‘తెలంగాణ ’ క్రెడిట్ వ్యక్తులకా? : భట్టి విక్రమార్క | Deputy speaker Mallu Bhatti Vikramarka allegations | Sakshi
Sakshi News home page

‘తెలంగాణ ’ క్రెడిట్ వ్యక్తులకా? : భట్టి విక్రమార్క

Aug 14 2013 2:32 AM | Updated on Mar 18 2019 7:55 PM

రాష్ట్రాన్ని విభజించాలన్న కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాన్ని పార్టీ నేతలు తమ ఘనతగా ప్రచారం చేసుకుంటున్నారని, అలాంటి ప్రయత్నాలకు చెక్ పెట్టాలని తెలంగాణకు చెందిన కొందరు మంత్రులు నిర్ణయానికొచ్చారు.

 దీనికి చెక్ పెట్టాల్సిందే: తెలంగాణ మంత్రులు
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని విభజించాలన్న కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాన్ని పార్టీ నేతలు తమ ఘనతగా ప్రచారం చేసుకుంటున్నారని, అలాంటి ప్రయత్నాలకు చెక్ పెట్టాలని తెలంగాణకు చెందిన కొందరు మంత్రులు నిర్ణయానికొచ్చారు. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ చలువ, తెలంగాణ కాంగ్రెస్ నేతల సమష్టి కృషివల్లే రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిందే తప్ప ఎవరి ఘనతో కాదని స్పష్టంగా ప్రజల్లోకి వెళ్లేలా విస్తృత ప్రచారం కల్పించాలని భావిస్తున్నారు. మంగళవారం డీకే అరుణ నివాసంలో మంత్రులు పి. సుదర్శన్‌రెడ్డి, కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బసవరాజు సారయ్య, శ్రీధర్‌బాబు, డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క సమావేశమై ఆయా అంశాలపై చర్చించారు. ఇటీవల కాలంలో కొందరు తెలంగాణ ముఖ్య నేతలు మీడియా సమావేశాలను ఏర్పాటు చేసి తెలంగాణ తమ వల్లే సాధ్యమైందనే సంకేతాలను ప్రజల్లోకి పంపి వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారని సమావేశంలో ఇద్దరు మంత్రులు అభిప్రాయపడ్డారు. దీనివల్ల పార్టీకి కాకుండా వ్యక్తుల ప్రతిష్ట పెరుగుతోందని, దీనికి ఆదిలోనే చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇతర నేతలంతా వారి వాదనతో ఏకీభవించినట్లు తెలిసింది.
 
 సమస్యలపై కూలంకషంగా చర్చించాలి..
 తెలంగాణ విషయంలో సీమాంధ్ర ప్రజలు లేవనెత్తుతున్న అభ్యంతరాలు, రాష్ట్ర ఏర్పాటు తరువాత ఉద్యోగ, ఉపాధి, విద్యుత్, సాగునీటి సమస్యలను ఎలా అధిగమించాలనే అంశాలపై కూడా కూలంకషంగా చర్చించాల్సిన అవసరం ఉందని సమావేశంలో మంత్రులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా తెలంగాణ వస్తే ఈ ప్రాంత నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు లభిస్తాయంటూ ప్రజలకు ఇప్పటికే ఎన్నో ఆశలు కల్పించామని, దీనిని అధిగమించేందుకు బృహత్ ప్రణాళికను రూపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
 
 అలాగే విభ జన జరిగిన వెంటనే విద్యుత్ సమస్య తీవ్రంగా ఉండే అవకాశమున్నందున.. విద్యుత్ కొరత లేకుండా చేసేందుకు మార్గాలను అన్వేషించాలని చర్చించారు. సాగునీరు, హైదరాబాద్ అంశాలపై సీమాంధ్రులు లేవనెత్తుతున్న అభ్యంతరాలకు మధ్యేమార్గ ప్రతిపాదనలను కూడా రూపొందించి సాఫీగా తెలంగాణ ప్రక్రియ సాగేలా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనే భావనకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయా అంశాలపై మరోసారి చర్చించేందుకు బుధవారం తెలంగాణ మంత్రులంతా కలిసి సమావేశం కావాలనే నిర్ణయానికి వచ్చారు. మంత్రి శ్రీధర్‌బాబు బుధవారం ఉదయం మంత్రులందరికీ మంత్రుల నివాస ప్రాంగణంలోని క్లబ్‌హౌస్‌లో అల్పాహార విందు ఏర్పాటు చేశారు. అనంతరం మీడియాతో ‘గెట్ టు గెదర్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
 
 కేబినెట్లో కొత్తవారిని నియమించాలి: కేఎల్లార్
 రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మంత్రులు ఇచ్చిన రాజీనామా లేఖలను వెంటనే ఆమోదించి వారిస్థానంలో వేరే వారిని నియమించి ప్రభుత్వ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాలని మేడ్చల్ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి కోరారు. ప్రభుత్వ కార్యక్రమాలు మందగించకుండా చూడాల్సిన బాధ్యత సీఎంపైనే ఉందని, రాష్ట్ర విభజన ప్రక్రియ తథ్యమని, అయితే అంతవరకు కూడా ఏ ప్రభుత్వ కార్యక్రమం అమలు ఆగడానికి వీల్లేదన్నారు. మంగళవారం సీఎల్పీ కార్యాలయం ఎదుట ఆయన మీడియాతో మాట్లాడుతూ రచ్చబండ సహా అన్ని కార్యక్రమాలూ ముందుకు తీసుకువెళ్లాలన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement