప్రదేశ్ లోని ముజాఫర్ నగర్ కుటుంబ న్యాయస్థానం ప్రిన్సిపల్ జడ్జి జస్టిస్ తేజ్ బహదుర్ సింగ్ అరుదైన ఘనత సాధించారు. తక్కువ సమయంలో ఎక్కువ కేసులు పరిష్కరించి గౌరవ న్యాయమూర్తి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆయన పేరును గిన్నిస్ బుక్ లో ఎక్కించనున్నారు. 327 రోజుల్లో 6,065 కేసులు పరిష్కరించి రికార్డు లిఖించారు. జిల్లాలో న్యాయవాదులు సమ్మె చేసినప్పటికీ ఆయన ఈ ఘనత సాధించడం విశేషం.
పెండింగ్ కేసులను తగ్గించి, పిటిషనర్లకు న్యాయం చేయాలన్న లక్ష్యంతో పనిచేసినట్టు జస్టిస్ తేజ్ బహదుర్ సింగ్ తెలిపారు. దేశంలో అత్యధిక కేసులు పరిష్కరించిన ఘనత తనదేనని చెప్పారు. విడిపోవాలనుకున్న 903 జంటలను మళ్లీ కలిపానని వెల్లడించారు. జస్టిస్ తేజ్ బహదుర్ సింగ్ పేరును ప్రపంచ రికార్డుల్లో నమోదు చేయనున్నట్టు గిన్నిస్ బుక్ నిర్వాహకులు తెలిపారు.